రాజకీయ కార్యక్రమాలకు వేదికగా వ్యవసాయ కళాశాల!

ప్రఖ్యాత బాపట్ల వ్యవసాయ కళాశాల ప్రతిష్ఠ మసకబారుతోంది. ఉన్నత విద్యావంతులను తీర్చిదిద్దే ఈ కళాశాల రాజకీయ కార్యక్రమాలకు వేదికగా మారుతుండటంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 28 Mar 2023 04:59 IST

బాపట్ల, న్యూస్‌టుడే: ప్రఖ్యాత బాపట్ల వ్యవసాయ కళాశాల ప్రతిష్ఠ మసకబారుతోంది. ఉన్నత విద్యావంతులను తీర్చిదిద్దే ఈ కళాశాల రాజకీయ కార్యక్రమాలకు వేదికగా మారుతుండటంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కళాశాల ప్రధాన భవనంలో వైకాపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి, మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి, ఎమ్మెల్యే కోన సోమవారం విలేకర్ల సమావేశం నిర్వహించి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. పూర్తిగా రాజకీయాలు మాట్లాడారు. గతంలో అతిథిగృహాన్ని మంత్రులు, ప్రజాప్రతినిధులకు కేటాయించేవారు. బి.వి.నాథ్‌ ఆడిటోరియంలో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించేవారు. వైకాపా ప్రజాప్రతినిధులు ఏకంగా కళాశాల ప్రధాన భవనంలో సమావేశం ఏర్పాటు చేసి రాజకీయ విమర్శలు, అవినీతి ఆరోపణలు గుప్పించటం ఇదే ప్రథమమని పలువురు పూర్వ విద్యార్థులు వాపోతున్నారు. రాజకీయ కార్యకలాపాలకు అవకాశం ఇవ్వరాదని అంగ్రూ అధికారులను కోరుతున్నారు.


ప్రభుత్వ కార్యక్రమంగా భావించా

- శ్రీనివాసరావు, కళాశాల ఏడీ

నిబంధనల ప్రకారం ప్రభుత్వ కార్యక్రమం కావడంతో ఆసరా సాయం పంపిణీకి బి.వి.నాథ్‌ ఆడిటోరియాన్ని రూ.15 వేల అద్దెకు డీఆర్డీఏ, మెప్మా అధికారులకు ఇచ్చాం. అతిథిగృహంలో ఎంపీ, మండలి చీఫ్‌ విప్‌, ఎమ్మెల్యే సమావేశం నిర్వహిస్తారని వ్యక్తిగత సహాయకులు అడిగారు. కళాశాల అతిథి గృహంలో వీసీ ఉండటంతో ప్రధాన భవనంలో సమావేశ గదిని కేటాయించాం. ఇది రాజకీయ సమావేశం అని తెలియదు. ప్రభుత్వ కార్యక్రమంగా భావించా. మరోసారి ఇలా జరగకుండా చూస్తా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని