అప్పులు తీర్చే దారేది?

ఆంధ్రప్రదేశ్‌ అప్పులపై, వాటిని రాష్ట్రం చెల్లించే సామర్థ్యం, వ్యూహాలపై రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంది. కానీ ప్రభుత్వం ఆ మాటలను లెక్కపెడుతున్న దాఖలాలే లేవు.

Updated : 27 Mar 2023 09:44 IST

రాబడి పెంచడంపై దృష్టేది?
కాగ్‌ హెచ్చరిస్తున్నా దిద్దుబాటు చర్యల్లేవు
మూలధన వ్యయం అంతంతమాత్రమే
పెడచెవిన కీలక సలహాలు, సిఫార్సులు
ఈనాడు - అమరావతి

ఆంధ్రప్రదేశ్‌ అప్పులపై, వాటిని రాష్ట్రం చెల్లించే సామర్థ్యం, వ్యూహాలపై రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంది. కానీ ప్రభుత్వం ఆ మాటలను లెక్కపెడుతున్న దాఖలాలే లేవు. లెక్కకు మిక్కిలిగా అప్పులు చేయడమే కాకుండా బడ్జెట్‌ పత్రాల్లో చూపని భారాలెన్నో రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నాయని కాగ్‌ పేర్కొంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఈ రాజ్యాంగబద్ధ సంస్థ వరుసగా రెండేళ్లు తన పరిశీలనలను విడుదల చేసింది. 2021 మార్చి నెలాఖరు వరకు ఉన్న పరిస్థితులపై కాగ్‌ నివేదికలను 2022 సెప్టెంబరులో ప్రభుత్వం శాసనసభలో సమర్పించింది. 2021 మార్చి నుంచి 2022 మార్చి నెలాఖరు వరకు పరిస్థితిపై మరో నివేదికను ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల ముగింపు వేళ శాసనసభలో వెల్లడించింది. ఈ రెండు నివేదికల్లో కాగ్‌ ఏం చెప్పింది? ఏం సలహాలు ఇచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం వాటిని పాటిస్తోందా? అప్పుల భారం నుంచి బయటపడి అభివృద్ధి మార్గం వైపు పయనించే చర్యలు ఏమైనా చేపట్టిందా అని విశ్లేషిస్తే ఇప్పటికీ ఆశావహ పరిస్థితి ఏమీ కనిపించడం లేదు.


కాగ్‌ హెచ్చరిక 1

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 మధ్య కాలంలో  రూ.3,47,944.64 కోట్ల మేర ప్రభుత్వం రుణం చెల్లించాల్సి రావచ్చు. 2022 మార్చి 31 నాటికి జీఎస్‌డీపీలో రుణాలు 31 శాతమే ఉన్నట్లు ప్రభుత్వం చూపుతున్నా రాష్ట్ర రుణభారం అంతకంటే ఎక్కువే ఉంది. బడ్జెటేతర రుణాలను ఇతర నిబద్ధ బాధ్యతలను కూడా లెక్కలోకి తీసుకుంటే జీఎస్‌డీపీలో రుణాల శాతం 42.33. ఇది నిర్దేశిత పరిమితి కన్నా ఏకంగా 6.73 శాతం అదనం. 2024-25 ఆర్థిక సంవత్సరం తర్వాత పరిస్థితి కొంత కుదుటపడే అవకాశం ఉంది. అయితే ఆదాయాలు పెంచుకోకుండా ఏటా ఖర్చుల కోసం కూడా అప్పులపైనే ఆధారపడితే రుణ బాధ్యత సరళి మరింత పెరిగే ప్రమాదమూ లేకపోలేదు.


ప్రస్తుత పరిస్థితి

* బడ్జెట్‌లో చూపిన లెక్కలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్న కాగ్‌ వాటిని తీర్చే విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. బడ్జెటేతర రుణాలను కూడా కలిపి జీఎస్‌డీపీలో 42.33 శాతంగా కాగ్‌ పేర్కొంటోంది. ఆ లెక్కలకూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న అధికారిక గణాంకాలే ప్రాతిపదిక కావడం గమనార్హం. వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకుంటున్న రుణాలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో వెల్లడించడం లేదు. ఆయా కార్పొరేషన్ల లెక్కలపై ఆడిట్‌ చేయించి కంపెనీల రిజిస్ట్రార్‌ వద్ద సమర్పించకపోవడంతో వాటి అసలు అప్పులు బయటపడటం లేదు. కార్పొరేషన్లు తమ ఆడిట్‌ నివేదికలు సమర్పించి చాలాకాలం అయిందని కూడా కాగ్‌ నివేదికలో ప్రస్తావించింది. డిస్కంలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు, నీటిపారుదల ప్రాజెక్టులు, ఇతర పథకాలకు ఉన్న పెండింగ్‌ బిల్లులను ప్రభుత్వం బడ్జెట్‌ లెక్కల్లో చూపడం లేదనీ తప్పు పట్టింది. ప్రభుత్వం చెబుతున్న అప్పుల లెక్కలన్నీ అవాస్తవమేనని, అన్ని అప్పుల గురించీ వెల్లడిస్తున్నామన్న ప్రకటనలూ నిజం కాదంటూ కొట్టిపారేసింది.

* ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా.. ఏడేళ్లు, ఆరేళ్ల వ్యవధిలో తిరిగి చెల్లిస్తామని బహిరంగ మార్కెట్‌ రుణాలు తీసుకుంటోంది. అంటే రాబోయే పదేళ్ల కాలంలో చెల్లించాల్సిన అప్పులు ఇప్పటికే చాలా పెరిగిపోయాయి. ఇలాగే అప్పులు చేస్తూ పోతే ప్రమాదమేనన్న కాగ్‌ హెచ్చరికలను ఇది పెడచెవిన పెట్టడమే.

* కార్పొరేషన్ల రుణాలు, వాటిపై వడ్డీలను ప్రభుత్వమే తన బడ్జెట్‌ నుంచి చెల్లిస్తోంది. ఆ మొత్తాలు కలిపి లెక్కిస్తే భారం ఇంకెంత ఉందో అవగతమవుతుంది.


కాగ్‌ హెచ్చరిక 2

ఈ రుణభారాన్ని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు రెవెన్యూ వనరులు సమకూర్చుకునేలా చూడటంతో పాటు ఒక వివేచనాత్మక రుణ వ్యూహాన్ని రూపొందించుకోవాలి. దీనికి ఓ నిర్దిష్ట ప్రణాళిక లేకపోతే అభివృద్ధి కార్యకలాపాల కోసం మిగిలే వనరులు తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ అప్పులు మూలధన ఆస్తుల సృష్టి (అభివృద్ధి)కి కాకుండా రుణ విమోచనకే ఖర్చు చేస్తున్నట్లు ఆ సరళి తెలియజేస్తోంది. సేకరించిన రుణాలను స్థిరాస్తుల సృష్టికి వినియోగించి ఆదాయ వనరులు పెంచుకోకుండా ఇలా రుణాల చెల్లింపులకే వినియోగించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పెరుగుతుంది. రాష్ట్రం అప్పుల వలయంలో చిక్కుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం.


ప్రస్తుత పరిస్థితి

అదనపు రెవెన్యూ వనరులు సమకూర్చుకునే ప్రయత్నం కాదు కదా ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్న దాఖలాలు కూడా లేవు. ఇటీవలి ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆశించినట్లుగా సొంత రాబడులు ఉండటం లేదు. సాధారణంగా ఏటా 15 నుంచి 20 శాతం రాబడులు పెరుగుతాయి. అది పెద్ద పెరుగుదల కాదని, ద్రవ్యోల్బణానికి తగ్గట్టుగా ఉంటుందని నిపుణుల విశ్లేషణ. పెరుగుదల రేటులోనూ ఆశావహ వాతావరణం కనిపించడం లేదు.

* కొత్తగా ఆస్తులు సృష్టించగలిగితేనే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు పెరిగే ఆస్కారం ఉంది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు విస్తృతంగా సాగితేనే రాబడులు పెరుగుతాయి. అభివృద్ధి పనులకే నిధులు ఖర్చు చేయనప్పుడు, ఆస్తులు సృష్టించేలా నిధులు వెచ్చించనప్పుడు రాష్ట్ర రాబడులు ఎక్కడ పెరుగుతాయి?

* రాబడి పెరగాలంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి కావాలంటే మూలధన వ్యయం రూపంలో ఎక్కువ మొత్తాలు కేటాయించి, ఖర్చు చేయాలి. సగటున ప్రతి రాష్ట్రంలో మూలధన వ్యయం 14.41 శాతంగా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో అది 9.21 శాతమే ఉందని కాగ్‌ కుండబద్దలు కొట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 7.04 శాతమే మూలధన వ్యయంపై ఖర్చు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 10.14 శాతానికి పెరిగినా తర్వాత ఏడాది 8.5 శాతానికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకు అత్యంత దారుణంగా కేవలం 4.10 శాతమే మూలధన వ్యయం కింద రాష్ట్రం ఖర్చు చేసినట్లు కాగ్‌ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులోనూ కొంత పేదలకు ఇచ్చే ఇళ్ల పథకాలపై వెచ్చించి, దాన్నీ మూలధన వ్యయంగా చూపే ప్రయత్నాలు జరిగాయని గతంలోనే కాగ్‌ తప్పు పట్టింది. అప్పులు తెచ్చి రెవెన్యూ ఖర్చులు చేస్తూ, అప్పులతో మళ్లీ అప్పులు తీరుస్తూ, ఉన్న బడ్జెట్‌ నుంచి ఆస్తులు సృష్టించేందుకు చాలినన్ని నిధులివ్వకపోతే ఇక రాష్ట్రం అప్పులు తీరేదెలా? అభివృద్ధి జరిగేదెలా?


కాగ్‌ హెచ్చరిక 3

ఆస్తుల కల్పన కోసం ఆర్థికాభివృద్ధిని వేగిరపరచాలి. ఇందుకు అవసరమైన నిధులు వెచ్చించాలి. ప్రాజెక్టుల అమలును నిశితంగా పరిశీలించాలి. నీటిపారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి.


ప్రస్తుత పరిస్థితి

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణమే కీలకమని కాగ్‌ సలహా ఇచ్చింది. అప్పుల నుంచి బయటపడాలన్నా, రాబడులు పెరగాలన్నా  ప్రాజెక్టులు ఎంతో కీలకమని స్పష్టం చేస్తోంటే ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్లుగా నీటిపారుదల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. కీలకమైన ప్రాజెక్టులను పూర్తి చేయడం లేదు. కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకురావడం లేదు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చాలినన్ని నిధులూ ఇవ్వడం లేదు.

* రాష్ట్రంలో మొత్తం 54 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, 2024 నాటికి వాటిలో 42 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ నాలుగేళ్లలో కేవలం రెండు ప్రాజెక్టుల నిర్మాణాన్ని మాత్రమే కొలిక్కి తీసుకువచ్చింది. మిగిలిన ప్రాజెక్టులు రాబోయే ఏడాదిలో కూడా పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే రూ.1,64,815 కోట్లు అవసరమని లెక్కించారు. ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం వీటిపై ఖర్చు చేసింది రూ.20 వేల కోట్ల లోపే. దీంతో కీలక ప్రాజెక్టులు పూర్తి చేసే ఆస్కారమే లేదు. ఫలితంగా కాగ్‌ చెప్పినట్లు అభివృద్ధి అంతంతమాత్రం అవుతోంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని