MLC Kavitha: 16న మళ్లీ రావాలి

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శనివారం 8 గంటలపాటు సుదీర్ఘంగా విచారించింది.

Updated : 12 Mar 2023 05:57 IST

కవితను 8 గంటల పాటు విచారించిన ఈడీ
మద్యం కేసుతో తనకు సంబంధం లేదన్న ఎమ్మెల్సీ
ఈనాడు - దిల్లీ

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శనివారం 8 గంటలపాటు సుదీర్ఘంగా విచారించింది. ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరుకావాలని పేర్కొంది. దిల్లీలోని ఈడీ కార్యాలయమైన పరివర్తన్‌భవన్‌లో ఆమె శనివారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విచారణను ఎదుర్కొన్నారు. సాయంత్రం 4-5 గంటల మధ్య అధికారులు భోజన విరామం ఇచ్చారు. రాత్రి 8 గంటలకు విచారణ ముగిశాక ఆమె బయటికొచ్చారు. కవిత, వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌రెడ్డిలకు చెందిన బినామీ సంస్థ సౌత్‌గ్రూప్‌ ద్వారా ఆప్‌ నేతలకు హవాలా మార్గంలో రూ.100 కోట్ల ముడుపులు చెల్లించి దిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా రూపొందించుకున్నారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఇప్పటివరకు సేకరించిన సమాచారం, అరెస్టు చేసిన నిందితుల నుంచి చట్టబద్ధంగా సేకరించిన వాంగ్మూలాల ఆధారంగా ఎమ్మెల్సీ కవితను ఈడీ శనివారం ప్రశ్నించింది.

సాధారణ అంశాలే..

కవిత విచారణ సాధారణ అంశాలపైనే సాగినట్లు తెలిసింది. ఈడీ కస్టడీలో ఉన్న మిగతా నిందితులను కవిత ముందు కూర్చోబెట్టి ప్రశ్నిస్తారని వార్తలొచ్చినా అలా చేయలేదని సమాచారం. తదుపరి దశలో ఆ ప్రక్రియను అనుసరించనున్నట్లు తెలిసింది. విచారణలో.. ఆమె తనపై వచ్చిన ఆరోపణలను ఖండించినట్లు సమాచారం. దిల్లీ మద్యం విధాన రూపకల్పనతో కానీ, ముడుపుల గురించి కానీ తనకు తెలియదని పేర్కొన్నట్లు తెలిసింది. బుచ్చిబాబు, అరుణ్‌పిళ్లైలు వ్యక్తిగతంగా తెలిసినా, వారి వ్యవహారాలతో కానీ.. సౌత్‌గ్రూప్‌, ఇండోస్పిరిట్‌ సంస్థలతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని సెక్షన్‌ 50 కింద ఈడీ అధికారులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు తెలిసింది. అధికారులు ఆమె ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగినా.. ఆ విషయం నిర్ధారణ కాలేదు. విచారణ అనంతరం బయటికొచ్చిన కవితకు అనుకూలంగా భారాస నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఆమెకు స్వాగతం పలికారు. విచారణకు ముందు, తర్వాత.. కవిత పిడికిలి బిగించి చూపుతూ.. చిరునవ్వు చిందించారు. రాత్రి ఇంటికి వచ్చాక.. పార్టీ మహిళా కార్యకర్తలు ఆమెకు దిష్టి తీసి ఇంట్లోకి స్వాగతించారు. తర్వాత మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులతో కలిసి కవిత హైదరాబాద్‌కు పయనమయ్యారు.

ఇదీ జరిగింది..

* ఎమ్మెల్సీ కవిత ఉదయం 23 తుగ్లక్‌ రోడ్డులోని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారిక నివాసంలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, న్యాయవాదులతో మంతనాలు సాగించారు.

* ఉదయం 10.55 గంటలకు అక్కడి నుంచి ఈడీ కార్యాలయానికి కారులో బయలుదేరారు.

* కవితకు సంఘీభావం ప్రకటిస్తూ భారత్‌ జాగృతి, భారాస కార్యకర్తలు ఆమెకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఆమె కారు బయటకు వెళ్లకుండా మూడు నిమిషాల పాటు అడ్డుకున్నారు. పోలీసులు వారిని పక్కకు తొలగించారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి, భాజపాలకు వ్యతిరేకంగా, భారాస, కేసీఆర్‌, కవితలకు అనుకూలంగా నినాదాలు చేశారు. కవిత కారు 10.58 గంటలకు అక్కడి నుంచి బయలుదేరింది.

* ఉదయం 11.03 గంటలకు ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. వెంట ఆమె భర్త అనిల్‌, న్యాయవాది వచ్చారు. వారిని ఈడీ సిబ్బంది లోపలికి అనుతించకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు.

* మల్కాజిగిరి, అందోలు ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, చంటి క్రాంతికిరణ్‌, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో భారాస ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు రోజంతా ఈడీ కార్యాలయం ఎదుట ఉన్నారు. కేంద్రం, దర్యాప్తు సంస్థల తీరుపై వారు విమర్శలు ఎక్కుపెట్టారు.

* ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఈడీ కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో దిల్లీ పోలీసు బలగాలను మోహరించారు.

పిళ్లై ఇచ్చిన వాంగ్మూలాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపణ

తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు.. ఈడీ అధికారులు బలవంతంగా రెండు డాక్యుమెంట్లపై సంతకాలు చేయించినందునే దిల్లీ మద్యం కేసు నిందితుడు అరుణ్‌ రామచంద్ర పిళ్లై వాంగ్మూలం ఉపసంహరణకు అనుమతి కోరుతున్నారని ఆయన న్యాయవాదులు శనివారం వెల్లడించారు. ఈ మేరకు పిళ్లై.. రౌజ్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. కోర్టు దీనిపై విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని