Viveka Murder case: వివేకా హత్య కేసులో రహస్య సాక్షి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. రాజకీయ కుట్ర కోణంలో రహస్య సాక్షిని సీబీఐ తెరపైకి తీసుకువచ్చింది.

Updated : 28 May 2023 12:50 IST

ఇప్పుడే ఆ పేరు, వివరాలు వెల్లడించలేం
కోర్టు పరిశీలనకు మాత్రమే సమర్పిస్తాం
వివేకా హత్యకు అవినాషే డబ్బు సమకూర్చారు
తెలంగాణ హైకోర్టుకు నివేదించిన సీబీఐ
అవినాష్‌ ఫోన్‌ ఎందుకు స్వాధీనం చేసుకోలేదు?
సీబీఐని ప్రశ్నించిన హైకోర్టు
31 వరకు ఆయనను అరెస్టు చేయొద్దన్న న్యాయస్థానం

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. రాజకీయ కుట్ర కోణంలో రహస్య సాక్షిని సీబీఐ తెరపైకి తీసుకువచ్చింది. అవినాష్‌రెడ్డికి కడప ఎంపీ సీటు ఇవ్వడం వివేకానందరెడ్డికి ఇష్టం లేదని, కావాలంటే జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి అభ్యంతరం లేదన్నారని రహస్య సాక్షి వాంగ్మూలం ఇచ్చారంది. ఏప్రిల్‌ 26న నమోదు చేసిన ఈ వాంగ్మూలాన్ని వచ్చే అభియోగపత్రంలో దాఖలు చేస్తామని, సాక్షిగానూ పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సాక్షి పేరును, వాంగ్మూలాన్ని బయటపెట్టలేమని పేర్కొంది. బయటపెడితే ఏమవుతుందో గతంలో జరిగిన సంఘటనలు చూస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించింది. వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్‌రెడ్డి ఆత్మహత్య, తొలుత వాంగ్మూలం ఇచ్చిన సీఐ శంకరయ్య తర్వాత నిరాకరించడం వంటి పలు సంఘటనలు రుజువు చేశాయని గుర్తుచేసింది. అందువల్ల కావాలంటే వాంగ్మూలాన్ని కోర్టుకు సీల్డ్‌ కవర్‌లో సమర్పిస్తామని, దాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయవచ్చని పేర్కొంది. పిటిషనర్‌కు ఇవ్వకుండా, వారి వాదన వినకుండా సీబీఐ సమర్పించిన వాంగ్మూలాన్ని పరిశీలించి దాని ఆధారంగా ఉత్తర్వులు జారీ చేయడం సహజ న్యాయసూత్రాలకు, సాధారణ న్యాయ ప్రక్రియకు విరుద్ధమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇలా పిటిషనర్‌కు వివరాలు ఇవ్వకుండా ఉత్తర్వులు జారీ చేయొచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పులు ఏమైనా ఉంటే సమర్పించాలని సీబీఐని ఆదేశించారు.

అడుగడుగునా అడ్డంకులు

సీబీఐ తరఫున న్యాయవాదులు అనిల్‌కుమార్‌, అనిల్‌ తన్వర్‌ వాదనలు వినిపిస్తూ ప్రతి దశలోనూ దర్యాప్తునకు అడ్డంకులు ఎదురయ్యాయన్నారు. సీబీఐకి కేసు అప్పగించినా దర్యాప్తు ముందుకు సాగడం లేదన్నారు. దర్యాప్తు అధికారిపైనా కేసులు పెట్టించారన్నారు. చివరికి బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే కోర్టు విచారణ తెలంగాణకు బదిలీ అయిందన్నారు. ట్రయల్‌ బదిలీ అయితే దర్యాప్తునకు ఇబ్బందులేంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. న్యాయవాది స్పందిస్తూ పిటిషనర్‌ ఈ విషయాన్ని బహిర్గతం చేశారని, పరిస్థితులు దర్యాప్తునకు అడ్డంకులు కల్పించాయన్నారు. పిటిషనర్‌కు నోటీసిస్తే మూడు నాలుగు రోజులు గడువు కోరి, ఆలోపు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తున్నారన్నారు. ఇలా అయితే దర్యాప్తును ఎలా కొనసాగించగలమని, సీబీఐని వేలెత్తి ఎలా చూపగలరని అన్నారు. ఈ కేసులో నిందితులు విచారణకు సహకరించారని, పిటిషనర్‌ సహకరించకపోవడానికి ఆయనకున్న ప్రత్యేక హోదా ఏంటని న్యాయవాదులు పేర్కొన్నారు. ఎంపీ అయితే ఏంటని, రాజకీయ హోదాను చట్టం అనుమతించదని అన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఆయనకు మీరే అంత ప్రాధాన్యమిచ్చారన్నారు. అదే సామాన్యుల కేసు అయితే ఇంత జాప్యం చేసేవారా అంటూ సీబీఐ న్యాయవాదులను ప్రశ్నించారు. హత్య కేసులో అవినాష్‌రెడ్డి పాత్ర గురించి మొదటి అభియోగపత్రం దాఖలు చేసిన తర్వాత తెలిసిందా, అంతకు ముందే తెలుసా అని ప్రశ్నించారు. సీబీఐ న్యాయవాది సమాధానమిస్తూ తదుపరి దర్యాప్తు కొనసాగింపులో గంగిరెడ్డి, శివశంకరరెడ్డి, ఉమాశంకరరెడ్డిల పాత్ర, సీఎఫ్‌ఎస్‌ల నివేదికలు వచ్చిన తరువాత వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. వివేకా హత్య కుట్రలో అవినాష్‌ భాగమయ్యారన్నారు. ఘటనా స్థలంలో సాక్ష్యాల ధ్వంసానికి పాల్పడ్డారన్నారు. రెండు రాష్ట్రాల్లో ఈ కుటుంబం ఎంత శక్తిమంతమైనదో అందరికీ తెలిసిందేనని చెప్పారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఓడించారన్నారు.

హత్యకు కారణమేంటి?

నిందితులందరూ కలిసి వివేకాను హత్య చేయడానికి కారణమేంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. అందరికీ వేర్వేరు కారణాలు ఉండటం వేరని, అందరూ కలిసి ఒకే కారణంపై కుట్ర పన్నడం మరొకటని, అరెస్టు చేసిన నలుగురు నిందితులు కలిసి కుట్రపన్నడానికి కారణమేంటని అడిగారు. వివేకా హత్యకు రాజకీయ శత్రుత్వమే కారణమని సీబీఐ న్యాయవాదులు తెలిపారు. ఏపీలో ముఖ్యంగా కడప రాజకీయాల్లో వివేకా చురుగ్గా ఉండటంతో అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకరరెడ్డిలు ఆయనకు వ్యతిరేకంగా కుట్ర మొదలుపెట్టారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటమికి కారణమైన అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకరరెడ్డిలపై వివేకా ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ఒకసారి ఓడించినవారు మరోసారీ అలా చేయవచ్చని, అంతమాత్రాన చంపాలన్న నిర్ణయం ఎలా తీసుకుంటారని న్యాయమూర్తి ప్రశ్నించారు. న్యాయవాది స్పందిస్తూ ఎమ్మెల్సీ టికెట్‌ను అవినాష్‌రెడ్డి తన అనుచరుడైన శివశంకరరెడ్డికి ఇప్పించాలని ప్రయత్నించారని, కడప ఎంపీ టిక్కెట్‌ అవినాష్‌రెడ్డికి దక్కకుండా విజయమ్మ, షర్మిలకు ఇవ్వాలన్న వివేకా వాదన వీరికి నచ్చక కుట్రకు తెర తీశారన్నారు. హత్యకు నెల రోజుల ముందే కుట్ర ప్రారంభమైందన్నారు. పరిస్థితులను చూస్తే నేరచరిత్ర ఉన్న శివశంకరరెడ్డి ద్వారా వివేకా హత్యకు పథక రచన చేసినట్లుందన్నారు. శివశంకరరెడ్డికి సన్నిహితుడైన గంగిరెడ్డిని కుట్రలో భాగస్వామిని చేసి హత్య చేయించారని పేర్కొన్నారు. భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిల అరెస్టయిన తర్వాత వారి నుంచి ఏం వివరాలు రాబట్టారని న్యాయమూర్తి ప్రశ్నించగా వారు విచారణకు సహకరించలేదన్నారు.

డబ్బు సమకూర్చింది అవినాష్‌రెడ్డే

వివేకా హత్య కుట్రను అమలు చేయడానికి డబ్బు సమకూర్చింది అవినాష్‌రెడ్డేనని సీబీఐ న్యాయవాది తెలిపారు. అవినాష్‌ శివశంకరరెడ్డికి ఇవ్వగా, ఆయన గంగిరెడ్డికి ఇచ్చారని  దస్తగిరి వాంగ్మూలంలో చెప్పారన్నారు. గంగిరెడ్డి కేంద్రంగా రూ.40 కోట్లకు కుట్ర ఒప్పందం కుదిరిందన్నారు. వివేకా హత్య కోసం రూ.4 కోట్లు ఇవ్వాల్సిన అవసరం శివశంకరరెడ్డికి లేదన్నారు. సునీల్‌ యాదవ్‌ ద్వారా దస్తగిరికి రూ.75 లక్షలు ఇచ్చారని, అందులో కొంత మొత్తాన్ని మున్నా ఇచ్చిన సమాచారంతో బ్యాంకు నుంచి రికవరీ చేసినట్లు వివరించారు.

కస్టోడియల్‌ విచారణ అవసరం

వివేకా హత్యను అవినాష్‌ గుండెపోటుగా చెప్పారన్నారు. ఈ మేరకు సీఐ శంకరయ్య వాంగ్మూలం ఇచ్చారన్నారు. ఘటనా స్థలంలో రక్తపు మరకలు తుడిచి, వివేకా శరీరంపై ఉన్న గాయాలకు కట్టుకట్టారన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ రక్తపు మరకలు తుడిచినంత మాత్రాన హత్యను గుర్తించలేరా అని ప్రశ్నించారు. ప్రజలకు ఇష్టమైన నేత చనిపోయినప్పుడు భావోద్వేగాలను నియంత్రించడానికి అలా చేసి ఉండవచ్చేమో అన్నారు. పీపీ జోక్యం చేసుకుంటూ భాస్కరరెడ్డి తదితరులు దగ్గర ఉండి రక్తపు మరకలను తుడిచివేయించారని, ఇది కుట్రలో భాగమేనని చెప్పారు. ‘అన్ని విషయాలను అవినాష్‌రెడ్డి వాళ్లు చూసుకుంటారు. ఆందోళన చెందవద్దు అని గంగిరెడ్డి మాకు చెప్పారు. స్థానిక పోలీసులు నిన్ను ప్రశ్నించినా నిజం చెప్పొద్దు. సంఘటనా స్థలాన్ని శుభ్రం చేయించాం. సాక్ష్యాలు దొరకవని గంగిరెడ్డి భరోసా ఇచ్చారు’ అని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారన్నారు. ఎం.వి.కృష్ణారెడ్డి ఫిర్యాదు చేసినప్పుడు రక్తపు మరకల ప్రస్తావన తీసుకురాలేదన్నారు. హత్యకు ముందు శివశంకరరెడ్డితో అవినాష్‌రెడ్డి చాటింగ్‌ చేశారన్నారు. అర్ధరాత్రి 1.30 నుంచి తెల్లవారుజామున 5.20 గంటల మధ్య అవినాష్‌రెడ్డి వాట్సప్‌ కాల్‌ చేశారన్నారు. అవినాష్‌రెడ్డి వాట్సప్‌లో చురుగ్గా ఉన్నట్లు ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ డిటైల్‌ రికార్డ్‌ (ఐపీడీఆర్‌) ద్వారా తేలిందన్నారు. అయితే ఎవరితో మాట్లారన్నది గుర్తించడానికి సాధ్యం కాదన్నారు. అది తెలుసుకోవాలంటే అవినాష్‌రెడ్డిని కస్టోడియల్‌ విచారణకు ఇవ్వాలని కోరారు. గంగిరెడ్డి తెల్లవారుజామున 5.20 గంటల సమయంలో అవినాష్‌తో మాట్లాడారన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ అవినాష్‌రెడ్డి ఫోన్‌ యాక్టివ్‌గా ఉన్నప్పుడు ప్రధాన నిందితుడైన గంగిరెడ్డి ఫోన్‌ కూడా యాక్టివ్‌గా ఉందా అని ప్రశ్నించారు. ఈ నెల 12న అవినాష్‌రెడ్డికి చెందిన ఐపీడీఆర్‌ సేకరించామని, గంగిరెడ్డి ఫోన్‌ వివరాలు సేకరించలేదని పీపీ చెప్పారు.

ఫోన్‌ ఎందుకు తీసుకోలేదు?

కుట్రలో అవినాష్‌రెడ్డి పాత్ర ఉందని చాలా కాలంగా అనుమానిస్తున్నప్పుడు ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి కదా అని న్యాయమూర్తి అన్నారు. అయినా ఇంతకాలం ఎందుకు స్వాధీనం చేసుకోలేదని, ఈ విషయంలో సీబీఐని కూడా అనుమానించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఫోన్‌ తీసుకోకుండా ఆయన యాక్టివ్‌గా ఉన్నారని ఎలా తెలుసుకున్నారన్నారు. పీపీ సమాధానమిస్తూ అవినాష్‌రెడ్డికి మూడు ఫోన్లు ఉన్నాయని చెప్పారు. గూగుల్‌ టేకౌట్‌ ద్వారా వివరాలు సేకరించామని, సంఘటన జరిగిన తరువాత నిందితుడు సునీల్‌ యాదవ్‌ పిటిషనర్‌ ఇంట్లో ఉన్నట్లు తేలిందన్నారు. హత్య జరిగిన రోజు నిందితులంతా కలిసే ఉన్నట్లు గూగుల్‌ టేకౌట్‌ ద్వారా తేలిందన్నారు.

ముందే తెలుసు

సంఘటన గురించి ఎం.వి.కృష్ణారెడ్డి బయటపెట్టక ముందే అవినాష్‌రెడ్డికి తెలుసని పీపీ తెలిపారు. 2019 మార్చి 15న డి.శివశంకరరెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి, తదితరులు అవినాష్‌రెడ్డి/భాస్కరరెడ్డి ఇంట్లో ఉన్నారన్నారు. అంటే నిందితులు వెంటనే వెళ్లి సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వివేకా హత్య గురించి తన కుమారుడికి తెల్లవారుజామున 4 గంటలకే తెలుసని ఉదయ్‌కుమార్‌రెడ్డి తల్లి పొరుగింటి మహిళకు చెప్పారన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఎవరో చెప్పారంటూ ఇచ్చిన వాంగ్మూలం ఎలా చెల్లుబాటవుతుంది, ఉదయ్‌కుమార్‌రెడ్డి తల్లి వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. విచారణలో భాగంగా తీసుకున్నట్లు సీబీఐ పీపీ తెలిపారు. నిందితులు నలుగురు ఉదయ్‌కుమార్‌రెడ్డితో సంప్రదింపులు జరిపినట్లు తెలిసిందన్నారు.

కౌంటరు తర్వాత ఆధారాల సేకరణ

అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్‌లో కౌంటరు దాఖలు చేసిన తర్వాత సీబీఐ కొత్తగా సాక్షులను వెతుకుతూ ఏప్రిల్‌లో వాంగ్మూలం నమోదు చేసిందని ఆయన తరఫు న్యాయవాది ఇ.ఉమామహేశ్వరరావు తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటేయడం వల్లే వివేకా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారని ఆ పార్టీ వారే వాంగ్మూలాలు ఇచ్చారన్నారు. అంతేగాకుండా అవినాష్‌ జమ్మలమడుగు ప్రచారానికి వెళుతున్నట్లు కూడా చెప్పారన్నారు. సీటు కేటాయింపులతో పిటిషనర్‌కు సంబంధం లేదన్నారు. భాస్కరరెడ్డి దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌ను కొట్టివేసినట్లు చెప్పారని, అసలు ఇప్పటివరకు ఆయన బెయిలు పిటిషన్‌ దాఖలు చేయనేలేదన్నారు. దర్యాప్తును చట్టప్రకారం కొనసాగించకుండా రాజకీయ కోణంలో కొనసాగిస్తోందని ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును 31కి వాయిదా వేశారు.


ఏమిటీ ఐపీడీఆర్‌?

ఐపీడీఆర్‌ అంటే.. ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ డిటైల్‌ రికార్డ్స్‌. ఇంటర్నెట్‌ను ఉపయోగించి ఫోన్‌లో జరిగే ప్రతి చర్య (యాక్టివిటీస్‌) దీనిలో రికార్డవుతాయి. ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ (ఐపీ) ఆధారంగా చేసే టెలిగ్రామ్‌, వాట్సప్‌ తదితర ఆడియో/వీడియో కాల్స్‌ వివరాలు దీనిలో భద్రంగా ఉంటాయి. దీని ఆధారంగా వినియోగదారు ఏయే సమయాల్లో ఇంటర్నెట్‌ ఉపయోగించారో తెలుసుకోవచ్చు. ఐపీడీఆర్‌ సహాయంతో నేరాల్లో అనుమానితులను ట్రాక్‌ చేయొచ్చు. ఫోరెన్సిక్‌ దర్యాప్తులో ఇది కీలకం కావటంతో పోలీసు, దర్యాప్తు సంస్థలకు ఉపయుక్తంగా ఉంటోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని