చెల్లెమ్మలకు విద్యా వికాసం

ఉన్నత చదువులతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఎన్టీఆర్‌ త్రికరణ శుద్ధిగా నమ్మారు. సాధారణ విశ్వవిద్యాలయాల్లో మహిళల ప్రవేశాలు తక్కువగా ఉంటున్నాయని గుర్తించి.. వారికోసం ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని భావించారు.

Published : 27 May 2023 04:55 IST

మహిళలకు ప్రత్యేకంగా శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఏర్పాటు

ఉన్నత చదువులతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఎన్టీఆర్‌ త్రికరణ శుద్ధిగా నమ్మారు. సాధారణ విశ్వవిద్యాలయాల్లో మహిళల ప్రవేశాలు తక్కువగా ఉంటున్నాయని గుర్తించి.. వారికోసం ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని భావించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రెండు నెలల్లోనే 1983 ఏప్రిల్‌ 14న తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. ఇది దక్షిణాదిలోనే తొలి మహిళా విశ్వవిద్యాలయం. మొత్తం 138.43 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. తొలుత 9 కోర్సులతో ప్రారంభించగా 144 మంది విద్యార్థినులు ప్రవేశాలు పొందారు. అనుబంధ కళాశాలలు లేకుండా కేంద్రీయ విశ్వవిద్యాలయాల నమూనాలో ఇది కొనసాగుతోంది. ప్రస్తుతం మహిళ విశ్వవిద్యాలయంలో 5 వేల మందికి పైగా విద్యార్థినులు చదువుతున్నారు. గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయుల్లో 59 కోర్సులున్నాయి. మహిళలు ఉద్యోగాలు చేయడమే కాకుండా ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలనే దృక్పథంతో.. ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్‌ కోర్సుల రూపకల్పనలోనూ భాగస్వామి అయ్యారు.  ఈ  విశ్వవిద్యాలయానికి ఎన్‌ఐఆర్‌ఎఫ్‌, టైమ్స్‌, క్యూఎస్‌, ఐవోఎస్‌ వంటి ప్రముఖ ర్యాంకింగ్‌ సంస్థల నుంచి ప్రశంసలు లభించాయి. విద్యార్థినులు చేస్తున్న పరిశోధనలకు దాదాపు రూ.120 కోట్లు నిధులు సైతం వచ్చాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని