TDP Mahanadu: భారీ వాహనాలను అనుమతించి.. అవస్థలు పెంచారు!

సీఎం 2 గంటలు సభ నిర్వహిస్తే రెండు రోజుల నుంచి అధికార యంత్రాంగం మొత్తం అక్కడే ఉంటుంది. వందలాది పోలీసులు తరలివస్తారు.

Updated : 28 May 2023 09:21 IST

పోలీసుల ప్రేక్షక పాత్రతో పెరిగిన ట్రాఫిక్‌ కష్టాలు

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, కంబాలచెరువు : సీఎం 2 గంటలు సభ నిర్వహిస్తే రెండు రోజుల నుంచి అధికార యంత్రాంగం మొత్తం అక్కడే ఉంటుంది. వందలాది పోలీసులు తరలివస్తారు. వేమగిరి వద్ద మహానాడుపై ముందస్తు సమాచారం ఉన్నా ఏర్పాట్లలో అధికారులు విఫలమయ్యారు. వందల సంఖ్యలో వాహనాలు వస్తున్నా నిర్దేశిత పార్కింగ్‌ వైపు మళ్లించడంపై దృష్టి సారించలేదు. కొన్ని భారీ వాహనాలను మోరంపూడి మీదుగా(సభా మార్గంలో) వదిలేయడంతో ట్రాఫిక్‌ సమస్య నెలకొంది. ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య సభకొచ్చే వాహనదారులు ఇబ్బందిపడ్డారు. వేమగిరి వైపు 5 కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్య అతిథులు, ప్రతినిధులు నడుచుకుంటూనే రావాల్సి వచ్చింది.

ఎందుకీ సమస్య..: ప్రతినిధుల సభకు సుమారు 5 వేల వాహనాలు వచ్చాయని పోలీసులు చెబుతున్నారు. 25 వేల వాహనాలకు పార్కింగ్‌ సదుపాయం ఉన్నా ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పలేదు. భారీ వాహనాలకు ఆ మార్గంలో అనుమతి లేకున్నా ప్రభుత్వం కావాలనే పోలీసులతో ఆ వైపు వచ్చేలా చేసిందని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు.

మహానాడు వేదిక మార్గంలోకి భారీ వాహనాలను అనుమతించలేదని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఒకటి, రెండు వచ్చినా వాటితో ఇబ్బందేం ఉండదన్నారు. ‘కొందరు రహదారి పక్కన వాహనాలు నిలపడంతో స్వల్ప సమస్య వచ్చింది. రెండో రోజు పక్కా చర్యలు చేపడుతున్నాం. 20 వేల వాహనాలు వస్తాయని అంచనా వేస్తున్నాం’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని