వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

వడగళ్ల వానలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని.. సాయం పెంచి ఇవ్వాలని పలువురు వైకాపా ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరారు. నిబంధనలను సడలించి అన్నదాతలను ఆదుకోవాలని సూచించారు.

Published : 25 Mar 2023 04:56 IST

శాసనసభలో ప్రభుత్వాన్ని కోరిన వైకాపా ఎమ్మెల్యేలు

ఈనాడు, అమరావతి : వడగళ్ల వానలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని.. సాయం పెంచి ఇవ్వాలని పలువురు వైకాపా ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరారు. నిబంధనలను సడలించి అన్నదాతలను ఆదుకోవాలని సూచించారు. శుక్రవారం శాసనసభలో శూన్యగంట(జీరో అవర్‌) ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సుదీర్ఘంగా సాగింది. అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రస్తావించారు. ‘వడగళ్ల వాన బీభత్సంతో వందల ఎకరాల్లో వరి, నువ్వుతోపాటు బత్తాయి, నిమ్మ, అరటి తదితర తోటలు దెబ్బతిన్నాయి. పిందెలు రాలిపోతే పంటనష్టంగా పరిగణించలేమని అధికారులు అంటున్నారు. 10 నుంచి 12 ఏళ్ల వయసున్న చెట్లు పడిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. కమలాపురం నియోజకవర్గంలోనే రూ.40లక్షల నుంచి రూ.50లక్షల వరకు పంట నష్టపోయిన వారు 40 మందికి పైగా ఉన్నారు. నిబంధనలను మార్చి రైతులకు సాయం చేయాలి’ అని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కోరారు. వడగళ్ల వానలతో తమ నియోజకవర్గాల్లోనూ పంటలు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యేలు కళావతి, నంబూరి శంకర్రావు, కాపు రామచంద్రారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి తదితరులు చెప్పారు. పంటనష్టం నమోదు చేసి పరిహారం అందించాలన్నారు.


‘వరికపూడిసెల’ పనులు మొదలుకాలేదు

‘వరికపూడిసెల ప్రాజెక్టుకు రూ.1,273 కోట్లు మంజూరైనా.. ఇప్పటికీ పనులు ఇప్పటికీ మొదలు కాలేదు’ అని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. ‘నూజెండ్ల మండలానికి అయిదు ఎత్తిపోతల పథకాలు మంజూరయ్యాయి. వాటికి ఈఎన్‌సీ అనుమతి ఇచ్చినా ఆర్థికశాఖ అనుమతులు ఆగాయి. జలవనరులశాఖ మంత్రి చొరవ చూపాలి’ అని కోరారు.


నకిలీ విత్తనాలతో నష్టపోతున్నా పరిహారం లేదు

రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోతున్నా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు నంబూరి శంకర్రావు, కాటసాని రాంభూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట మండలం తాళ్లచెరువులో పత్తి, పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల, కల్లూరు మండలాల్లో పత్తి, మొక్కజొన్న సాగు చేసిన రైతులు కల్తీ విత్తనాల కారణంగా నష్టపోయారని చెప్పారు.  


రాష్ట్రంలో శునకాల బెడద తీవ్రం

రాష్ట్రంలో శునకాల బెడద తీవ్రంగా ఉందని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తెలిపారు. ‘పిల్లల్ని ఆడుకోవడానికి బయటకు పంపించాలన్నా భయపడుతున్నారు. ఒంటరిగా ఎటు వెళ్లినా భయమే’ అని పేర్కొన్నారు. ‘స్థానిక సంస్థల అధికారులు కుక్కల్ని పట్టుకుంటే.. జంతు ప్రేమికులు పోలీసు కేసులు పెడుతున్నారు. దీంతో వారు ముందుకు రావడం లేదు’ అని సూచించారు.


బుడగ జంగాలకు కుల ధ్రువీకరణ పత్రాలివ్వాలి

రాష్ట్రంలో సంచార జాతికి చెందిన బుడగ జంగాల వర్గానికి చెందిన వారికి కుల ధ్రువీకరణ చేయడం లేదని.. ఈ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేలు శంకర్రావు, కాపు రామచంద్రారెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు తదితరులు శాసనసభ దృష్టికి తెచ్చారు. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ముందు దరఖాస్తు చేయాలని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు.


విజిలెన్స్‌ విచారణ చేయించాలి

రాప్తాడు నియోజకవర్గంలో ఫేజ్‌ సంస్థకు 28 ఎకరాల విలువైన భూములను ఇచ్చారని, వాటికి అమ్ముకునేందుకు ఇచ్చిన జీవోపై విజిలెన్స్‌ విచారణ చేయించాలని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కోరారు. రామగిరి గ్రానైట్‌ ప్రాంతంలో రాయల్టీలు చెల్లించడం లేదని, దీనిపైనా విజిలెన్స్‌ విచారణ చేయించాలన్నారు. మాజీ సైనికుల పేర్లతో ఆన్‌లైన్లో పాత తేదీలతో భూములు ఎక్కించారని.. వాటిపైనా విచారణ చేయించాలన్నారు.


సీఎం చెప్పినా.. నిధులివ్వలేదు

బొబ్బిలి నియోజకవర్గంలో రాముడివలస, లోచర్ల ఎత్తిపోతల పథకాలను పూర్తి చేస్తామని గుంకలాం లేఔట్‌కు వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ చెప్పినా.. ఇప్పటి వరకు పరిపాలన అనుమతులు ఇవ్వలేదు. నిధులు మంజూరు చేయలేదని ఎమ్మెల్యే అప్పలనాయుడు పేర్కొన్నారు.  

జగనన్న కాలనీల్లో భూమి చదును, రోడ్ల నిర్మాణం తదితర పనులకు బిల్లులు రావడం లేదని ఎమ్మెల్యే ఆర్థర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని