విశాఖ స్టీల్‌ నికర నష్టం రూ.2,927 కోట్లు

విశాఖ ఉక్కు పరిశ్రమ 2022-23 ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు నాటికి రూ.2,927 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌తో పోలిస్తే డిసెంబరు నాటికి కంపెనీ నెట్‌వర్త్‌ కూడా 85% తగ్గిపోయింది.

Published : 22 Mar 2023 05:08 IST

నిధులను సమర్థంగా వాడుకోవాలి
పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక

ఈనాడు, దిల్లీ: విశాఖ ఉక్కు పరిశ్రమ 2022-23 ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు నాటికి రూ.2,927 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌తో పోలిస్తే డిసెంబరు నాటికి కంపెనీ నెట్‌వర్త్‌ కూడా 85% తగ్గిపోయింది. పార్లమెంటరీ స్థాయీ సంఘం మంగళవారం సభకు సమర్పించిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. విశాఖ స్టీల్‌ ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండటంవల్ల దేశవ్యాప్తంగా ఉక్కురంగంలో 2.1% మేర ఉత్పత్తి తగ్గిందని ఉక్కుశాఖ కార్యదర్శి చెప్పినట్లు నివేదిక పేర్కొంది. 2021-22తో పోలిస్తే 2022-23 డిసెంబరు నాటికి హాట్‌మెటల్‌ 46.20%, క్రూడ్‌స్టీల్‌ 44.82%, విక్రయ యోగ్యమైన స్టీల్‌ ఉత్పత్తి 47.02% మేర తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. అందుబాటులో ఉన్న అన్ని నిధులనూ సమర్థంగా వినియోగించుకోవాలని సూచించింది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ఆర్‌ఐఎన్‌ఎల్‌ తీసుకున్న చర్యలను సమీక్షించాలనుకుంటున్నట్లు పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సంస్థకు కేటాయించిన ప్రణాళిక వ్యయంలో (2023 జనవరి వరకు) 72.29% మాత్రమే ఖర్చుచేసినట్లు పేర్కొంది. 2022 ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు ఆ సంస్థ రూ.15,618 కోట్ల టర్నోవర్‌ (తాత్కాలిక లెక్కల ప్రకారం) నమోదుచేయగా, అదే సమయంలో రూ.2,927 కోట్ల నికర నష్టాన్ని చవిచూసినట్లు స్పష్టం చేసింది. సంస్థ టర్నోవర్‌లో రూ.14,858 కోట్లు దేశీయంగా రాగా, రూ.760 కోట్లు ఎగుమతుల ద్వారా వచ్చినట్లు నివేదిక వెల్లడించింది. 2022 మార్చి 31 నాటికి రూ.3,175 కోట్లున్న కంపెనీ నెట్‌ వర్త్‌, 2022 డిసెంబర్‌ 31 నాటికి రూ.479 కోట్లకు చేరినట్లు తెలిపింది. 2022-23 బడ్జెట్‌లో ఈ సంస్థకు రూ.910 కోట్లు కేటాయించినా అంచనాల సవరణ నాటికి దాన్ని రూ.603 కోట్లకు తగ్గించారని, అందులో డిసెంబరు వరకు రూ.420.19 కోట్లు మాత్రమే ఖర్చయినట్లు స్థాయీసంఘం వివరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని