Heart Attack: పాఠం చెబుతుండగా గుండెపోటు.. ఉపాధ్యాయుడు మృతి

ఉపాధ్యాయుడు పాఠం బోధిస్తున్నారు... పిల్లలంతా ఆసక్తిగా, శ్రద్ధగా వింటున్నారు... అంతలో ఒక్కసారిగా పాఠం ఆగింది... ఉపాధ్యాయుడు గుండెపోటుతో కూర్చున్న కుర్చీలోనే ఒరిగిపోయారు.

Updated : 05 Mar 2023 06:49 IST

వేటపాలెం, చీరాల నేరవిభాగం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుడు పాఠం బోధిస్తున్నారు... పిల్లలంతా ఆసక్తిగా, శ్రద్ధగా వింటున్నారు... అంతలో ఒక్కసారిగా పాఠం ఆగింది... ఉపాధ్యాయుడు గుండెపోటుతో కూర్చున్న కుర్చీలోనే ఒరిగిపోయారు. ఈ హృదయ విదారక ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో చోటుచేసుకుంది. ఎ.వి.బాబు(45) మూడేళ్లుగా వాకావారిపాలెం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్నారు. శనివారం ఉదయం పిల్లలకు తరగతి గదిలో పాఠం చెబుతుండగా గుండెపోటుకు గురై కూర్చున్న కుర్చీలోనే ప్రాణాలు వదిలారు. నిశ్చేష్టులైన విద్యార్థులు విషయాన్ని ఇతర ఉపాధ్యాయులకు చెప్పారు. పాఠశాల పక్కన ఉన్న ఆరోగ్య ఉపకేంద్రం వైద్యసిబ్బంది చేరుకుని ఎ.వి.బాబును పరీక్షించారు. మరోపక్క 108కి సమాచారం అందించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు సిబ్బంది నిర్ధరించారు. ఎ.వి.బాబు స్వగ్రామం జె.పంగులూరు. 2002లో ఉపాధ్యాయుడిగా చేరారు. భార్య రాజామణి కొండమంజులూరులో ఎస్జీటీగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఉపాధ్యాయుడు తమ కళ్లముందే చనిపోవడంతో విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని