ISIS drug - Tramadol: నరసరావుపేటలో ‘ఐసిస్‌ డ్రగ్‌’ తయారీ!

ప్రపంచాన్ని గడగడలాడించే ఐసిస్‌, బోకోహరామ్‌ వంటి ఉగ్రవాద సంస్థలు విరివిగా వినియోగించే, ‘ఐసిస్‌ డ్రగ్‌’గా పేరొందిన ‘ట్రెమడాల్‌’ అనే సైకోట్రోపిక్‌ సబ్‌స్టెన్స్‌ (మాదకద్రవ్యం)ను మాత్రల రూపంలో విదేశాలకు ఎగుమతి చేస్తున్న వ్యవహారంలో పల్నాడు జిల్లా నరసరావుపేటకు సమీపంలోని సేఫ్‌ ఫార్ములేషన్స్‌ ఔషధ కంపెనీ యజమాని శనగల శ్రీధర్‌రెడ్డిని ముంబయి కస్టమ్స్‌ అధికారులు ఇటీవల అరెస్ట్‌ చేయడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

Updated : 28 Apr 2023 08:33 IST

సేఫ్‌ ఫార్ములేషన్‌ కంపెనీలో ట్రెమడాల్‌ మాత్రల ఉత్పత్తి
కాల్షియం మాత్రల పేరుతో ఎగుమతి
పట్టుకున్న ముంబయి కస్టమ్స్‌ అధికారులు
అనుమతుల్లేకుండా విదేశాలకు ఎగుమతి చేస్తున్న బెంగళూరు సంస్థ
సేఫ్‌ ఫార్ములేషన్‌ కంపెనీ డైరెక్టర్‌ శనగల శ్రీధర్‌రెడ్డి అరెస్ట్‌
కోడెల కుటుంబానికి చెందిన ఆ కంపెనీ ఇప్పుడు వైకాపా సన్నిహితుల చేతుల్లో..

ఈనాడు, అమరావతి: ప్రపంచాన్ని గడగడలాడించే ఐసిస్‌, బోకోహరామ్‌ వంటి ఉగ్రవాద సంస్థలు విరివిగా వినియోగించే, ‘ఐసిస్‌ డ్రగ్‌’గా పేరొందిన ‘ట్రెమడాల్‌’ అనే సైకోట్రోపిక్‌ సబ్‌స్టెన్స్‌ (మాదకద్రవ్యం)ను మాత్రల రూపంలో విదేశాలకు ఎగుమతి చేస్తున్న వ్యవహారంలో పల్నాడు జిల్లా నరసరావుపేటకు సమీపంలోని సేఫ్‌ ఫార్ములేషన్స్‌ ఔషధ కంపెనీ యజమాని శనగల శ్రీధర్‌రెడ్డిని ముంబయి కస్టమ్స్‌ అధికారులు ఇటీవల అరెస్ట్‌ చేయడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఆ ఔషధ కంపెనీని స్థాపించింది తెదేపా నేత దివంగత కోడెల శివప్రసాద్‌రావు కావడం, వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీ అధికార పార్టీ నాయకులకు సన్నిహితులుగా భావిస్తున్న వారి స్వాధీనంలోకి వెళ్లడంతో రాజకీయ వర్గాల్లోనూ ఈ అంశం చర్చనీయాంశమైంది. బెంగళూరుకు చెందిన ఫస్ట్‌వెల్త్‌ సొల్యూషన్స్‌ అనే సంస్థ ముంబయి నుంచి దక్షిణ సూడాన్‌ రాజధాని జుబాకు కాల్షియం కార్బొనేట్‌ మాత్రల (టామోల్‌-ఎక్స్‌-225) పేరుతో ఎగుమతి చేస్తున్న భారీ కన్‌సైన్‌మెంట్‌ను ఫిబ్రవరి 28న కస్టమ్స్‌ అధికారులు అనుమానంతో పరిశీలించగా వాటిలో ఉన్నవి ట్రెమడాల్‌ మాత్రలని తేలింది. సుమారు 10 లక్షల మాత్రల్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవి తయారైంది సేఫ్‌ ఫార్ములేషన్స్‌లో అని తేలడంతో, ఆ వ్యవహారంలో ప్రమేయం ఉందన్న అనుమానంతో శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా..

బెంగళూరుకు చెందిన ఫస్ట్‌ వెల్త్‌ సొల్యూషన్స్‌ సంస్థ కాల్షియం కార్బొనేట్‌ మాత్రల పేరిట ట్రెమడాల్‌ మాత్రలను దక్షిణ సూడాన్‌కు ఎగుమతి చేస్తుండగా ముంబయి కస్టమ్స్‌ అధికారులు పట్టుకుని,   మార్చి నెలలో కేసు నమోదు చేశారు. ఆ సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, బెంగళూరు వాసి గుడిపాటి సుబ్రమణ్యాన్ని మార్చి 12న అరెస్టు చేశారు. ఆయన్ను విచారించగా.. నరసరావుపేటలోని సేఫ్‌ ఫార్ములేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ వాటిని తయారు చేసి, తమకు సరఫరా చేసిందని చెప్పారు. దీంతో ఆ సంస్థ డైరెక్టర్‌ శనగల శ్రీధర్‌రెడ్డిని అరెస్టు చేశారు. అంతకు ముందు బెంగళూరు కేంద్రంగా ఉన్న ఐరిస్‌ హెల్త్‌ గ్లోబల్‌ వెల్‌నెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు కూడా సేఫ్‌ ఫార్ములేషన్స్‌ పెద్ద ఎత్తున ట్రెమడాల్‌ మాత్రలు సరఫరా చేసినట్లు కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు.

మాత్ర కాదు.. మాదకద్రవ్యమే

నొప్పి నివారణ మాత్రలైన ట్రెమడాల్‌ తయారీ, వినియోగంపై 2018 ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలు, నియంత్రణలు విధించింది. ఎన్‌డీపీఎస్‌ చట్టం పరిధిలోకి తీసుకొచ్చి సైకోట్రాపిక్‌ సబ్‌స్టాన్స్‌ (మాదకద్రవ్యం)గా గుర్తిస్తూ 2018 ఏప్రిల్‌ 26న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ట్రెమడాల్‌ మాత్రల్ని దేశంలో వినియోగించేందుకు ప్రభుత్వం అనుమతించిన పరిమాణంలో, కాంబినేషన్స్‌లో మాత్రమే తయారు చేయాలి. వేరే కాంబినేషన్‌లో తయారుచేసి, విదేశాలకు ఎగుమతి చేయాలంటే నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అనుమతి పొందాలి. ట్రెమడాల్‌ను మాదకద్రవ్యంగా విపరీతంగా వినియోగిస్తుండటంతో ప్రభుత్వం ఈ ఆంక్షలు పెట్టింది. అలసట రాకుండా ఉండటానికి, ఎక్కువ సమయం ఉత్తేజంగా పని చేయడానికి ఐసిస్‌, బోకోహరామ్‌ వంటి సంస్థల ఉగ్రవాదులు ఆ మాత్రలు వాడుతుంటారు. ఫస్ట్‌వెల్త్‌ సొల్యూషన్స్‌ సంస్థ దక్షిణ సూడాన్‌కు ట్రెమడాల్‌ మాత్రల ఎగుమతికి ఎన్‌సీబీ అనుమతి తీసుకోలేదు సరికదా, కాల్షియం కార్బొనేట్‌ మాత్రల ముసుగులో వాటిని ఎగుమతి చేయాలని ప్రయత్నిస్తూ కస్టమ్స్‌ అధికారులకు దొరికిపోయింది. ఆ సంస్థ గతంలోనూ అనుమతులు లేకుండా ట్రెమడాల్‌ను ఎగుమతి చేసినట్టుగా కస్టమ్స్‌ విభాగం గుర్తించింది.  

అనుమతులు ఎలా ఇచ్చారు?

ట్రెమడాల్‌ మాత్రలు పట్టుబడటం, శ్రీధర్‌రెడ్డి అరెస్ట్‌ వంటి పరిణామాలపై సేఫ్‌ ఫార్ములేషన్స్‌ కంపెనీకి చెందిన స్థానిక ప్రతినిధిని ‘ఈనాడు’ సంప్రదించింది. తాము రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి అనుమతి తీసుకునే ట్రెమడాల్‌ మాత్రలు తయారు చేశామని, ట్రెమడాల్‌ పేరుతోనే ప్యాకింగ్‌ కూడా చేశామని, తేడా ఎక్కడ జరిగిందో తమకు తెలియదని బదులిచ్చారు. ఏదైనా సంస్థ తనకు ఎగుమతి ఆర్డర్‌ వచ్చిందని, ట్రెమడాల్‌ మాత్రల్ని తయారు చేసివ్వమని మీ కంపెనీని కోరితే... ఎగుమతి ఆర్డర్‌ చూపించమని అడగరా? రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఎగుమతి ఆర్డర్‌ను కూడా జతచేయరా? అన్న ప్రశ్నలకు..  ఎగుమతి ఆర్డర్‌ ఉందో లేదో తాము చూడమని, వర్క్‌ఆర్డర్‌ను బట్టి మాత్రలు సరఫరా చేస్తామని తెలిపారు. రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థకు చేసే దరఖాస్తులో కూడా వర్క్‌ఆర్డర్‌నే పొందుపరుస్తామన్నారు. మాదకద్రవ్యంగా గుర్తించి, కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పుడు, ఎగుమతి చేయాలంటే అనేక షరతులు పెట్టినప్పుడు.. బాధ్యతగల రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థ అంత ఉదాసీనంగా ఎలా అనుమతులిచ్చేస్తుంది? ట్రెమడాల్‌ తయారీకి అనుమతి కోసం ఏదైనా కంపెనీ దరఖాస్తు చేసుకుంటే ఎగుమతి ఆర్డర్‌ ఉందో లేదో చూడరా? ఫస్ట్‌వెల్త్‌ సొల్యూషన్స్‌కి ట్రెమడాల్‌ మాత్రల సరఫరాకు సేఫ్‌ ఫార్ములేషన్స్‌ సంస్థకు అనుమతిచ్చినట్లు ముంబయి కస్టమ్స్‌ విభాగం అదనపు కమిషనర్‌కు రాసిన లేఖలో.. రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌.రవిశంకర్‌ నారాయణ్‌ ధ్రువీకరించారు. ఫస్ట్‌వెల్త్‌ సొల్యూషన్స్‌కు నిజంగానే ఎగుమతి ఆర్డర్‌ ఉంటే.. ఎన్‌సీబీ నుంచి ఎందుకు అనుమతి తీసుకోలేదు? కాల్షియం మాత్రల పేరుతో ట్రెమడాల్‌ ఎందుకు ఎగుమతి చేస్తోంది? ఆ సంస్థకు ఎన్‌సీబీ అనుమతి ఉందో లేదో రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం ఎందుకు చూడలేదు? ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీని వెనుక భారీ గూడుపుఠాణీ జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

కరోనాలో భారీగా ఆర్డర్లు

సేఫ్‌ ఫార్ములేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దఎత్తున మందులు, సర్జికల్‌ పరికరాలను సరఫరా చేస్తోంది. కొవిడ్‌ ఉద్ధృతంగా ఉన్నప్పుడు కరోనా రోగులకు వాడేందుకు వినియోగించే వివిధ మందుల్ని, సామగ్రిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు పొందినట్టు సమాచారం.

కంపెనీ చేతులు మారింది ఇలా..!

సత్తెనపల్లి-నరసరావుపేట మార్గంలో ముప్పాళ్లకు సమీపంలోని గోళ్లపాడు వద్ద కోడెల శివప్రసాదరావు 1985లోనే సెలైన్‌ సీసాలతయారీ కంపెనీని ప్రారంభించారు. తర్వాత దాన్ని సేఫ్‌ పేరెంటల్స్‌ కంపెనీగా మార్చారు. అనంతరం అదే ప్రాంగణంలో సేఫ్‌ ఫార్ములేషన్స్‌ కంపెనీని నెలకొల్పారు. వైకాపా అధికారంలోకి వచ్చేవరకు ఆ రెండు కంపెనీలు కోడెల కుటుంబ నిర్వహణలోనే ఉన్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ కుటుంబంపై రకరకాలుగా ఒత్తిడి తెచ్చి ఈ కంపెనీలను స్వాధీనం చేసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. సేఫ్‌ ఫార్ములేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 2020 మే 13న  శనగల శ్రీధర్‌రెడ్డి, గాదె కనిగిరి డైరెక్టర్లుగా చేరారు. 2022 ఫిబ్రవరి 14న బాలినేని అరుణ, బాలినేని గోవిందరెడ్డి అదనపు డైరెక్టర్లుగా చేరారు. వీరిలో శ్రీధర్‌రెడ్డి ఆథరైజ్డ్‌ సిగ్నేటరీగా వ్యవహరిస్తున్నారు. సేఫ్‌ పేరెంటల్స్‌ (సేఫ్‌ ఫార్మా)లోనూ శ్రీధర్‌రెడ్డి, గాదె కనిగిరి డైరెక్టర్లుగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని