ఏపీలో విమానాశ్రయాలన్నీ నష్టాల్లోనే

ఆంధ్రప్రదేశ్‌లోని విమానాశ్రయాలన్నీ నష్టాల్లోనే నడుస్తున్నాయి. గత అయిదేళ్లలో ఒక్క ఏడాది మాత్రమే విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు లాభాలు వచ్చాయి.

Updated : 07 Feb 2023 06:16 IST

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని విమానాశ్రయాలన్నీ నష్టాల్లోనే నడుస్తున్నాయి. గత అయిదేళ్లలో ఒక్క ఏడాది మాత్రమే విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు లాభాలు వచ్చాయి. సోమవారం రాజ్యసభలో ఓ లిఖిత పూర్వక ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి వీకేసింగ్‌ ఇచ్చిన సమాధానం ఈ విషయాన్ని వెల్లడించింది. అత్యధిక నష్టాలు మూటగట్టుకున్న విమానాశ్రయాల్లో విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప, విశాఖపట్నం విమానాశ్రయాలు వరుస స్థానాలను ఆక్రమించాయి. నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ ప్రకారం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్న 25 విమానాశ్రయాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించామని, అందులో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు ఉన్నాయని కేంద్రమంత్రి వివరించారు.

ఏపీ కోరితే దగదర్తి ఎయిర్‌పోర్టును ‘ఉడాన్‌’లో చేర్చుతాం

ఆంధ్రప్రదేశ్‌లోని దగదర్తి ఎయిర్‌పోర్టును ప్రస్తుతం ‘ఉడాన్‌’లో చేర్చలేదని, ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విన్నవిస్తే భవిష్యత్తులో జరిగే బిడ్డింగుల కోసం దాన్ని ఈ పథకంలో చేరుస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకేసింగ్‌ తెలిపారు. సోమవారం రాజ్యసభలో వైకాపా సభ్యుడు బీద మస్తాన్‌రావు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. దగదర్తి నుంచి ఉడాన్‌ కింద విమానాలను నడిపేందుకు ఎవరైనా బిడ్డింగ్‌ దాఖలు చేస్తే... దాన్ని నిబంధనలకు లోబడి పరిగణనలోకి తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని