మద్యంకేసుల్లో రాజీకి వీలుకల్పిస్తూ... చట్ట సవరణ బిల్లులు

మద్యంకేసుల్లో రాజీకి వీలుకల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు బిల్లుల్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. తొలిసారి నేరానికి పాల్పడిన వారు... చట్టంలో పేర్కొన్న నిర్దేశిత జరిమానా చెల్లించి కేసును పరిష్కరించుకోవచ్చు.

Updated : 21 Mar 2023 05:54 IST

ఆమోదించిన శాసనసభ

ఈనాడు, అమరావతి: మద్యంకేసుల్లో రాజీకి వీలుకల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు బిల్లుల్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. తొలిసారి నేరానికి పాల్పడిన వారు... చట్టంలో పేర్కొన్న నిర్దేశిత జరిమానా చెల్లించి కేసును పరిష్కరించుకోవచ్చు. ఈ కేసుల్లో జప్తు చేసిన వాహనాలు, ఆస్తులకు సంబంధించి అధికారులు నిర్ధారించిన విలువ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించి వాటిని తిరిగి పొందొచ్చు. అయితే ఆ కేసులు తీవ్రత లేనివై ఉండాలి. వాటిని ఎదుర్కొంటున్న నిందితులు తక్కువ పరిమాణం గల మద్యంతో దొరికి ఉండాలి. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కె.నారాయణస్వామి ఆంధ్రప్రదేశ్‌ అబ్కారీ చట్టం-1968 సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ మద్యంనిషేధ చట్టం-1995 సవరణ బిల్లులను సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. వాటిని సభ ఆమోదించింది. ఈ సవరణల ప్రకారం జరిమానా విధించే, జప్తు చేసిన వాహనాలను విడుదల చేసే అధికారాలు జిల్లా కలెక్టర్‌, సెబ్‌, ఎక్సైజ్‌ అధికారులకు... దఖలు పడతాయి.

తీవ్ర నేరాల దర్యాప్తుపై దృష్టిపెట్టేందుకే...

‘సుంకం చెల్లించని మద్యంతో చిక్కిన వారు, అనుమతి లేకుండా మద్యం విక్రయాలు చేస్తూ దొరికిన వారికి గరిష్ఠంగా ఎనిమిదేళ్ల వరకూ జైలు శిక్ష, రూ.5 లక్షల వరకూ జరిమానా విధించేలా 2020లో చట్ట సవరణ చేశాం. వీటికి సంబంధించి 2020, 2021 సంవత్సరాల్లో పెద్దసంఖ్యలో కేసులు నమోదు చేశాం. న్యాయస్థానాల్లో పెండింగ్‌ కేసుల సంఖ్య అధికమై.. పనిభారం పెరిగింది. అందుకే ఆ కేసులను తీవ్రత లేని, తీవ్రత ఎక్కువ ఉన్నవిగా విభజించాల్సిన అవసరం ఏర్పడింది. తీవ్రత లేని కేసులను పరిష్కరించి, తీవ్రమైన నేరాల దర్యాప్తుపై దృష్టిపెట్టాలి. తీవ్రత లేని కేసుల్లో తొలిసారి నేరానికి పాల్పడిన వారికి... రాజీకి వీలు కల్పిస్తున్నాం. దీని వల్ల దర్యాప్తు సంస్థలు... సిబ్బందిని సమర్థంగా వినియోగించుకునేందుకు వీలవుతుంది. న్యాయస్థానాల్లో పెండింగ్‌ కేసుల సంఖ్య తగ్గుతుంది’ అని నారాయణస్వామి ‘బిల్లు ఉద్దేశాలు-కారణాలు’లో వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని