‘ఆర్-5 జోన్’ గెజిట్పై హైకోర్టులో వ్యాజ్యం
రాజధాని అమరావతిలో ఆర్-5 జోన్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21న జారీ చేసిన గెజిట్(337) నోటిఫికేషన్ను సవాలు చేస్తూ సోమవారం హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది.
అమలు ఆపేయాలని కోరిన రైతు ఆవల నందకిశోర్
ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో ఆర్-5 జోన్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21న జారీ చేసిన గెజిట్(337) నోటిఫికేషన్ను సవాలు చేస్తూ సోమవారం హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన ఆవల నందకిశోర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతిలోని 900 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా బృహత్ ప్రణాళిక(మాస్టర్ ప్లాన్)లో మార్పులు చేస్తూ ఆర్-5 జోన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, గుంటూరు జిల్లా కలెక్టర్, కృష్ణాయపాలెం గ్రామ కార్యదర్శి, కృష్ణాయపాలెం గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి, సీఆర్డీఏ కమిషనర్ వివేక్యాదవ్, కృష్ణాయపాలెం గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి సీహెచ్ నాగశ్రీనివాస్లను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
పిటిషన్లో వివరాలివే..
‘విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలు, తాడేపల్లి, దుగ్గిరాల, మంగళగిరి, పెదకాకాని మండలాల పరిధిలో పేదలందరికి ఇళ్లు పథకం పేరుతో రాజధాని కోసం సమీకరించిన 1251 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో జీవో 107 జారీ చేసింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు ఆ జీవోను సస్పెండ్ చేసింది. ఆ ఉత్తర్వులు జోనల్ రెగ్యులేషన్కు విరుద్ధంగా ఉన్నాయని చెప్పింది. ఈ తరహా చర్య జోనల్ పరిధిని కుదించడమేనని పేర్కొంది. అనంతరం రాజకీయ అజెండా అమల్లో భాగంగా రాజధానేతరులకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం సీఆర్డీఏ సవరణ చట్టం(యాక్ట్ 13) తీసుకొచ్చింది. దానిని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం వద్దకు చేరాయి. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చే సమయంలో.. జీవో 107ని సవాలు చేస్తూ దాఖలైన పాత కేసుతో జత చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో అవన్నీ త్రిసభ్య ధర్మాసనం వద్దకు చేరాయి. దీనిని అవకాశంగా తీసుకున్న ప్రభుత్వం ప్రస్తుత గెజిట్ను జారీ చేసింది. కృష్ణాయపాలెం గ్రామ పంచాయతీ ప్రజలు లేవనెత్తిన అభ్యంతరాలను సీఆర్డీఏ పట్టించుకోలేదు. సీఆర్డీఏ కమిషనర్, కృష్ణాయపాలెం ప్రత్యేక అధికారి ఈ వ్యవహారంలో దురుద్దేశంతో వ్యవహరించారు. ఆర్5 జోన్ ఏర్పాటుకు కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, మందడం గ్రామాల పరిధిలో ప్రతిపాదించిన భూములు రాజధాని నగరం స్వతహాగా నిలదొక్కుకోవడానికి, ఆదాయం ఆర్జించేందుకు ఉపయోగపడేవి. అవి రాజధాని అమరావతికి కీలకమైనవి. ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారమై గ్రామస్థుల నుంచి ఎలాంటి అభ్యర్థనలు రాకపోయినప్పటికీ ప్రత్యేక అధికారి సీఆర్డీఏకు ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదన అధికార దుర్వినియోగానికి పాల్పడటమే. పంచాయతీరాజ్ చట్ట నిబంధనల మేరకు నియమితులైన ప్రత్యేక అధికారికి.. సీఆర్డీఏ తీర్మానంతో సంబంధం ఉండదు. గ్రామ సభలు నిర్వహించాలని కోర్టుకు వెళ్లాం. న్యాయస్థానం ఆదేశాలతో సభలు నిర్వహించారు. ఆ సభల్లో ప్రజలు లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకుండా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. సీఆర్డీఏ అధికారుల మౌఖిక సూచన మేరకు ఇళ్ల స్థలాల కోసం ప్రతిపాదన చేసినట్లు కృష్ణాయపాలెం ప్రత్యేక అధికారి గ్రామ సభలో చెప్పారు. ఈ ప్రతిపాదన వందలమంది రైతుల ప్రయోజనాలు, వారి కుటుంబాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గ్రామ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. గ్రామ సభ తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో సీఆర్డీఏ విఫలమైంది. రాజధానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించింది. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని గెజిట్ నోటిఫికేషన్ను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించండి. దానిని రద్దు చేయండి. అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వండి. గ్రామ ప్రజలు సమర్పించిన అభ్యంతరాలు, అధికారుల నిర్ణయానికి సంబంధించిన నోట్ఫైల్ను తెప్పించి పరిశీలించండి’ అని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం