సంక్షిప్త వార్తలు (9)

తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేష్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు.

Updated : 20 May 2023 05:10 IST

శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్‌ సురేష్‌రెడ్డి

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేష్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం, తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.


ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలు 22 నుంచి

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు ఈనెల 22 నుంచి జూన్‌ 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 


ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ కిందకే ‘బీకాం’

ఈనాడు, అమరావతి: ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగం కిందకే బీకాం కోర్సు వస్తుందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు బీకాంను ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌ కిందే పరిగణిస్తున్నాయని తెలిపింది. బీకాం చదివిన విద్యార్థులూ వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శులుగా బాధ్యతలు నిర్వహించేందుకు అర్హులని పేర్కొంది. ఎనిమిది వారాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలంది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ వి.శ్రీనివాస్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చింది.


37 మంది అదనపు ఎస్పీలకు పోస్టింగులు

ఈనాడు-అమరావతి: డీఎస్పీల నుంచి అదనపు ఎస్పీలుగా పదోన్నతి పొందిన 37 మంది అధికారులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం పోస్టింగులు ఇచ్చింది. పరిపాలన విభాగం అదనపు ఎస్పీలుగా, స్పెషల్‌ బ్రాంచ్‌, ఏసీబీ, విజిలెన్స్‌, సెబ్‌ తదితర విభాగాల్లో వారికి పోస్టింగులిచ్చింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌కుమార్‌ గుప్తా శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.


అంతర్‌రాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలి

సెబ్‌ కమిషనర్‌ రవిప్రకాశ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మాదకద్రవ్యాలు, గంజాయి అక్రమ రవాణాను అరికట్టడానికి అంతర్‌రాష్ట్ర సరిహద్దుల వద్ద వాహనాల తనిఖీలను ముమ్మరం చేయాలని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) కమిషనర్‌ రవిప్రకాశ్‌ సూచించారు. కళాశాలలు, విద్యాసంస్థలు, కిరాణా, పాన్‌ దుకాణాల వద్ద నిఘా ఏర్పాటుచేయాలని తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. నాటుసారా అరికట్టడానికి జిల్లాల్లో విస్తృతంగా దాడులు చేయాలని తెలిపారు. ‘నాటుసారా తయారీ, గంజాయి సాగుదారులను గుర్తించి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. పదేపదే నేరాలకు పాల్పడుతున్న వారిపై పీడీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఇండస్ట్రియల్‌ ఆల్కహాల్‌ వినియోగిస్తున్న పరిశ్రమల్లో తనిఖీలు చేసి భద్రతా ప్రమాణాలు పాటించేలా యాజమాన్యాలకు సూచనలివ్వాలి’ అని రవిప్రకాశ్‌ ఆదేశించారు.


కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్‌గా రఘునాథరెడ్డి

ఈనాడు, అమరావతి: రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్‌గా ఒంటెద్దు రఘునాథరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆయన నియామకం జూన్‌21 నుంచి అమల్లోకి వస్తుందని, అప్పటినుంచి రెండేళ్లు ఈ పదవిలో కొనసాగుతారని వెల్లడించింది.


గ్రంథాలయాల వేసవి శిక్షణ శిబిరాల సమయాన్ని మార్చాలి: కళ్లేపల్లి

ఈనాడు, అమరావతి: గ్రంథాలయాల్లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాల సమయాన్ని మార్పు చేయాలని ఏపీ రాష్ట్ర  గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదనరాజు కోరారు. పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయ ఉద్యోగులు..విద్యార్థుల ఇళ్లకు వెళ్లి, తీసుకురావడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. ఈ వేసవి శిబిరాల సమయాన్ని ఉదయం 8గంటల నుంచి 11గంటల వరకు మాత్రమే ఉంచాలని, శుక్రవారం, రెండో శనివారం, ప్రభుత్వ సెలవుల్లో గ్రంథాలయాలకు సెలవులు ఇవ్వాలని కోరారు. 40రోజులపాటు నిర్వహించే శిక్షణ శిబిరాలకు రూ.10వేల బడ్జెట్‌ సరిపోవడం లేదని తెలిపారు.  


వెబ్‌సైట్‌లో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లను జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో కళాశాలల ప్రిన్సిపాళ్ల లాగిన్‌లో ఉంచామని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. ప్రిన్సిపాళ్లు వాటిని డౌన్‌లోడ్‌ చేసి, విద్యార్థులకు అందించాలని సూచించారు.


ముగిసిన ఈఏపీసెట్‌ ఎంపీసీ స్ట్రీమ్‌ ప్రవేశ పరీక్ష

ఈనాడు, అమరావతి- జేఎన్‌టీయూ, న్యూస్‌టుడే: ఈఏపీసెట్‌ ఎంపీసీ స్ట్రీమ్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఈనెల 15 నుంచి ప్రారంభమైన పరీక్షలను 9 విడతల్లో నిర్వహించినట్లు కన్వీనర్‌ శోభాబిందు తెలిపారు. మొత్తం 2,38,180 మంది పరీక్షకు రిజిస్టర్‌ చేసుకోగా.. 2,24,724(94.35%)మంది హాజరయ్యారు. ఈనెల 22, 23 తేదీల్లో బైపీసీ స్ట్రీమ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని