పంచాయతీలకు మరో సర్దు‘పోటు’!

ఏకగ్రీవ పంచాయతీలకు కేటాయించిన ప్రోత్సాహక నిధులు కాస్తా విద్యుత్తు ఛార్జీల బకాయిలకు చెల్లిపోయాయి. అధికారుల చర్యలతో సీఎం సొంత జిల్లా వైయస్‌ఆర్‌లోని అనేక పంచాయతీ ఖాతాలు కూడా ఖాళీ అయ్యాయి.

Published : 02 Apr 2023 03:47 IST

ఏకగ్రీవ ప్రోత్సాహక నిధులూ విద్యుత్తు ఛార్జీలకే  
సీఎం జిల్లాలోనూ పంచాయతీ ఖాతాలు ఖాళీ
శ్రీకాకుళం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలో అత్యధిక పంచాయతీలకు ఇప్పటికీ అందని నిధులు

ఈనాడు, అమరావతి: ఏకగ్రీవ పంచాయతీలకు కేటాయించిన ప్రోత్సాహక నిధులు కాస్తా విద్యుత్తు ఛార్జీల బకాయిలకు చెల్లిపోయాయి. అధికారుల చర్యలతో సీఎం సొంత జిల్లా వైయస్‌ఆర్‌లోని అనేక పంచాయతీ ఖాతాలు కూడా ఖాళీ అయ్యాయి. ఇప్పటికే ఆర్థిక సంఘం నిధులను విద్యుత్తు బకాయిలకు సర్దుబాటు చేయడంతో పంచాయతీల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రోత్సాహక నిధులతో కొన్ని ముఖ్యమైన పనులైనా చేయిద్దామని ఆశపడిన సర్పంచులు.. ఖాతాల్లో నిధులు కనిపించక ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని అనేక ఏకగ్రీవ పంచాయతీలకు రెండేళ్లయినా నిధులే కేటాయించలేదు.

ఇచ్చింది ఇలా..

రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవమైన 2,001 పంచాయతీలకు ప్రభుత్వం ఏడాది క్రితం రూ. 134 కోట్ల ప్రోత్సాహక నిధులు విడుదల చేసింది. 2,000 లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 5 లక్షలు, 2,001 నుంచి 5,000 లోపు ఉన్న వాటికి రూ. 10 లక్షలు, 5,001-10,000 లోపు వాటికి రూ. 15 లక్షలు, 10,000కు మించి జనాభా కలిగిన పంచాయతీలకు రూ. 20 లక్షలు చొప్పున నిధులు కేటాయించింది. వాటిని సాధారణ నిధుల ఖాతాకు జమ చేసినట్లు అధికారులు ప్రకటించినా.. కొన్ని జిల్లాల్లో పంచాయతీల పేరుతో ఉన్న ఆర్థిక సంఘం నిధుల పీడీ ఖాతాల్లో వేశారు. తర్వాత వాటిని విద్యుత్తు బకాయిల కింద సర్దుబాటు చేశారు. వైయస్‌ఆర్‌తోపాటు అన్నమయ్య జిల్లాల్లో 120కి పైగా పంచాయతీల్లో సర్పంచులకు ప్రోత్సాహక నిధులొచ్చాయన్న విషయం తెలిసేలోపే ఖాతాలు ఖాళీ అయ్యాయి. దాదాపు ఏడాదిగా ఇదే తంతు!

అధికారుల దాగుడుమూతలు

ప్రోత్సాహక నిధులను విద్యుత్తు బకాయిలకు సర్దుబాటు చేసిన విషయాన్ని జిల్లా అధికారులు కొందరు ఇప్పటికే రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ దృష్టికి తీసుకెళ్లారు. వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో ఈ విషయం ప్రస్తుతానికి వెలుగులోకి వచ్చినా.. దాదాపు పది జిల్లాల్లో ఇలాంటి సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. నిధుల సర్దుబాటు విషయాన్ని సర్పంచులు చెబుతున్నా, జిల్లా అధికారులు ధ్రువీకరిస్తున్నా.. పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ కార్యాలయం మాత్రం దీనిని అంగీకరించకపోవడం విశేషం.

మూడు జిల్లాల్లో అరకొరగా విడుదల: ఏకగ్రీవంగా ఎన్నికైన అన్ని పంచాయతీలకూ ప్రోత్సాహక నిధులు కేటాయించామని ప్రభుత్వం చెబుతోంది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లోని చాలా వాటికి రెండేళ్లయినా విడుదల చేయలేదు. అభివృద్ధి పనులకు నిధుల కోసం సర్పంచులు ఎదురు చూస్తున్నారు. అసలు జిల్లాల నుంచి పంచాయతీలకు విడుదల చేయలేదా.. లేక కమిషనర్‌ కార్యాలయం నుంచే కేటాయింపుల్లేవా.. అనే దానిపై సర్పంచులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.


నెలలోనే నిధులు మళ్లీ వెనక్కి

‘ఏకగ్రీవమైనందుకు ప్రోత్సాహకరంగా రూ. 5 లక్షలు కేటాయించిన ప్రభుత్వం నెల వ్యవధిలోనే మళ్లీ వెనక్కి తీసుకుంది. 2022 జనవరి 25న పంచాయతీ ఖాతాకు నిధులు జమ చేసి 2022 ఫిబ్రవరి 22న తిరిగి తీసుకుంది. పంచాయతీ చెల్లించాల్సిన విద్యుత్తు ఛార్జీల బకాయిల కింద వీటిని జమ చేసుకున్నారని అధికారులు చెబుతున్నారు’

దేవిరెడ్డి జయలక్ష్మి, భాజపా సర్పంచి, శేషారెడ్డిపల్లె పంచాయతీ, వైయస్‌ఆర్‌ జిల్లా


నిధులు ఇంకెప్పుడిస్తారు?

’ఏకగ్రీవ పంచాయతీకి అందాల్సిన రూ. 5 లక్షలు ఇంతవరకు అందలేదు. గ్రామంలో తాగునీరు, రహదారులు, మురుగునీటి సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఇప్పటికే పంచాయతీలో నిధులు లేక అభివృద్ధి పనులు చేయలేకపోతున్నాం. ప్రోత్సాహక నిధులైనా వెంటనే అందించాలి’

అంపిలి రూపావతి, తెదేపా సర్పంచి, తుడ్డలి పంచాయతీ, బూర్జ మండలం, శ్రీకాకుళం జిల్లా



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు