పన్ను ఎగవేతదారులపై గురి

జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక పన్ను ఎగవేత అసాధ్యమనుకున్నా.. మోసపూరిత వ్యాపారులు దాన్ని సైతం ఛేదించి అక్రమాలకు పాల్పడుతున్నారు.

Published : 26 May 2023 04:43 IST

తెలంగాణలో 500కి పైగా బోగస్‌ జీఎస్టీ నంబర్లు
దేశవ్యాప్తంగా 73 వేలకు పైగా గుర్తించిన కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక పన్ను ఎగవేత అసాధ్యమనుకున్నా.. మోసపూరిత వ్యాపారులు దాన్ని సైతం ఛేదించి అక్రమాలకు పాల్పడుతున్నారు. అంతర్రాష్ట్ర వ్యాపారాల్లో పన్ను ఎగవేస్తున్న వ్యాపారులను పట్టుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 73 వేలకు పైగా, అందులో తెలంగాణలో 500కి పైగా జీఎస్టీ నంబర్లకు సంబంధించిన వ్యాపారులు పన్ను సరిగా కట్టకుండా మోసాలకు పాల్పడుతున్నట్లు కేంద్రం అంచనాకు వచ్చింది. క్షేత్రస్థాయిలో గట్టిగా తనిఖీలు చేసి వీరిపై కఠినచర్యలు తీసుకోవాలని కేంద్రం తాజాగా అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ దిశగా రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి తనిఖీలు ప్రారంభించింది. ఈ నెల 16 నుంచి జులై 15లోగా రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేసి బోగస్‌ వ్యాపారులను గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక టోకు వ్యాపారి మరో వ్యాపారికి సరకులు అమ్మినప్పుడు కొన్న వ్యక్తి జీఎస్టీ చెల్లించాలి. ఇలా కొన్నవ్యక్తి మరో చిల్లర వ్యాపారికి అమ్మితే అక్కడ మళ్లీ పన్ను వసూలు చేస్తున్నాడు. ఇలా పన్ను వసూలు చేసే ప్రక్రియలో ‘ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌’ (ఐటీసీ) జమలో మోసాలు జరుగుతున్నట్లు కేంద్రం రాష్ట్రాలకు తెలిపింది. మొత్తం గుర్తించిన 73 వేల జీఎస్టీ ఖాతా నంబర్లలో అత్యంత సున్నితమైనవి 47 వేలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని మూడు రకాలుగా కేంద్రం విభజించింది. మొదటి రకంలో 6,264 ఖాతాల నుంచి పన్ను చెల్లింపుల్లో విపరీతమైన హెచ్చుతగ్గులుండటంతో తొలుత వాటిని తనిఖీలు చేయాలని సూచించింది. దేశవ్యాప్తంగా 38,837 మంది వ్యాపారులు వారి దగ్గరి బంధువులు, స్నేహితుల పేర్లతో జీఎస్టీ నంబరు తీసుకుని వారికి అమ్మినట్లు లెక్కలు చూసి ఐటీసీ ఎగ్గొడుతున్నట్లు తేలింది. జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ రద్దు చేసుకున్న వ్యాపారుల నుంచి సరకులు కొనుగోలు చేస్తూ ఐటీసీ కొల్లగొడుతున్న వారు మరో 1,935 మంది ఉన్నారు. వీటిపై తనిఖీలకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ 200కి పైగా ప్రత్యేక బృందాలను రాష్ట్రవ్యాప్తంగా నియమించింది. ఇప్పటికే రాష్ట్రంలో మోసాలకు పాల్పడుతున్న మూడువేల జీఎస్టీ నంబర్లను గుర్తించామని, వాటిని మరింత లోతుగా పరిశీలిస్తున్నట్లు ఒక అధికారి ‘ఈనాడు’కు చెప్పారు. కేంద్రం పంపిన సమాచారం ఆధారంగా మరో 500 రిజిస్ట్రేషన్‌ నంబర్ల వ్యాపారాలపై సైతం నిఘా పెట్టినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని