సంక్షిప్త వార్తలు(11)

జగనన్న విద్యాదీవెన పథకం కింద 2022 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్ల నగదును సీఎం జగన్‌ ఆదివారం బటన్‌ నొక్కి జమ చేయనున్నారు.

Updated : 19 Mar 2023 06:38 IST

నేడు జగనన్న విద్యాదీవెన సాయం విడుదల

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జగనన్న విద్యాదీవెన పథకం కింద 2022 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్ల నగదును సీఎం జగన్‌ ఆదివారం బటన్‌ నొక్కి జమ చేయనున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో జరిగే కార్యక్రమంలో ఈ నగదును జమచేస్తారు. ఈ పథకం కింద బోధన రుసుముల్ని క్రమం తప్పకుండా చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.  ఏ త్రైమాసికానికి సంబంధించిన ఫీజును ఆ త్రైమాసికం అవ్వగానే చెల్లిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన కింద మొత్తం రూ.13,311 కోట్లు అందించినట్లు పేర్కొంది.


‘బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి మొండి చెయ్యి’

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే: రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి మొండి చెయ్యి చూపారని, కౌలు రైతుల గురించి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం దారుణమని ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు పేర్కొన్నారు. శనివారం ఆయన విజయవాడలో విలేకర్లతో మాట్లాడారు. కౌలు రైతుల చట్ట సవరణ కోసం శాసన సభలో అన్ని పక్షాల నాయకులకూ వినతిపత్రాలు సమర్పిస్తామని వెల్లడించారు. రైతు భరోసా బడ్జెట్‌ రూ.7,220 కోట్లలో కౌలు రైతుల వాటా ఎంత? బ్యాంకులిచ్చే పంట రుణాల్లో వాటా ఎంత? అనేది స్పష్టం చేసి ఉంటే బాగుండేదని వివరించారు.


వివాదాలున్నప్పటికీ ఏఎస్‌వోలుగా సచివాలయంలో పోస్టింగ్‌

ఈనాడు, అమరావతి: దేవాదాయశాఖ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లపై వివాదాలు ఉన్నప్పటికీ.. వారిని రాష్ట్ర సచివాలయంలో సహాయ సెక్షన్‌ అధికారులు (ఏఎస్‌వో)గా నియమిస్తూ ఆదేశాలు రావడం చర్చనీయాంశమైంది. సచివాలయంలోని మొత్తం ఏఎస్‌వోల్లో 12.5 శాతం పోస్టుల్లో పనిచేయడానికి వివిధ శాఖల ప్రధాన కార్యాలయాల (హెచ్‌వోడీ)ల్లో పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్లకు వెసులుబాటు ఉంటుంది. ఇందులో భాగంగా దేవాదాయశాఖ కమిషనరేట్‌కు చెందిన ముగ్గురు సీనియర్‌ అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఒకరు అందరికంటే సీనియర్‌. నిబంధనల ప్రకారం అతనికి సచివాలయంలో ఏఎస్‌వోగా అవకాశం దక్కాలి.  ఆయన్ను కాదని మిగిలిన ఇద్దరికి అవకాశం కల్పించారు. ఆ ఇద్దరిలో ఒకరు గతంలో పోస్టులు లేకపోయినా సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. మరొకరు కారుణ్య నియామకంపై ఉద్యోగం పొందగా దానిపై విచారణ జరుగుతోంది.


ప్రకాశంలో చుక్కల భూముల రైతులకు ఉపశమనం

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లాలో చుక్కల భూములకు గత ఎనిమిదేళ్లుగా రిజిస్ట్రేషన్లు కాక అధికారుల చుట్టూ తిరుగుతున్న రైతులకు ఉపశమనం కలగనుంది. వీరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు అధికారాలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2016లో అప్పటి ప్రభుత్వం బాధిత రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలిచ్చింది. అయితే పూర్తిస్థాయిలో స్పష్టత లేదంటూ కొందరు అధికారులు పెద్ద సంఖ్యలో అర్జీలు పెండింగ్‌లో పెట్టారు. తాజా ఆదేశాలతో ఈ జిల్లాలోని 17,522 మంది రైతులకు చెందిన సుమారు 37 వేల ఎకరాలకు సంబంధించి సమస్య తొలగనుంది. ఈ మేరకు రెవెన్యూ కార్యాలయాలతో పాటు జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గెజిట్‌ ఇవ్వనున్నారు.


ఈఏపీసెట్‌ ర్యాంకుల ద్వారానే బీఎస్సీ నర్సింగ్‌ సీట్ల భర్తీ

ఈనాడు, అమరావతి: ఈఏపీసెట్‌ ర్యాంకుల ద్వారానే 2023-24 సంవత్సరంలో బీఎస్సీ నర్సింగ్‌ సీట్లను భర్తీ చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ప్రవేశ పరీక్ష ద్వారానే ప్రవేశాలు నిర్వహించాలన్న భారత నర్సింగ్‌ కౌన్సిల్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వెల్లడించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ కోర్సులో ప్రవేశాలు పొందాలనుకున్న వారు ఈఏపీసెట్‌కు హాజరు కావాలని, ఇందులో వచ్చిన ర్యాంకుల ఆధారంగా డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుందని తెలిపింది.


2.70 లక్షల మంది పిల్లలు పాఠశాలల నుంచి డ్రాపౌట్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గత, ప్రస్తుత విద్యా సంవత్సరాలను పరిశీలిస్తే దాదాపు 2.70 లక్షల మంది చిన్నారులు ప్రభుత్వ పాఠశాలల నుంచి డ్రాపౌట్‌ అయ్యారని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క డీఎస్సీ ప్రకటించలేదని తెలిపారు.


విద్యకు పెద్ద పీట: సామినేని

రాష్ట్రంలో సీఎం జగన్‌ విద్యకు పెద్ద పీట వేస్తున్నారని, చదువుల్లో విప్లవం తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్‌లో ఆయనతో పాటు ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు, జగన్మోహన్‌రావు శనివారం విలేకరులతో మాట్లాడారు. సీఎం ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేటుకు దీటుగా మారుస్తున్నారు.


ఉన్నత విద్యా మండలి క్విజ్‌ ఫలితాల విడుదల

ఈనాడు, అమరావతి: ఉన్నత విద్యామండలి నిర్వహించిన క్విజ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో శ్రీ విద్యానికేతన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన శివజయనాథ్‌రెడ్డి, చక్రధర్‌లు ప్రథమ, ట్రిపుల్‌ఐటీ నూజివీడుకు చెందిన శ్రావణ్‌ సాయి కుమార్‌, నీలేష్‌లు ద్వితీయ, డాక్టర్‌ సీఎస్‌ఎన్‌ ఫార్మసీ కళాశాలకు చెందిన రాములు, ఇమాన్యుల్‌లు తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. వీరికి వరసగా రూ.లక్ష, రూ.75వేలు, రూ.50వేల నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్లను ప్రదానం చేయనున్నారు.

గేట్‌లో ఆర్జీయూకేటీ విద్యార్థులకు ర్యాంకులు

రాజీవ్‌ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయ విద్యార్థులు గేట్‌ ర్యాంకులు సాధించినట్లు ఉపకులపతి విజయకుమార్‌ తెలిపారు. కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో సత్యశేఖర్‌కు ఎనిమిదో ర్యాంకు, ఏడుగురికి 50లోపు, ముగ్గురికి 10లోపు ర్యాంకులు లభించాయని వెల్లడించారు.


ఫ్యాక్టరీల రిజిస్ట్రేషన్‌కు ప్రత్యేక డ్రైవ్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కర్మాగారాల చట్టం కింద నమోదు కాకుండా కొనసాగుతున్న ఫ్యాక్టరీల నమోదుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని కర్మాగారాల డైరెక్టర్‌ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. డిపార్టుమెంట్‌ ప్లాన్‌ అనుమతి పొంది, రిజిస్టర్‌ కాని పరిశ్రమలను చట్టం పరిధిలోకి తెచ్చేందుకు ఏప్రిల్‌ నుంచి ఆరు నెలల పాటు ప్రతి నెలా మూడో వారం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తామని తెలిపారు.


2.70 లక్షల మంది పిల్లలు పాఠశాలల నుంచి డ్రాపౌట్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గత, ప్రస్తుత విద్యా సంవత్సరాలను పరిశీలిస్తే దాదాపు 2.70 లక్షల మంది చిన్నారులు ప్రభుత్వ పాఠశాలల నుంచి డ్రాపౌట్‌ అయ్యారని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క డీఎస్సీ ప్రకటించలేదని తెలిపారు.


విద్యకు పెద్ద పీట: సామినేని

రాష్ట్రంలో సీఎం జగన్‌ విద్యకు పెద్ద పీట వేస్తున్నారని, చదువుల్లో విప్లవం తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్‌లో ఆయనతో పాటు ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు, జగన్మోహన్‌రావు శనివారం విలేకరులతో మాట్లాడారు. సీఎం ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేటుకు దీటుగా మారుస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని