ఉపాధి హామీకి కేంద్రం షాక్‌

జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా)లో 2023-24 సంవత్సరానికి పని దినాల కేటాయింపులో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది.

Updated : 01 Apr 2023 05:30 IST

రాష్ట్రానికి 15 కోట్ల పని దినాలే కేటాయింపు
27.50 కోట్లు అవసరమని అధికారుల అంచనా

ఈనాడు-అమరావతి: జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా)లో 2023-24 సంవత్సరానికి పని దినాల కేటాయింపులో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. 26 జిల్లాలకు కలిపి 27.50 కోట్ల పని దినాలు అవసరమని అధికారులు అంచనా వేస్తే.. ఇందుకు భిన్నంగా 15 కోట్లు మాత్రమే కేటాయించింది. గత ఏడాది (2022-23) మొదట 14 కోట్ల పని దినాలు కేటాయించిన కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై మళ్లీ దశల వారీగా 23 కోట్లకు పెంచింది. ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు క్రమంగా తగ్గిస్తోంది. ఈ ప్రభావం రాష్ట్రాలకు కేటాయించే పని దినాలపైనా ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై గతంలో ప్రారంభంలోనే భారీగా కేంద్రం కేటాయింపులు చేసేది. ఆర్థిక సంవత్సరం చివర్లో మళ్లీ అదనంగా సమకూర్చేది. గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రతిపాదనలపై తొలుత సగం కేటాయింపులు కూడా చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ నాలుగైదు నెలలకోసారి అదనపు కేటాయింపుల కోసం కేంద్రానికి ప్రతిపాదిస్తోంది. వీటిపై పునఃసమీక్షించి మళ్లీ కేటాయింపులు చేస్తోంది.

ఒక వైపు కొత్త విధానాలు... ఇంకో వైపు కేటాయింపుల్లో కోతలు

ఉపాధి హామీ పథకం అమలులో కేంద్ర ప్రభుత్వం అనేక కొత్త విధానాలను తీసుకొస్తూ...ఇంకోవైపు రాష్ట్రాలకు చేస్తున్న పని దినాల కేటాయింపుల్లో భారీగా కోత విధిస్తోంది. పథకం అమలుకు సంబంధించి రాష్ట్రానికో పోర్టల్‌ నిర్వహించే విధానం కాకుండా...అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) పోర్టల్‌కి అనుసంధానించారు. పని ప్రదేశాల్లో రెండు పూటలా కూలీల ఫొటోలు తీసి ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్‌ చేయడం, ఉపాధి కూలీల బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం చేసే విధానాన్ని కేంద్రం కొత్తగా తీసుకొచ్చింది. ఈ కారణంగా పని దినాల వినియోగం తగ్గుతుందని కేంద్రం అంచనా వేసి బడ్జెట్‌లో పథకానికి కేటాయింపులు తగ్గిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని