రూ.2కే కిలో బియ్యం అంటే గుర్తొచ్చేది ఎన్టీఆరే: పేర్ని నాని
మరో 25 ఏళ్ల తర్వాత కూడా రూ.2 కే కిలో బియ్యం అంటే ఎన్టీఆరే గుర్తు వస్తారని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.
విజయవాడ (పటమట), న్యూస్టుడే: మరో 25 ఏళ్ల తర్వాత కూడా రూ.2 కే కిలో బియ్యం అంటే ఎన్టీఆరే గుర్తు వస్తారని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ సమీపంలోని వేదిక కల్యాణ మండపంలో ఆదివారం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్, ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి దేవినేని అవినాష్ మాట్లాడుతూ తెలుగు జాతి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు దివంగత నందమూరి తారక రామారావు అని కొనియాడారు. తన తండ్రి, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ రోజూ లేవగానే మొదట ఎన్టీఆర్ ఫొటో చూసేవారని, ఆయన తన చివరి శ్వాస వరకు అన్న అభిమానిగానే ఉన్నారని అవినాష్ గుర్తు చేశారు. అనంతరం సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఎన్టీఆర్ లలితా కళా అవార్డును ప్రదానం చేశారు. ప్రత్యేక అతిథిగా హాజరైన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ త్వరలో వ్యూహం అనే సినిమా తీస్తున్నానని, అందులో చంద్రబాబు వ్యక్తిత్వం గురించి స్పష్టంగా వివరిస్తానని వెల్లడించారు. నటుడు పోసాని, ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైకాపా నగర అధ్యక్షుడు భవకుమార్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.