ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ ఇంటిని ముట్టడిస్తాం

‘నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌కు బంధువైన కార్పొరేటర్‌ కూకటి ప్రసాద్‌ పేదల భూమి ఆక్రమించాలని చూస్తున్నారు.

Published : 31 Mar 2023 04:53 IST

ఎస్సీల జోలికొస్తే ఊరుకునేది లేదు
దళితుల పాకల తొలగింపులో ఉద్రిక్తత
స్టేషన్‌ ఎదుట ఎమ్మార్పీఎస్‌ నాయకుల ఆందోళన

ఈనాడు డిజిటల్‌-నెల్లూరు, న్యూస్‌టుడే-స్టోన్‌హౌస్‌పేట: ‘నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌కు బంధువైన కార్పొరేటర్‌ కూకటి ప్రసాద్‌ పేదల భూమి ఆక్రమించాలని చూస్తున్నారు. ఎస్సీల జోలికొస్తే ఊరుకునేది లేదు. అవసరమైతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాం’ అని దళితసంఘం నాయకులు హెచ్చరించారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు అంబాపురం సర్వేనంబరు 1/1లో 12 ఎకరాల భూమి ఉంది. దీనిపై కోర్టులో వివాదం ఉంది. కొంతకాలంగా కొందరు ముస్లిం నాయకులు, ఎస్టీలు ఒక వర్గంగా, మరికొందరు ఎస్సీలు మరోవర్గంగా ఏర్పడి ఆ భూమి తమదంటే తమదని వాదించుకుంటున్నారు. పది రోజుల క్రితం ఎస్సీల్లో కొందరు అక్కడ పాకలు వేసుకోగా, రెండు రోజుల క్రితం కొందరు మైనార్టీలు, ఎస్టీలు పాకలు వేసేందుకు యత్నించారు. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం మరోసారి వారు పెద్దసంఖ్యలో అక్కడికి వెళ్లగా... అప్పటికే అక్కడ ఉన్న ఎస్సీలతో వాగ్వాదం జరిగి.. వివాదం ముదిరింది. ఈ క్రమంలో పోలీసులు కొందరు ఎస్టీలు, మైనార్టీ నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వారికి మద్దతుగా మాజీమంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. దీంతో ఎస్సీలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాకల తొలగింపుతో ఉద్రిక్తత

గత రెండు రోజులుగా జరుగుతున్న వివాదం గురువారం తారస్థాయికి చేరింది. అక్కడి పాకలను అధికారులు తొలగించి, అడ్డుకున్నవారిని అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. నెల్లూరు ఆర్డీవో, డీఎస్పీలు సిబ్బందితో గురువారం ఉదయం అక్కడకు వెళ్లారు. ఆ భూమి ప్రభుత్వానిదని, వెంటనే అందరూ ఖాళీచేయాలని హెచ్చరించారు. జేసీబీల సాయంతో పాకలను తొలగించారు. ఈ వారిని అడ్డుకునేందుకు దళిత సంఘ నాయకులు యత్నించారు. పోలీసులు 12మందిని అరెస్టుచేసి వెంకటాచలం పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం అక్కడున్న పాకలన్నీ తొలగించారు. ఆ తర్వాత అరెస్టు చేసినవారిని అయిదో పట్టణ పోలీసుస్టేషన్‌కు తీసుకురావడంతో.. దళితసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనిల్‌కు బుద్ధి చెబుతాం

‘ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ జిల్లాలో ఎక్కడ పోటీచేసినా ఓడిస్తాం. ఎమ్మెల్యే బంధువు కూకటి ప్రసాద్‌.. ఈ భూమిలో మూడెకరాలను ఇప్పటికే విక్రయించారు. దీనికి ఆయన ఏం సమాధానం చెబుతారు.? దళితుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఆర్డీవో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారు. వెంటనే ఆయన్ను సస్పెండ్‌ చేయాలి. రాబోయే రోజుల్లో అనిల్‌కు తగిన బుద్ధి చెబుతాం. జిల్లాలో ఎక్కడ పోటీచేసినా ఓడిస్తాం.’

 పి.సుబ్బయ్య, సీమాంధ్ర ఎమ్మార్పీఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని