AP High Court: అది ప్రైవేటు వివాదం.. ధనికుల మధ్య ఫైటింగ్‌

విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో ఏర్పాటుకు కేటాయించిన భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్‌ లేఅవుట్‌ వేసేందుకు అనుమతిస్తూ విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Updated : 12 May 2023 08:27 IST

రామానాయుడి స్టూడియో భూముల్లో లేఅవుట్‌పై పిల్‌ కొట్టివేసిన ధర్మాసనం
ఇందులో ప్రజాహితం ఏముందని ఘాటు వ్యాఖ్యలు

ఈనాడు, అమరావతి: విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో ఏర్పాటుకు కేటాయించిన భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్‌ లేఅవుట్‌ వేసేందుకు అనుమతిస్తూ విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘పిటిషన్‌ దాఖలు చేసింది ఓ ఎమ్మెల్యే.. అది ఫిల్మ్‌ స్టూడియో భూమి. ప్రభుత్వానిది కాదు. అది పూర్తిగా ప్రైవేటు వివాదం. అది ధనికుల మధ్య ఫైటింగ్‌’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రతి ఉల్లంఘననూ పిల్‌ రూపంలో సవాలు చేయలేరని తేల్చిచెప్పింది. ఇందులో ప్రజాహితం ఏముందని వ్యాఖ్యానించింది. ఈ కేసులో పేదల ప్రయోజనాలు ఎక్కడున్నాయని ప్రశ్నించింది. జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ పిల్‌ను కొట్టేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.

మధురవాడ సర్వేనంబరు 387/పిలో 15.80 ఎకరాలను రెసిడెన్షియల్‌ లేఅవుట్‌గా మార్చేందుకు సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ సమర్పించిన లేఅవుట్‌ ప్లాన్‌ను ఆమోదిస్తూ ఈ ఏడాది మార్చి 2న జీవీఎంసీ కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ హైకోర్టులో పిల్‌ వేశారు. మధురవాడలోని వివిధ సర్వే నంబర్లలో రామానాయుడి స్టూడియో కోసం 34.44 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2003 సెప్టెంబర్‌ 13న జీవో ఇచ్చిందన్నారు. భూకేటాయింపు నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో సంబంధిత జీవోను రద్దు చేయాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా 15.80 ఎకరాల్లో రెసిడెన్షియల్‌ లేఅవుట్‌ ఏర్పాటుకు అనుమతిచ్చారన్నారు. గురువారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున న్యాయవాది టి.విష్ణుతేజ వాదనలు వినిపించారు. జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన ధర్మాసనం.. వ్యాజ్యాన్ని ఉపసంహరించుకొని ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాలని సూచించింది. న్యాయవాది ఉపసంహరణకు విముఖత తెలిపారు. తగిన ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. దీంతో పిల్‌ను కొట్టేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు