ఎమ్మెల్యే శంకరనారాయణ నిలదీత

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే, రోడ్లు భవనాల శాఖ మాజీ మంత్రి శంకరనారాయణను రోడ్డు సౌకర్యం కల్పించలేదని మహిళలు నిలదీశారు.

Updated : 30 Mar 2023 06:40 IST

రొద్దం, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే, రోడ్లు భవనాల శాఖ మాజీ మంత్రి శంకరనారాయణను రోడ్డు సౌకర్యం కల్పించలేదని మహిళలు నిలదీశారు. ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని వాగ్వాదానికి దిగారు. బుధవారం రొద్దం ఎంపీడీఓ కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ ఆసరా చెక్కుల పంపిణీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. రొద్దం నుంచి చిన్నకోడిపల్లికి వెళ్లే రోడ్డు, పెన్నా నదిపై వంతెన నిర్మించకపోవడంతో తాము రాకపోకలకు అవస్థలు పడుతున్నామని మహిళలు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దిపల్లికీ రోడ్డు సౌకర్యం లేదన్నారు. ‘గతంలో రోడ్ల సమస్య పరిష్కరిస్తామని హామీనిచ్చారు.. ఏం చేయలేదు. ఇప్పుడు త్వరలో పరిష్కరిస్తామంటూనే నిర్లక్ష్యం చేస్తున్నారు’ అని నిలదీశారు. తెదేపా హయాంలోనూ పట్టించుకోలేదని, ఇప్పుడు మీరూ నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.  మహిళలంతా గట్టిగా ప్రశ్నించడంతో సంబంధిత ఇంజినీర్లతో మాట్లాడారు. అనంతరం సర్దిచెప్పకుండానే అక్కడినుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని