ఉత్తరాంధ్రలో ధాన్యం కొనకుంటే కష్టం

‘మా ప్రాంతంలో రైతులకు పంట అంటేనే వరి. అక్కడ ప్రభుత్వం పూర్తిగా ధాన్యం సేకరించకుంటే వారికి చాలా కష్టం’ అని ఉత్తరాంధ్రకు చెందిన ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు.

Published : 09 Feb 2023 04:41 IST

సీఎంకు వివరించిన మంత్రులు ధర్మాన, బొత్స, రాజన్నదొర
అక్కడ మొత్తం ధాన్యం కొనాలని సీఎం జగన్‌ ఆదేశం

ఈనాడు, అమరావతి: ‘మా ప్రాంతంలో రైతులకు పంట అంటేనే వరి. అక్కడ ప్రభుత్వం పూర్తిగా ధాన్యం సేకరించకుంటే వారికి చాలా కష్టం’ అని ఉత్తరాంధ్రకు చెందిన ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ‘ఈసారి ధాన్యానికి మంచి ధర ఇచ్చి కొన్నాం. రైతులకు మంచి జరిగింది’ అని ముఖ్యమంత్రి అనగా... ‘ప్రస్తుతం కొనడం ఆపేశారు. లక్ష్యాలు పూర్తయ్యాయని సేకరించడం లేదని రైతులు ఆందోళనగా ఉన్నారు’ అని మంత్రులు వివరించారు. సీఎం స్పందిస్తూ ‘ఇంతకాలం కొని చివర్లో కొనకుండా రైతులను ఇబ్బంది పెట్టడమేంటి? ఈ నెలాఖరు వరకు మొత్తం ధాన్యం కొనేందుకు ఏర్పాట్లు చేయండి’ అని అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో అధికారులు వెళ్లిపోయాక చివర్లో మంత్రులతో సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రులు వివిధ అంశాలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ధాన్యంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ‘ధాన్యం సేకరణలో ఇప్పుడు అమలు చేస్తున్న విధానం బాగుంది. దీనిపై మంచి ఫీడ్‌బ్యాక్‌ ఉంది’ అని చెప్పినట్లు తెలిసింది. ‘ధాన్యాన్ని తీసుకువెళ్లినప్పుడు మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారని రైతులు చెబుతున్నారు’ అని మంత్రి దాడిశెట్టి రాజా చెప్పారు. సీఎం స్పందిస్తూ... ‘మధ్యలో మిల్లర్లు ఎందుకొచ్చారు. రైతు భరోసా కేంద్రంలోనే ధాన్యం నాణ్యతను నిర్ధారిస్తున్నారు. రైతులకు ఎఫ్‌టీఓ జారీ చేస్తున్నారు. ఆ ఎఫ్‌టీఓను చూశారా’ అని మంత్రిని సీఎం అడగ్గా... లేదని ఆయన చెప్పడంతో ‘అది ఇస్తున్నారు. రైతులకు ఎక్కడైనా మిల్లర్ల నుంచి ఇబ్బంది ఉంటే అక్కడి నుంచే నాకు లేదా అధికారులకు ఫోన్‌ చేయండి’ అనిచెప్పినట్లు సమాచారం.

ఆ ముగ్గురిలాగే మిగిలిన వాళ్లూ బాగా చేయాలి

ప్రతిపక్షాల విమర్శలను మంత్రులు తిప్పికొట్టే అంశం చర్చకొచ్చినప్పుడు ‘మంత్రి బొత్స, మరో ఇద్దరు, ముగ్గురు మంత్రులు ముందున్నారు. వారు బాగా స్పందిస్తున్నారు’ అని కొందరు మంత్రులు సరదాగా వ్యాఖ్యానించారు. సీఎం స్పందిస్తూ... ‘ఆ విషయంలో బొత్స ముందున్నారు. కారుమూరి నాగేశ్వరరావు, రజిని కూడా ప్రభుత్వం చేస్తున్న మంచిని చెబుతూ, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో బాగా పనిచేస్తున్నారు. వారిలాగే మిగిలిన మంత్రులూ చేయాలి’ అని సూచించినట్లు తెలిసింది.

అది చంద్రబాబు ప్రభుత్వమిచ్చిన జీవోనే కదా?

వైకాపా కార్యాలయాలకు భూముల కేటాయింపు విషయం చర్చకొచ్చినప్పుడు రెండు, మూడు జిల్లాల్లో తెదేపా వారు కోర్టుల్లో కేసులు వేశారని మంత్రులు చెప్పినట్లు తెలిసింది. సీఎం స్పందిస్తూ... ‘ఆయన (చంద్రబాబును ఉద్దేశించి) ప్రభుత్వమిచ్చిన జీవో ప్రకారమే కదా మనం భూములు కేటాయిస్తోంది. అందులో మనం కొత్తగా చేసిందేముంది. ఆ విషయంపై ఎందుకు రాద్ధాంతం జరుగుతోంది’ అని ప్రశ్నించినట్లు తెలిసింది.

ఏనుగులను తరలించడమా... షెల్టర్‌ ఇవ్వడమా!

పార్వతీపురం జిల్లాలో ఏనుగులు పంట పొలాలను ధ్వంసం చేస్తుండడం, వారించేందుకు వెళ్లే వారిపైనా దాడి చేస్తుండడంపై ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర సీఎంకు వినతిపత్రం సమర్పించారు. సంబంధిత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ చిత్తూరు జిల్లాలోనూ ఏనుగుల సమస్య ఉందన్నారు. ‘ఏనుగుల కదలికలను గుర్తించేందుకు ట్రాకర్స్‌ను అటవీశాఖ ఏర్పాటు చేసింది. అలాంటి ఓ ట్రాకర్‌పైనే ఇటీవల ఏనుగు దాడి చేసింది’ అని రాజన్నదొర గుర్తుచేశారు. ‘మీ ఇద్దరు మంత్రులు, సంబంధిత శాఖల అధికారులతో దీనిపై చర్చించండి. ఏనుగులను వేరే చోటికి తరలించడమా? వాటికి ప్రత్యేకంగా ఒక జోన్‌లో షెల్టర్‌ ఏర్పాటు చేయడమా అనేది చూడండి’ అని సీఎం జగన్‌ సూచించారు. 

ఇళ్లు కట్టుకునేందుకు సాయమడుగుతున్నారు

‘సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకునేందుకు ప్రభుత్వ సాయం కావాలని ‘గడప గడపకు’ వెళుతున్నప్పుడు చాలామంది కోరుతున్నారు’ అని మంత్రి విశ్వరూప్‌ చెప్పారు. ‘జగనన్న కాలనీల్లో కట్టుకునే వెసులుబాటు ఉంది’ అని అధికారులు చెప్పబోగా... ‘అందులో స్పష్టత ఉండడం లేదు. హౌసింగ్‌ వారిని సంప్రదిస్తే సరైన స్పందన రావడం లేదని అర్జీదారులు చెబుతున్నారు. అందువల్లే దీనిపై ఏకరూప విధానం ఇస్తే బాగుంటుంది’ అని సీఎంను మంత్రి కోరినట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు