ఆర్‌అండ్‌బీలో పదోన్నతులు, బదిలీలకు బేరాలు మొదలు

ఉద్యోగుల బదిలీల ప్రక్రియ సోమవారం నుంచి మొదలవుతుండటంతో ఆర్‌అండ్‌బీలోని కీలక ఉద్యోగి మళ్లీ రంగంలోకి దిగారు.

Updated : 22 May 2023 06:20 IST

పదోన్నతుల జాబితా కోసం ఓ ఉద్యోగి పట్టు
దాంతో డబ్బు దండుకునేందుకు యత్నం

ఈనాడు, అమరావతి: ఉద్యోగుల బదిలీల ప్రక్రియ సోమవారం నుంచి మొదలవుతుండటంతో ఆర్‌అండ్‌బీలోని కీలక ఉద్యోగి మళ్లీ రంగంలోకి దిగారు. కొందరు ఏఈలకు డీఈలుగా పదోన్నతులు ఇవ్వనున్నారు. దీనికీ ఆయన బేరాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. మంత్రి పేషీలో ఉంటూ.. ఆర్‌అండ్‌బీకి చెందిన అన్ని అంశాల్లో చక్రం తిప్పే ఆ ఉద్యోగి మళ్లీ తన అస్త్రాలు ఉపయోగిస్తున్నారు. గత ఏడాది ఇలాగే బదిలీల సమయంలో ఇంజినీర్లను వాట్సప్‌ కాల్స్‌ ద్వారా సంప్రదించి, బేరాలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడూ అలాగే చేస్తున్నట్లు తెలిసింది. ఒకేచోట అయిదేళ్లు దాటినవాళ్లు, రెండేళ్లు పనిచేసి, అభ్యర్థనపై వెళ్లాలనుకుంటున్నవారి జాబితా సిద్ధం చేసుకొని మంతనాలు మొదలుపెట్టినట్లు తెలిసింది.

పదోన్నతుల జాబితా కావాలంటూ..

పదుల సంఖ్యలో ఏఈలకు డీఈలుగా పదోన్నతులు ఇవ్వనున్నారు. ఉన్నతస్థాయిలో ఉండే ప్యానెల్‌ ఈ జాబితాను ఆమోదించాలి. ప్యానెల్‌ ఇంకా ఆమోదించకుండానే ఆ జాబితా కావాలంటూ అమాత్యుని పేషీలోని కీలక వ్యక్తి పట్టుబడుతున్నట్లు తెలిసింది. వాస్తవానికి 70-80 మంది ఏఈలకు గతంలోనే డీఈలుగా పదోన్నతులు కల్పించారు. ఇపుడు వారిని క్రమబద్ధీకరించాలి. కొత్తగా మరో 20 మందికి పదోన్నతులు ఇవ్వాలి. దీనిపై కసరత్తు జరుగుతోంది. వారి రోస్టర్‌ పాయింట్లు, విద్యార్హతలను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. అయినా.. ముందే జాబితా ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఆ జాబితా ముందే ఇస్తే, పదోన్నతి పొందేవారి నుంచి కొంత మొత్తం రాబట్టుకోవాలని చూస్తున్నట్లు కొందరు ఏఈలు పేర్కొంటున్నారు.

అమాత్యుని బంధువుకు అన్నీ తానై

ఆ ఉద్యోగి తీరుపై చాలాకాలంగా ఆరోపణలు ఉన్నాయి. పేషీలో మంత్రి కంటే ఆయన బంధువే అన్ని వ్యవహారాలూ చూస్తుంటారు. ఆయనకు అన్నీ తానై ఆ ఉద్యోగి చెలరేగిపోతుంటారన్నది ఆర్‌అండ్‌బీలో అందరికీ తెలిసిన విషయమే. కొంతకాలం క్రితం మంత్రి ఓఎస్‌డీగా ఉన్న ఓ అధికారిని ఆకస్మికంగా తప్పించి, మాతృశాఖకు పంపేశారు. తర్వాత అదనపు పీఎస్‌గా ఉన్న ఒకరు పీఎస్‌గా నియమితులయ్యారు. దీంతో ఖాళీ అయిన అదనపు పీఎస్‌ పోస్టులో కీలక ఉద్యోగిని నియమించేలా దస్త్రాన్ని సాధారణ పరిపాలనశాఖ (జీఏడీ)కి పంపారు. అయితే ఆ ఉద్యోగిపై ఉన్న ఆరోపణల కారణంగా దస్త్రాన్ని జీఏడీ తిరస్కరించినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని