బడ్జెట్‌ ఫ్యాన్సీ నంబరు కాదు.. రియల్‌ నంబర్‌

బడ్జెట్‌ సంఖ్య మ్యాజిక్‌ ఫిగర్‌ కాదు. రియల్‌ ఫిగర్‌ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి పేర్కొన్నారు. 2023-24 వార్షిక బడ్జెట్‌పై పలువురు సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై మంత్రి బుగ్గన మండలిలో వివరణ ఇచ్చారు.

Published : 24 Mar 2023 05:24 IST

మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి

ఈనాడు, అమరావతి: బడ్జెట్‌ సంఖ్య మ్యాజిక్‌ ఫిగర్‌ కాదు. రియల్‌ ఫిగర్‌ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి పేర్కొన్నారు. 2023-24 వార్షిక బడ్జెట్‌పై పలువురు సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై మంత్రి బుగ్గన మండలిలో వివరణ ఇచ్చారు. ‘బడ్జెట్‌ రూ.2,79,279 కోట్లు ఎలా వచ్చిందని సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఖ్య కావాలనే తెచ్చాం. రూ.280 ఖర్చవుతుందనుకుంటే.. అందులో ఒక రూపాయి తగ్గిస్తే రూ.279 వస్తుంది. అలాగే లెక్కలను సర్దుబాటు చేసి ఈ సంఖ్యను తీసుకొచ్చాం.’ అని పేర్కొన్నారు. నాలుగేళ్లలో సంక్షేమానికి భారీగా ఖర్చు చేసినట్లు గణాంకాలతో వివరించారు. సంక్షేమం వద్దని ప్రతిపక్ష పార్టీలు చెబుతాయా? అని ప్రశ్నించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే అమలయ్యే ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని పీహెచ్‌సీ స్థాయిలో అందుబాటులోకి తెచ్చామన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి భారీ మొత్తాన్ని ఖర్చు చేశామన్నారు. వ్యవసాయ రంగంలో సౌకర్యాల ఏర్పాటుకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని.. ఇందులో భాగంగా రైతులకు ఉచిత విద్యుత్‌, విత్తనాలు, యంత్రాలు, రాయితీలు వంటి సదుపాయాలను కల్పించామని పేర్కొన్నారు. పాలిటెక్నిక్‌ కళాశాలలో చదివిన విద్యార్థులు ఇంజనీరింగ్‌ వైపు వెళ్లడాన్ని నియంత్రించేలా ఐటీఐ, పాలిటెక్నిక్‌, నైపుణ్యాభివృద్ధి సంస్థలను రీ డిజైన్‌ చేసినట్లు తెలిపారు. పాలిటెక్నిక్‌ పూర్తవగానే ఉపాధి కల్పించేలా ప్రత్యేక కోర్సులు, పరిశ్రమలతో అనుసంధానం చేసినట్లు తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారిలో నైపుణ్యాభివృద్ధి కోసం 192 స్కిల్‌ హబ్‌లను ఏర్పాటు చేశామన్నారు.

అంతకుముందు తెదేపా ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ.. ‘ఆర్థిక మంత్రి చాలా గొప్పగా లెక్కలు చెప్పారు. అప్పట్లో ప్రభుత్వ ఆదాయం ఎంత? ఇప్పుడు ఎంత వస్తోంది? ఇవన్నీ బేరీజు వేసుకుని సంక్షేమ పథకాల కోసం చేసిన ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి. మేం గొప్పగా ఖర్చు చేశామని చెబితే ఎలా? ప్రభుత్వం చేసిన అప్పులు రూ.4.19 లక్షల కోట్లు, కార్పొరేషన్లపై తెచ్చిన అప్పులు రూ.1.28 లక్షల కోట్లు.. ఏపీ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ చేసిన అప్పులు కోట్లల్లో, ఏపీ మారిటైం బోర్డు నుంచి తెచ్చిన అప్పులు భారీగా ఉన్నాయి’ అని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతుండగా మంత్రి బుగ్గన జోక్యం చేసుకుని మారిటైం బోర్డు ఇటీవలే ఏర్పాటు చేశామని.. రూ.5 వేల కోట్లు అప్పులు తెచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. ఈ చర్చ జరుగుతున్న సమయంలోనే తెదేపా ఎమ్మెల్సీలకు మైక్‌ కట్‌ చేసిన ఛైర్మన్‌.. బిల్లులు ప్రవేశపెట్టాలంటూ మంత్రి బొత్సకు అవకాశమిచ్చారు. దీనిపై తెదేపా ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. చర్చకు అవకాశం కల్పించకపోతే సభను బహిష్కరిస్తామన్నారు. పొండి.. బయటకు వెళ్లండి అని మంత్రి, ఛైర్మన్‌ అనడంతో తెదేపా ఎమ్మెల్సీలు వాకౌట్‌ చేశారు. గురువారం ఉదయం సమావేశాలు ప్రారంభమైన వెంటనే మహిళల రక్షణ చర్యలపై తెదేపా ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని ఛైర్మన్‌ తిరస్కరించి, ప్రశ్నోత్తరాలను కొనసాగించారు.

దిశ చట్టం లేదు

రాష్ట్రంలో దిశ చట్టం ఇంకా అమల్లోకి రాలేదని హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. తెదేపా ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ చట్టం బిల్లులో కొన్ని లోపాలున్నాయని కేంద్రం తిప్పి పంపిందని, వాటిని సరిచేసి మళ్లీ పంపుతామని చెప్పారు. మహిళల రక్షణ కోసం చట్టంలో ప్రస్తావించిన విధంగా దిశ పోలీస్‌స్టేషన్లు, వాహనాలు, సిబ్బందిని కేటాయించడంతో పాటు యాప్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. దిశ చట్టమే లేదని మంత్రి సభలో చెబుతుంటే.. ఆ పార్టీ వాళ్లు మాత్రం చట్టం ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని తెదేపా ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి విమర్శించారు. దిశ బిల్లు సభలో ఆమోదించి మూడేళ్లు పూర్తయిందని.. ఆ బిల్లు తెచ్చిన సీఎం జగన్‌ గన్‌లో బుల్లెట్లు ఏమయ్యాయని తెదేపా ఎమ్మెల్సీ ఫరూక్‌ ఎద్దేవా చేశారు.

10 బిల్లులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ విద్య, పౌర గ్రంథాలయాలు, ధార్మిక హిందూ మత సంస్థల ధర్మాదాయాలు, అల్పసంఖ్యాక వర్గాల కమిషన్‌, రిజిస్ట్రేషన్‌, అబ్కారీ, మద్యనిషేధం, న్యాయవాదుల సంక్షేమ నిధి, అనుసూచిత కులాలు, తెగలు కాని వెనుకబడిన తరగతుల కోసం ఆంధ్రప్రదేశ్‌ కమిషన్‌ సవరణ బిల్లులతోపాటు పాలసేకరణ (రైతుల సంరక్షణ), పాల సురక్షిత ప్రమాణాల అమలు బిల్లు 2023లను మండలి ఆమోదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని