సీమెన్స్‌ వ్యవహారంపై లోతైన దర్యాప్తు: మంత్రి బుగ్గన

‘రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణకు కేవలం రూ.25 కోట్లతో ఈ ప్రభుత్వ హయాంలో 21 ఎక్సలెన్స్‌ సెంటర్లు, 192 నైపుణ్య హబ్‌లు ఏర్పాటు చేశాం. ఏటా 50 వేల మంది యువతకు శిక్షణ ఇస్తున్నాం.

Published : 20 Mar 2023 04:56 IST

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణకు కేవలం రూ.25 కోట్లతో ఈ ప్రభుత్వ హయాంలో 21 ఎక్సలెన్స్‌ సెంటర్లు, 192 నైపుణ్య హబ్‌లు ఏర్పాటు చేశాం. ఏటా 50 వేల మంది యువతకు శిక్షణ ఇస్తున్నాం. కేవలం రూ.25 కోట్లతోనే ఈ ప్రభుత్వం ఇంత చేస్తోంటే తెదేపా ప్రభుత్వ హయాంలో నైపుణ్యాభివృద్ధి పేరుతో రూ.371 కోట్లు నామినేషన్‌పై సీమెన్స్‌ కంపెనీకి చెల్లించిన తరవాత కూడా రాష్ట్రంలో ఏ ప్రయోజనాలూ సాధించలేదు. ఆ నిధులు డొల్ల కంపెనీల పేరుతో ఆ ప్రభుత్వం బదలాయించేసింది. ఆ వ్యవహారం నిగ్గుతేల్చేందుకు మా ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేయిస్తోంది’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ఆదివారం శాసనసభలో వెల్లడించారు. ‘ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు, పెట్టుబడులు, యువతకు నైపుణ్య శిక్షణ అనే అంశంపై ఆదివారం శాసనసభలో రెండో రోజూ చర్చ కొనసాగింది. ఈ చర్చ అనంతరం ఆయన సమాధానం ఇస్తూ ఈ విషయాలు వెల్లడించారు.  సీమెన్స్‌ విషయంలో లోపాలు ఉన్నాయని మొదట జీఎస్టీ విభాగం గుర్తించిందని, ఆ తరవాత ఈడీ దృష్టి సారించిందన్నారు. ఈ స్కాంలో ప్రజాధనం దోపిడీకి గురైనందున చిన్నవారి నుంచి పెద్ద వారి వరకు ఏ స్థాయిలో ఉన్నా..బాధ్యత వహించాల్సి ఉంటుందని, పూర్తి విచారణ జరుపుతున్నామని మంత్రి వెల్లడించారు. నిధుల విడుదలకు ఆర్థికశాఖ అభ్యంతరం చెప్పినా చెల్లింపులు జరిగాయన్నారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఈ అంశాన్ని మంత్రిమండలి సమావేశంలో టేబుల్‌ ఎజెండాగా తీసుకువచ్చి ఆమోదించారన్నారు. డీపీఆర్‌ లేకుండా ఎలా నిధులు చెల్లిస్తారని ప్రశ్నించారు. కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ సాంకేతిక కమిటీ సిఫార్సులు లేకుండానే ఎంవోయూ కుదుర్చుకున్నారని విమర్శించారు.  ప్రభుత్వం ఇచ్చిన జీవోకి ఎంవోయూకి సంబంధం లేదన్నారు. ఆ తరవాత మంత్రి బుగ్గన సమాధానం ఇచ్చారు. ఈ ప్రభుత్వ హయాంలో 493 డిగ్రీ కళాశాలలు, 102 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో రెగ్యులర్‌ చదువులతో పాటు నైపుణ్యాభివృద్ధి కోసం విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని