ఉపాధి బకాయిలు విడుదల చేయండి

ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు సుమారు రూ.2,500 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Published : 31 Mar 2023 05:13 IST

రెవెన్యూ లోటు నిధులూ చెల్లించండి
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించండి
కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం జగన్‌ విజ్ఞప్తి

ఈనాడు, దిల్లీ: ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు సుమారు రూ.2,500 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని గురువారం ఆమె అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి కలిశారు. 2021-22లో రూ.42,472 కోట్ల రుణ పరిమితికి అవకాశం కల్పించి, తర్వాత దానిని రూ.17,923 కోట్లకు కుదించారని సీఎం గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదని, ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు రావాల్సిన రూ.7,058 కోట్లను, 2014-15కు సంబంధించి రాష్ట్రానికి రెవెన్యూ లోటు కింద రావాల్సిన రూ.36,625 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన రూ.2600.74 కోట్లను విడుదల చేయడంతో పాటు ప్రాజెక్టు పనులు వేగంగా చేపట్టేందుకు మరో రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలని కోరారు. డయాఫ్రం వాల్‌ ప్రాంతంలో మరమ్మతులకు రూ.2020 కోట్లు ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టుకు సాంకేతిక సలహా కమిటీ నిర్ధారించిన రూ.55,548 కోట్లకు వెంటనే ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. అనంతరం జగన్‌ మధ్యాహ్నం 12.20 గంటలకు దిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని