సవాళ్లను ఎదుర్కొని అభివృద్థి పథంలోకి..

పట్టణాలు, నగరాల అభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్లు, వాటిని అధిగమించి ముందుకెళుతున్న తీరును ‘జి-20’ సన్నాహక సమావేశాల్లో వివిధ దేశాల ప్రతినిధులు, నిపుణులు వివరించారు.

Published : 31 Mar 2023 04:46 IST

‘జి-20’ సన్నాహక సమావేశాల్లో వివిధ దేశాల ప్రతినిధులు
పట్టణాలు, నగరాల పురోగతికి సలహాలు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: పట్టణాలు, నగరాల అభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్లు, వాటిని అధిగమించి ముందుకెళుతున్న తీరును ‘జి-20’ సన్నాహక సమావేశాల్లో వివిధ దేశాల ప్రతినిధులు, నిపుణులు వివరించారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న జి-20 సన్నాహక సమావేశాల్లో భాగంగా గురువారం జీ20 ప్రెసిడెన్సీ, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్త ఆధ్వర్యంలో ‘కెపాసిటీ బిల్డింగ్‌ వర్క్‌షాప్‌’ నిర్వహించారు. నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల సమీకరణకు అంతర్జాతీయంగా అవలంబిస్తున్న విధానాలపై చర్చించారు. స్థానిక ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. భారత్‌, సింగపూర్‌, దక్షిణ కొరియా, రష్యా, చైనాలకు చెందిన నిపుణులు ఆయా దేశాల్లోని నగరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేపడుతున్న చర్యలను వివరించారు. సింగపూర్‌లోని జాతీయ పర్యావరణ సంస్థ (ఎన్‌ఈఏ) మాజీ డిప్యూటీ సీఈవో అహ్‌ తువాన్‌ లో.. తమ దేశంలో నగరాల సుస్థిరాభివృద్ధికి అమలు చేస్తున్న పద్ధతులను వివరించారు. అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు, వ్యర్థాలు, నీటి నిర్వహణ, విద్య, పర్యావరణ పర్యవేక్షణపై అవగాహన కల్పించారు. దక్షిణ కొరియాలో పట్టణాల అభివృద్ధి, పెట్టుబడుల సమీకరణకు ఎదురైన సవాళ్లు, వాటిని ఎదుర్కొన్న తీరును సియోల్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ ఇన్హీ కిమ్‌, నిపుణులు హుయ్‌ షిన్‌ ప్రస్తావించారు. అనంతరం ప్రతినిధులు ముడసర్లోవలోని ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌, కాపులుప్పాడ డంపింగ్‌ యార్డులోని చెత్త నుంచి విద్యుదుత్పత్తి కేంద్రం, మాధవధారలోని 24 గంటల నీటి సరఫరా కేంద్రాలతోపాటు కైలాసగిరిని సందర్శించారు. వివిధ దేశాల్లో అభివృద్ధి చర్యల గురించి తెలుసుకునేందుకు మెరుగైన శిక్షణ నిర్వహించిన భారత ప్రభుత్వాన్ని వారు అభినందించారు. కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని