‘వైఎస్సార్‌ ఏపీ వన్‌’ యాప్‌లో పరిశ్రమలకు అనుమతులు

రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పటానికి అవసరమైన అనుమతులన్నీ త్వరితగతిన పొందడానికి వీలుగా ‘వైఎస్సార్‌ ఏపీ వన్‌’ పేరుతో యాప్‌, పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు.

Updated : 28 Mar 2023 10:55 IST

పీపీపీ విధానంలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ల అభివృద్ధి
విశాఖలో ‘ఐ-స్పేస్‌ ఇన్నోవేషన్‌ హబ్‌’
2023-27 పారిశ్రామిక విధానాన్ని వెల్లడించిన మంత్రి అమర్‌నాథ్‌

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పటానికి అవసరమైన అనుమతులన్నీ త్వరితగతిన పొందడానికి వీలుగా ‘వైఎస్సార్‌ ఏపీ వన్‌’ పేరుతో యాప్‌, పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. సోమవారం విశాఖలో 2023-27 నూతన పారిశ్రామిక విధానాన్ని వెల్లడిస్తూ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పాలసీ ముగిసేలోగా కొత్త విధానాన్ని ప్రకటించడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారన్నారు. ‘ఏదైనా పరిశ్రమ నెలకొల్పాంటే 23 శాఖల నుంచి 96 రకాల అనుమతులు పొందాల్సి ఉంటుంది. దీని కోసం గతంలో ఆయా శాఖల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి తలెత్తకుండా ‘వైఎస్సార్‌ ఏపీ వన్‌’ యాప్‌తో 21 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు ఇస్తాం. పారిశ్రామికవేత్తలకు అవసరమైన భూములను నిర్దేశిత కాలంలో అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని మంత్రి పేర్కొన్నారు.

లాజిస్టిక్‌, వేర్‌హౌసింగ్‌ రంగాలకు పరిశ్రమల హోదా

‘ప్రభుత్వ పారిశ్రామికవాడల మాదిరిగానే ప్రైవేటు రంగంలో ఇండస్ట్రియల్‌ పార్కులను ప్రోత్సహించనున్నాం. ‘శ్రీసిటీ’ మాదిరిగా ఎవరైనా కొత్త పార్కు ఏర్పాటుకు ముందుకు వస్తే సహకారం అందిస్తాం. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలోనూ అభివృద్ధి చేస్తాం. ప్రైవేట్‌ ఎంఎస్‌ఎంఈ పార్కులనూ ఏర్పాటు చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన ఉత్తర్వులను ఇది వరకే విడుదల చేశాం’ అని మంత్రి వివరించారు. ఈ ఏడాది కొత్తగా సరకు రవాణా (లాజిస్టిక్‌), గిడ్డంగులు (వేర్‌ హౌసింగ్‌) రంగాలకు పరిశ్రమల హోదాను కల్పిస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలకు వర్తించే ప్రోత్సాహకాలన్నీ వీటికి కూడా అందుతాయన్నారు.

అంకుర సంస్థలకు ప్రాధాన్యం

‘ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సూచనల మేరకు విశాఖలో పది లక్షల చదరపు అడుగులతో ‘ఐ-స్పేస్‌’ పేరిట మల్టీ ఇన్నోవేషన్‌ హబ్‌ను నెలకొల్పబోతున్నాం. దీని ద్వారా పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ)లో అంకుర సంస్థల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వనున్నాం. ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో పనిచేసుకోవడానికి వివిధ సంస్థలు ముందుకు వచ్చే విధంగా ఈ ఐకానిక్‌ భవన నిర్మాణం ఉంటుంది’ అని మంత్రి అమర్‌నాథ్‌ తెలిపారు. ఎంఎస్‌ఎంఈ సంస్థలకు అందజేయాల్సిన ప్రోత్సాహకాలను జులైలో విడుదల చేస్తామని చెప్పారు. పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి కరికాల వలవన్‌, డైరెక్టర్‌ సృజన మాట్లాడుతూ రాష్ట్రంలో స్నేహపూర్వక పారిశ్రామిక విధానం అమలవుతోందన్నారు. ఆ నమ్మకంతోనే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమిట్‌ ద్వారా రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆసక్తి చూపారన్నారు. కార్యక్రమంలో ఏపీఐడీసీ ఛైర్మన్‌ బండి పుణ్యశీల, సీఐఐ ప్రతినిధి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని