వంశధార.. కన్నీటి చార!

శ్రీకాకుళం జిల్లాకు ఊతమిస్తున్న వంశధార జలాశయం నిర్వాసితుల కష్టాలు తీరడం లేదు. జగన్‌ ప్రభుత్వం చెల్లిస్తామన్న అదనపు పరిహారం మంజూరులో తీవ్ర జాప్యం చేస్తున్నారు.

Published : 08 Mar 2023 05:20 IST

నిర్వాసితులకు అదనపు పరిహారం అందక కష్టాలు
సీఎం పర్యటనకు ముందు కొంత జమ చేసి హడావుడి
ఎనిమిది నెలలు దాటినా స్పందన శూన్యం
న్యూస్‌టుడే, హిరమండలం

శ్రీకాకుళం జిల్లాకు ఊతమిస్తున్న వంశధార జలాశయం నిర్వాసితుల కష్టాలు తీరడం లేదు. జగన్‌ ప్రభుత్వం చెల్లిస్తామన్న అదనపు పరిహారం మంజూరులో తీవ్ర జాప్యం చేస్తున్నారు. 2022 జూన్‌లో జిల్లాకు ముఖ్యమంత్రి జగన్‌ వచ్చే రెండు రోజుల ముందు హడావుడిగా కొందరు నిర్వాసితుల ఖాతాలకు రూ.లక్ష చొప్పున అదనపు పరిహారం జమ చేశారు. 8 నెలలు పూర్తయినా చాలా మందికి పీడీఎఫ్‌, యూత్‌ ఆర్‌ఆర్‌ ప్యాకేజీ, భూములకు పరిహారం జమ కాలేదు. మరో రూ.25 కోట్లు మంజూరు కావాలని, పరిహారం పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని గత జనవరిలో కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ హామీనిచ్చినా నిష్ఫలమే అయింది.

సీఎం వస్తున్నారని హడావుడి

వంశధార నిర్మాణం కారణంగా హిరమండలం మండలంలో 14,837 మంది నిర్వాసితులయ్యారు. ఎల్‌.ఎన్‌.పేట మండలంలో ఒక నిర్వాసిత గ్రామం, కొత్తూరు మండలంలో 5 గ్రామాలు ఉన్నాయి. 2005 గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం తెదేపా ప్రభుత్వం పీడీఎఫ్‌ ప్యాకేజీ, ఎకరాకు 1.29 లక్షల చొప్పున ఇచ్చింది. జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. ఇక్కడికి వచ్చి తాము అధికారంలోకి వస్తే 2013 భూసేకరణ చట్టం అమలుచేసి న్యాయం చేస్తామని హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చాక జగన్‌ ప్రభుత్వం జాప్యం చేయడంపై నిర్వాసితులు ఆందోళన చేశారు. చివరకు జగన్‌ జిల్లాకు వస్తున్నారని అప్పటికప్పుడు ప్రభుత్వం అదనపు పరిహారం కింద రూ.216 కోట్లు ఇస్తూ 2022 జూన్‌ 21న జీవో 1632 ఇచ్చి మూడు విడతల్లో కొందరు నిర్వాసితుల ఖాతాలకు పరిహారం సొమ్ము జమ చేసింది. ఆ తర్వాత విస్మరించడంతో పరిహారం అందని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిరసనలు తెలిపినా..

గార్లపాడు గ్రామం (తాయమాంబపురం ఆర్‌ఆర్‌ కాలనీ) వంశధార నిర్వాసితులు 2022 అక్టోబరు 10న హిరమండలం తహసీల్దారు కార్యాలయం ముందు నిరసన తెలిపి తహసీల్దారు బి.మురళీమోహనరావుకు విన్నపమిచ్చారు. గార్లపాడు రెవెన్యూ పరిధిలోని 70 మంది రైతుల సొమ్ము జేసీ లాగిన్‌లో ఉంది. మరో 200మందికి భూపరిహారం మంజూరు కాలేదు.

* సుభలయ ఆర్‌ఆర్‌ కాలనీలో 550 నిర్వాసిత గ్రామాల కుటుంబాలున్నాయి. వారిలో 40% మందికి పరిహారం జమ కాలేదు. ఎక్కువగా పీడీఎఫ్‌, యూత్‌ ప్యాకేజీ చెల్లించలేదని నిర్వాసితులు వాపోతున్నారు. వీరిలో నిరుపేద కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి.

* మెట్టూరు బిట్‌2, బిట్‌1, హిరమండలం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆర్‌ఆర్‌ కాలనీ, గాజులు కొల్లివలస, కర్లెమ్మ, మహసింగి, పులిపుట్టి గూనభద్ర ఆర్‌ఆర్‌ కాలనీల్లో ఎక్కువ మందికి పరిహారం రావాల్సి ఉంది. హెల్ప్‌డెస్క్‌ల్లో అందిన దరఖాస్తులు పరిశీలించి సబ్‌కలెక్టర్‌ ద్వారా కలెక్టరేట్‌కు పంపించామని హిరమండలం తహసీల్దార్‌ బి.మురళీమోహన్‌రావు తెలిపారు. అక్కడినుంచి సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ఎక్కువ మందికి అదనపు పరిహారం జమయిందని, కొంతమందికి అందాల్సి ఉందన్నారు. ఉన్నతాధికారులకు నివేదించామన్నారు.


పీడీఎఫ్‌ ప్యాకేజీ నిర్వాసిత కుటుంబాలు: 4,981
యూత్‌ ప్యాకేజీ రావాల్సినవారు: 3,501
భూములకు సొమ్ము రావాల్సిన రైతులు: 6,984
భూవిస్తీర్ణం:  4,783 ఎకరాలు
మొత్తం నిర్వాసితులు: 14,837


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు