కాలుష్యానికి నిలువుటద్దం విశాఖ పోర్టు

దేశంలోని మేజర్‌ పోర్టుల్లో ఒకటైన విశాఖ పోర్టు అథారిటీ కాలుష్యానికి నిలువుటద్దంగా మారిందని కాగ్‌ తాజాగా పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.

Updated : 31 Mar 2023 06:08 IST

ఏపీ కాలుష్య నియంత్రణ మండలి పనితీరూ లోపభూయిష్టం
కాగ్‌ ఆక్షేపణ

ఈనాడు, దిల్లీ: దేశంలోని మేజర్‌ పోర్టుల్లో ఒకటైన విశాఖ పోర్టు అథారిటీ కాలుష్యానికి నిలువుటద్దంగా మారిందని కాగ్‌ తాజాగా పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. 2018-19 నుంచి 2020-21 మధ్యకాలంలో 207.86 మిలియన్‌ టన్నుల సరకు రవాణాకు వేదికైన ఈ పోర్టులో ఉన్న పరిస్థితులపై కాగ్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించింది. ఇక్కడ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి పోషిస్తున్న పాత్రపైనా ఆరా తీసింది. ఈ విషయంలో ఈ రెండు సంస్థల పనితీరు చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని తేల్చింది.

* విశాఖ పోర్టు అథారిటీ కుదుర్చుకున్న దీర్ఘకాల లీజు ఒప్పందం ప్రకారం లీజుదారులు ఇక్కడ తమకు కేటాయించిన స్థలంలో 10శాతం మేర పచ్చదనం పెంచాలి. ఒకవేళ ఆ పనిచేయకపోతే వారి ద్వారా పది శాతానికి రెట్టింపు మొత్తంలో మొక్కలు పెంచడానికయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ వ్యయాన్ని లీజుదారులనుంచి వసూలుచేయాలి. 112.75 ఎకరాల్లో లీజుదారులు నిర్దిష్ట ప్రమాణాలు పాటించనందున వారి నుంచి జరిమానాల రూపంలో రూ.19.84 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.

* హార్బర్‌ వాటర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ లోపభూయిష్టం. ఇక్కడి నీటిలో లీడ్‌, డిసాల్వ్‌డ్‌ ఆక్సిజన్‌, టోటల్‌ సస్పెండెడ్‌ సాలిడ్స్‌ నిర్ణీత ప్రమాణాలకు మించి ఉన్నాయి.

* ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అనుమతించిన దానికంటే అధికంగా నీటి వినియోగం, మురుగు వ్యర్థాల పారబోత ఉంది.

* వాయుకాలుష్య ఉద్ఘారాలకు సంబంధించి నిర్దేశిత వార్షిక ప్రమాణాలను అందుకోవడంలో పోర్టు ట్రస్ట్‌ అథారిటీ విఫలమైంది.

* పోర్టులో దుమ్ముతో కూడిన ఖనిజ నిల్వలను టార్పాలిన్లతో కప్పాలని కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించింది. 2019 జనవరినుంచి 2021 జూన్‌ వరకు జరిపిన పరిశీలనలో 15శాతం నిల్వలపై ఎలాంటి టార్పాలిన్లు కప్పలేదని తేలింది. కప్పినవాటిపైనా టార్పాలిన్లు సగటున 60శాతం భాగాన్నే కవర్‌ చేస్తున్నాయి.

* కాలుష్యానికి కారణమైనవారినుంచే అందుకు తగ్గ మూల్యం వసూలుచేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఏపీ కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది. దాన్ని అనుసరించి ఏపీ కాలుష్య నియంత్రణ మండలి పోర్టు అథారిటీకి రూ.1.97 కోట్ల జరిమానా విధించింది. ఆ జరిమానా చెల్లించాక కూడా పోర్టు యాజమాన్యం కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించడం లేదు.

* ఇక్కడి డీజిల్‌ జనరేటర్లు విడుదల చేసే శబ్ద కాలుష్యం నిర్ణీత ప్రమాణాలకంటే ఎక్కువగా ఉంది.

* నీరు, వాయు కాలుష్యం ప్రమాణాలకు మించి ఉన్నా ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి తగిన చర్యలు తీసుకోవడం లేదు.

చేయాల్సిన పనుల వివరాలు

* కాలుష్యాన్ని తగ్గించేందుకు విశాఖ పోర్టు అథారిటీ సమగ్ర పర్యావరణ నిర్వహణ విధానాన్ని అమలుచేయాలి.

* ఒప్పందం ప్రకారం మొక్కలు పెంచని లీజుదారులపై చర్యలు తీసుకోవాలి.

* హార్బర్‌ వాటర్‌క్వాలిటీని మెరుగుపరచాలి.

* పచ్చదనం పెంపకం, మరుగుదొడ్లు, రహదారులు, బొగ్గు నిల్వలపై నీరు చిలకరించడానికి వ్యర్థ జలాల పునర్‌వినియోగంపై దృష్టి సారించాలి.

* దుమ్ము ధూళి ప్రభావాన్ని తగ్గించడానికి పోర్టులోని ఖనిజ నిల్వలపై పూర్తిస్థాయిలో టార్పాలిన్లు కప్పాలి.

* పోర్టు పరిధిలో పర్యావరణ ప్రమాణాలను పర్యవేక్షించడానికి అక్కడి పర్యావరణ విభాగానికి తగిన మానవ వనరులను నియమించాలి.

* తరచూ పర్యావరణ ఆడిట్‌ నిర్వహించి వెల్లడైన అంశాల ఆధారంగా దిద్దుబాటు చర్యలకు విశాఖ పోర్టు అథారిటీ చర్యలు చేపట్టాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు