చరిత్రలో నిలిచే మహనీయుడు ఎన్టీఆర్‌: తలసాని

చరిత్రలో నిలిచిపోయే మహనీయుడు, మకుటంలేని మహారాజు నందమూరి తారక రామారావు అని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కొనియాడారు.

Updated : 29 May 2023 06:33 IST

ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు, అభిమానుల నివాళి

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: చరిత్రలో నిలిచిపోయే మహనీయుడు, మకుటంలేని మహారాజు నందమూరి తారక రామారావు అని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కొనియాడారు. ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా ఆదివారం ఎన్టీఆర్‌ ఘాట్‌లోని ఆయన సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్‌ ప్రత్యేక ముద్ర వేశారన్నారు. ఆయన పోషించిన రాముడు, కృష్ణుడు పాత్రలు ప్రజల మదిలో నిలిచిపోయాయని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేయాలనే తలంపుతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేపట్టిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్‌ అని పేర్కొన్నారు. రాజకీయంగా ఎందరికో భవిష్యత్తు ఇచ్చారని, ఆ మహనీయుడి శత జయంతిని తెలుగురాష్ట్రాలలోనే కాకుండా అనేక దేశాల్లో నిర్వహిస్తుండటం సంతోషంగా ఉందన్నారు.

రాజకీయంగానూ అగ్రగామి: బాలకృష్ణ 

ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌లో నందమూరి బాలకృష్ణ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ అగ్రగామిగా నిలిచారన్నారు. తెలుగువారి రుణం తీర్చుకునేందుకు తెదేపా స్థాపించారని, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ఆయన తీసుకొచ్చిన రూ.2 కిలో బియ్యం పథకం నేడు ఆహార భద్రతగా మారిందన్నారు.

స్వల్ప తోపులాట..

తెదేపా నాయకులు, ఎన్టీఆర్‌, బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో ఘాట్‌కు చేరుకోవడంతో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. జనం పెద్ద సంఖ్యలో ఉన్న సమయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ అక్కడకు చేరుకున్నారు. ఎన్టీఆర్‌ సమాధిపై పూలుచల్లి నివాళులు అర్పించారు. నివాళులర్పించిన వారిలో ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు రామకృష్ణ, జయశ్రీ దంపతులు, మోహనకృష్ణ, నారా భువనేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులు, తారకరత్న సతీమణి వారి పిల్లలు, నటుడు రాజేంద్రప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని