Botsa Satyanarayana: నాకు 2 మార్కులే ఇస్తామన్నారుగా: మంత్రి బొత్స

ఉపాధ్యాయుల వయోపరిమితి పెంచడానికి వీలుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్‌ విద్య (సవరణ) బిల్లు 2023ను మంత్రి బొత్స సత్యనారాయణ సభలో ప్రవేశపెట్టారు.

Updated : 24 Mar 2023 08:09 IST

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల వయోపరిమితి పెంచడానికి వీలుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్‌ విద్య (సవరణ) బిల్లు 2023ను మంత్రి బొత్స సత్యనారాయణ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. రెండు రోజుల కిందట డీఎస్సీ ప్రకటనపై చర్చ సందర్భంగా సభ్యుల ప్రశ్నకు మంత్రి సభలో ఇచ్చిన సమాధానంపై పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమాధానాన్ని ఒక విద్యార్థి చెబితే నేను 10కి 2 మార్కులు కూడా ఇవ్వనని వ్యాఖ్యానించారు. మీరు చేసిన దానికి ఆ రోజు నాకు 2 వేల మెసేజ్‌లు వచ్చాయన్న బొత్స.. ఉపాధ్యాయుల వయోపరిమితి పెంచాలా వద్దా మీరే చెప్పాలని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలను ప్రశ్నించారు. ‘గత ప్రభుత్వం ఎన్నికల ముందు డీఎస్సీ ప్రకటించి, ఖాళీలు భర్తీ చేయలేదు. వాటిని మేం పూర్తి చేశాం. ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయోపరిమితి రెండేళ్లు పెంచితే ఖాళీలు రావు. డీఎస్సీ వేసి ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వాలో మీరే చెప్పండి. ఇప్పుడు డీఎస్సీపై నాకు ఎన్ని మార్కులు ఇస్తారో చెప్పండి. డీఎస్సీ ప్రకటించే విషయమై కసరత్తు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. పదవీవిరమణ వయసు పెంచాలని ఉద్యోగ సంఘాలు ఎక్కడా డిమాండ్‌ చేయలేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పెంచిందని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు  పేర్కొన్నారు. ఆ ప్రయోజనాలను ఉద్యోగులందరికీ వర్తింపజేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు