AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు డిస్మిస్‌ ప్రతిపాదన తిరస్కరణ

ఆంధ్రప్రదేశ్‌ నిఘా విభాగం మాజీ అధిపతి, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్‌ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.

Updated : 15 Feb 2023 09:43 IST

2024 మే 31 వరకూ రెండు ఇంక్రిమెంట్లు నిలిపేయాలి
ఏపీ సీఎస్‌కు లేఖ రాసిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నిఘా విభాగం మాజీ అధిపతి, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్‌ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించడానికి, తప్పనిసరిగా పదవీ విరమణ చేయించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. పెనాల్టీగా 2024 మే 31వ తేదీ వరకూ రెండు ఇంక్రిమెంట్లు నిలిపేయాలని సూచించింది. ఈ చర్య తీసుకుని ఆ విషయాన్ని తమకు తెలియజేయాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అండర్‌ సెక్రటరీ సంజీవ్‌కుమార్‌... ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డికి జనవరి 10న లేఖ రాశారు. మంగళవారం అది వెలుగుచూసింది.

భద్రత, నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఏబీ వెంకటేశ్వరరావుపై అభియోగాలు మోపిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆయనను ఉద్యోగం నుంచి డిస్మిస్‌ చేయాలంటూ 2021 డిసెంబరు 16న కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఏ మేరకు పెనాల్టీ విధించాలో సూచించాలని కేంద్ర హోంశాఖ... యూపీఎస్సీని గతేడాది ఫిబ్రవరిలో కోరింది. రెండు ఇంక్రిమెంట్లు నిలిపేయాలని యూపీఎస్సీ సిఫార్సు చేసింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ డిస్మిస్‌ చేయడానికి యూపీఎస్సీ సిఫార్సు చేయలేదని పేర్కొంటూ కేంద్ర హోంశాఖ ఏపీ సీఎస్‌కు లేఖ రాసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని