సంక్షిప్త వార్తలు (5)

ప్రకాశం జిల్లాలో కొత్తగా ఏర్పాటైన ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం లోగోను శుక్రవారం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆవిష్కరించారు.

Updated : 25 Mar 2023 06:22 IST

ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం లోగో ఆవిష్కరణ

ఒంగోలు నగరం, ఒంగోలు అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లాలో కొత్తగా ఏర్పాటైన ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం లోగోను శుక్రవారం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆవిష్కరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉపకులపతి ఎం.అంజిరెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి, రిజిస్ట్రార్‌ హరిబాబు, డీన్‌ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరం నుంచి పూర్వ ప్రకాశం జిల్లాలోని డిగ్రీ, బీఈడీ కళాశాలలన్నీ ఈ విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తాయన్నారు. విశ్వవిద్యాలయం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.


ఎడ్‌సెట్‌ ప్రకటన విడుదల

విశాఖపట్నం, న్యూస్‌టుడే: బీఈడీ, స్పెషల్‌ బీఈడీలో ప్రవేశాల కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏపీ ఎడ్‌సెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వివరాలకు  https:// cets.apsche.ap.gov.in  వెబ్‌సైట్‌ను పరిశీలించాలని ఏపీ ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ఆచార్య కె.రాజేంద్రప్రసాద్‌ సూచించారు.


శాప్‌ ఛైర్మన్‌పై చర్యలు తీసుకోవాలని సీఎంకు వినతి

ఈనాడు, అమరావతి: అసూయ, పక్షపాతంతో అనుచరులతో తనపై దాడి చేయించిన రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్‌) ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఒలింపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కేపీ రావు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి శుక్రవారం విజ్ఞప్తి చేశారు.    క్రీడా సంఘాలతో గురువారం విజయవాడలో ఆశాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులు నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రికి సూచనలు చేశానని వివరించారు. ఈ విషయంలో ఆయన పేరును ప్రస్తావించలేదని, ప్రశంసించలేదన్న అక్కసుతో తనపై శాప్‌ ఛైర్మన్‌ దాడి చేయించారని కేపీ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడలను కాపాడేందుకు జీవో 74లో, క్రీడా విధానంలో సవరణలు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.


గుట్ట కాదు పుట్ట

న్యూస్‌టుడే, హుకుంపేట: పుట్టలు సాధారణంగా 3 నుంచి 4 అడుగుల ఎత్తు ఉంటాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం మత్య్సపురం పంచాయతీ బంగారుమెట్ట గ్రామ సమీపంలో సుమారు 15 అడుగుల ఎత్తు పుట్ట పెరిగింది. కొన్నేళ్లుగా ఈ పుట్ట పెరుగుతూ వస్తోందని గ్రామస్థులు తెలిపారు. 


ఉపాధి హామీ వేతనం రూ.15 పెంపు

ఈనాడు, దిల్లీ: కేంద్రం 2023-24 సంవత్సరానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాలను పెంచింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఇప్పటివరకున్న రూ.257 కూలీని... రూ.272కి పెంచింది. ఈమేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అత్యధికంగా హరియాణాలో రూ.357, కేరళలో రూ.333, గోవాలో రూ.322, కర్ణాటకలో రూ.316, లక్షద్వీప్‌లో రూ.304, పంజాబ్‌లో రూ.303గా నిర్ధారించారు. ఏప్రిల్‌ 1 నుంచి ఇవి అమలులోకి వస్తాయి.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని