Polavaram: పోలవరానికి మళ్లీ కేంద్రం షాక్‌!

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం రాష్ట్రానికి మళ్లీ షాక్‌ ఇచ్చింది. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తూ.. ఇక ఈ ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన నిధులు రూ.1,249 కోట్లే అని వెల్లడించింది.

Updated : 29 Mar 2023 09:51 IST

ఇక ఇచ్చేది రూ.1,249 కోట్లేనట
తాజాగా రూ.826 కోట్లు విడుదల చేస్తూ మళ్లీ పాతపాటే
సీఎం జగన్‌ ప్రయత్నాలు నిష్ప్రయోజనమేనా?

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం రాష్ట్రానికి మళ్లీ షాక్‌ ఇచ్చింది. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తూ.. ఇక ఈ ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన నిధులు రూ.1,249 కోట్లే అని వెల్లడించింది. ఈ ప్రాజెక్టు పూర్తవ్వాలంటే మరో రూ.30 వేల కోట్లకు పైగా నిధులు కావాలి. ఆ విషయాన్ని ఎటూ తేల్చకుండా 2020 అక్టోబరులో కేంద్ర ఆర్థికశాఖ చెప్పిన మాటలకే ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు తాజా ఉత్తర్వుల్లోనూ పేర్కొనడం గమనార్హం. కొత్త డీపీఆర్‌ ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు నిధులివ్వాలని ఆంధ్రప్రదేశ్‌ కోరుతున్నా, తాము నిధులు తెస్తామని ముఖ్యమంత్రి జగన్‌ పదే పదే చెబుతున్నా, దిల్లీ వెళ్లి అడుగుతూనే ఉన్నామని ప్రకటనలపై ప్రకటనలు విడుదల చేస్తున్నా రెండేళ్లుగా సాధించిందేమీ లేదని రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద తాజాగా రూ.826.18 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ‘పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) 2020 నవంబరు 2న నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టుకు సవరించిన అంచనాలను 2013-14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లకు ఆమోదించాం. దాని ప్రకారం 2014కు ముందు రూ.4,730.71 కోట్లు పోను నీటిపారుదల విభాగం కింద వ్యయమయ్యే మిగిలిన నిధులిస్తామన్నాం. ఆ మేరకు ఇప్పటి వరకు ప్రాజెక్టుకు రూ.13,592.22 కోట్లు ఇచ్చాం. మిగిలిన నిధులు రూ.2,075.68 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అందులో ప్రస్తుతం రూ.828.16 కోట్లు విడుదల చేస్తున్నాం’ అని లేఖలో తెలియజేసింది. ఈ నిధులు మినహాయిస్తే ఇక పోలవరానికి ఇచ్చేది రూ.1,249 కోట్లేనని మరోసారి స్పష్టం చేసినట్లయింది.

పీపీఏ మరో సిఫార్సు చేసినా...

పోలవరానికి ఇక రమారమి రూ.4000 కోట్లే ఇస్తామంటూ 2021 అక్టోబరులో కేంద్ర ఆర్థికశాఖ రాసిన లేఖ కలకలం సృష్టించింది. ఆ ఏడాది నవంబరు 2న పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) 2013-14 సవరించిన అంచనాలు రూ.20,398.61 కోట్లకు ఆమోదం తెలియజేసింది. ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఈ నిధులు సరిపోవని, 2017-18 ధరలతో రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ సిఫార్సు చేసిన రూ.47,725.74 కోట్లకు కూడా ఆమోదం తెలియజేయాలని అదే సమావేశంలో సిఫార్సు చేసింది.

పాత పాటే పాడిన మంత్రి

కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం తాజా ఉత్తర్వుల ప్రకారం కూడా పోలవరం అథారిటీ 2013-14 సవరించిన ధరలను పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొన్నదే తప్ప రూ.47,725 కోట్ల అంచనాలను పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు లేవు. కేంద్ర జలవనరులశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కూడా ఇలాగే మాట దాటేశారు. 2017-18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లకు సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిందని తెలిపారు. తర్వాత రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ రూ.47,725.87 కోట్లకు ఆమోదించిందన్నారు. అంతే తప్ప పోలవరానికి ఆ నిధులు ఇచ్చేలా కేంద్రం ఏ చర్యలు తీసుకుంటోందో వెల్లడించనేలేదు. మరో వైపు కేంద్ర ఆర్థికశాఖ ఇప్పటికీ రూ.20,398.61 కోట్లకే కట్టుబడి ఉన్నట్లు పేర్కొంటోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సీఎం జగన్‌ రెండేళ్లుగా పోలవరం నిధుల కోసం ప్రయత్నిస్తున్నామని చెబుతూనే ఉన్నా సాధించింది ఏమీ లేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని