ఆదాయపన్ను చెల్లింపులు రూ.93,318 కోట్లు

2022-23 సంవత్సరం జనవరి 31 నాటికి 18 ఏళ్లలోపు వారు  4,861 మంది ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేశారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు.

Updated : 07 Feb 2023 07:25 IST

కేంద్ర ఆర్థిక శాఖ  సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి

ఈనాడు, దిల్లీ: 2022-23 సంవత్సరం జనవరి 31 నాటికి 18 ఏళ్లలోపు వారు  4,861 మంది ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేశారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సోమవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అదే సమయంలో 18-35 ఏళ్ల మధ్య వయసున్న వారు 2,09,06,829 ఐటీఆర్‌లు సమర్పించినట్లు మంత్రి వెల్లడించారు. రీఫండ్‌కు ముందు ఐటీఆర్‌ల ప్రకారం చెల్లించిన స్థూల పన్నులు రూ.93,318 కోట్లు అని మంత్రి పేర్కొన్నారు.

ప్రధానమంత్రి ఆది ఆదర్శ్‌ గ్రామ యోజన (పీఎంఏఏజీవై) కింద పాలన, నిధులలోటు భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో నాలుగు, చిత్తూరు 1, తూర్పు గోదావరి 69, గుంటూరు 6, కృష్ణా 7, కర్నూలు 2, ప్రకాశం 6, శ్రీకాకుళం 66, విశాఖపట్నం 225, విజయనగరం 104, పశ్చిమ గోదావరి 26, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో 1, తెలంగాణలో ఆదిలాబాద్‌ జిల్లాలో 204, కరీంనగర్‌ 1, ఖమ్మం 163, మహబూబ్‌నగర్‌ 31, మెదక్‌ 22, నల్గొండ 16, నిజామాబాద్‌ 17, రంగారెడ్డి 11, వరంగల్‌ జిల్లాలో 68 గ్రామాలకు రూ.20.38 లక్షల చొప్పున కేటాయించినట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుక సింగ్‌ సరుతా తెలిపారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ సమాధానమిచ్చారు. గిరిజన ఉప ప్రణాళిక కింద ఖమ్మం జిల్లాలోని సరోజినిదేవి మహిళా మండలి ఎన్‌జీఓకి గురుకుల పాఠశాల నిర్వహణకు 2018-19లో రూ.13.57 లక్షలు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. తర్వాత సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని మంత్రి పేర్కొన్నారు.

జిల్లాల విభజన, నూతన జిల్లాల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అనంతపురం, బాపట్ల, చిత్తూరు, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, గుంటూరు, నంద్యాల, ఎన్టీఆర్‌, పార్వతీపురం మన్యం, తిరుపతి, పశ్చిమ గోదావరి, వైయస్‌ఆర్‌, తెలంగాణలో జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, జనగామ, జోగులాంబ గద్వాల, నిజామాబాద్‌, కొత్తగూడెం భద్రాద్రి, ఆదిలాబాద్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, మేడ్చల్‌, ములుగు, మహబూబ్‌నగర్‌, నారాయణపేట్‌, నిర్మల్‌, పెద్దపల్లి, సంగారెడ్డి, మెదక్‌, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, వికారాబాద్‌, వనపర్తి, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు లేవని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. చిత్తూరు, ఖమ్మం ఎంపీలు ఎన్‌.రెడ్డప్ప, నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.

కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద వివిధ సంస్థలు 2018-19లో ఆంధ్రప్రదేశ్‌లో రూ.665.97 కోట్లు, తెలంగాణలో రూ.428.06 కోట్లు, 2019-20లో ఏపీలో రూ.710.12 కోట్లు, తెలంగాణలో రూ.445.80 కోట్లు, 2020-21లో ఏపీలో రూ.715.81 కోట్లు, తెలంగాణలో 624.22 కోట్లు వ్యయం చేసినట్లు కేంద్ర గణాంకాల శాఖ మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ తెలిపారు. విశాఖపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం ఎంపీలు ఎం.వి.వి.సత్యనారాయణ, బెల్లాన చంద్రశేఖర్‌, మార్గాని భరత్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ సమాధానమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని