Amul Milk: అమూల్ మాకొద్దు
అమూల్ డెయిరీ తమకొద్దని కర్ణాటక కన్నెర్ర చేసింది. తమ రాష్ట్రంలో పాలు సేకరించొద్దని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా అభ్యంతరం చెప్పారు.
మొన్న కర్ణాటక.. తాజాగా తమిళనాడు అభ్యంతరం
ఏపీలో పెద్దపీట వేస్తున్న సీఎం జగన్
పాల సేకరణ నుంచి అన్నీ తానై చక్కబెడుతున్న సర్కారు
బంగారుపళ్లెంలో పెట్టి ఆస్తులు అప్పగిస్తున్న వైనం
ఈనాడు - అమరావతి
అమూల్ డెయిరీ తమకొద్దని కర్ణాటక కన్నెర్ర చేసింది. తమ రాష్ట్రంలో పాలు సేకరించొద్దని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా అభ్యంతరం చెప్పారు. సహకార స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలు వద్దంటూ కేంద్ర హోంమంత్రి అమిత్షాకు లేఖ రాశారు. సీఎం జగన్ మాత్రం ఆంధ్రప్రదేశ్కే గర్వకారణంగా నిలిచిన విజయ డెయిరీని చంపేసి.. అమూల్ను తెచ్చారు. దక్షిణాదిన తొలిగా అమూల్కు స్వాగతం పలికింది ఆయనే. కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలు అమూల్ రాకతో రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నాయి. సీఎం జగన్ మాత్రం.. అమూల్తోనే ప్రయాణమంటూ గుజరాత్కు చెందిన జీసీఎంఎంఎఫ్ (గుజరాత్ సహకార పాల పంపిణీ సమాఖ్య)కు ఎర్రతివాచీ పరిచి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. ఆంధ్రప్రదేశ్ డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య (ఏపీడీడీసీఎఫ్) ఆధ్వర్యంలోని సహకార డెయిరీలను మూసేసి.. వాటికి చెందిన వేల కోట్ల ఆస్తుల్ని బంగారు పళ్లెంలో పెట్టి అమూల్కు అప్పగిస్తున్నారు.
అక్కడి ముఖ్యమంత్రులకు తెలియకనా? జగన్ అంత ముందుచూపు లేకనా?
రాష్ట్రంలో అమూల్ వచ్చాక పాల సేకరణ ధర పెరిగిందని, రైతులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగిందని సీఎం జగన్ ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే.. కర్ణాటకలో గతంలో ఉన్న భాజపా ప్రభుత్వంలోని నేతలే అమూల్కు ఎందుకు అభ్యంతరం చెప్పారనే ప్రశ్నకు సమాధానం లేదు. ఇప్పుడు తమిళనాడు సీఎం స్టాలిన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే విషయమూ.. ప్రభుత్వ పెద్దలకు తెలుసా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
* 1974లో ఏర్పాటైన కర్ణాటక సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్య (కేఎంఎఫ్) 22వేల గ్రామాల్లో 24 లక్షల మంది రైతుల నుంచి పాలు సేకరిస్తూ.. రోజుకు రూ.17 కోట్లకు పైగా చెల్లిస్తోంది. సుమారు 65కు పైగా పాలు, పాల ఉత్పత్తులను నందిని బ్రాండ్పై మార్కెటింగ్ చేస్తోంది. బెంగళూరులో అమూల్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామనే నిర్ణయంతో అక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పార్టీలకు అతీతంగా అందరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
* తమిళనాడులో 1981 నుంచి అవిన్ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ ద్వారా పాలసేకరణ, ఉత్పత్తుల విక్రయం జరుగుతోంది. రాష్ట్రంలో 9,673 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ద్వారా 4.5 లక్షల మంది సభ్యుల నుంచి 35 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నారు.
* అన్ని రాష్ట్రాల్లో రైతులకు దాణా, గడ్డి, మినరల్ మిక్చర్తో పాటు పశువుల ఆరోగ్య పరిరక్షణ, పునరుత్పత్తికి చర్యలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వమే అమూల్ ప్రతినిధిలా
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వమే అమూల్ ప్రతినిధిలా వ్యవహరిస్తోంది. గ్రామాల్లో సంఘాలను ఏర్పాటుచేసి వారి ద్వారా పాలను సేకరించి అమూల్కు సరఫరా చేస్తోంది. అవసరమైన ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లు (ఏఎంసీయూ), బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను (బీఎంసీయూ) కూడా తానే ఏర్పాటు చేస్తోంది. భవనాల నిర్మాణం, యంత్రాలకు సుమారు రూ.3వేల కోట్లకు పైగా ఖర్చు పెడుతోంది. ఇవి కాకుండా ఏపీడీడీసీఎఫ్ ఆధ్వర్యంలోని యూనిట్లను అప్పనంగా తక్కువ ధరకే కట్టబెడుతోంది. చిత్తూరు డెయిరీతో పాటు మదనపల్లె ప్లాంటును ఇప్పటికే అప్పగించింది. పట్టణాల్లో అమూల్ ఔట్లెట్ల ఏర్పాటుకు స్థలాలు కేటాయిస్తోంది. ఇవన్నీ పైసా పెట్టుబడి లేకుండా కల్పించే ప్రయోజనాలే. పశుసంవర్థక అధికారులతోపాటు ఏపీడీడీసీఎఫ్ కూడా అమూల్ కోసమే పనిచేస్తున్నాయి. జిల్లాల్లో సంయుక్త కలెక్టర్ల నుంచి గ్రామాల్లో పశుసంవర్థక సహాయకుల వరకు నిత్యం అమూల్ సేవలోనే తరిస్తున్నారు. అమూల్తో రైతుల ఆదాయం పెరిగిందంటూ.. సహకార డెయిరీలకు పాలు పోసే రైతులకు లీటరుకు రూ.4 చొప్పున బోనస్ ఇస్తామని తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీకి జగన్ నీళ్లొదిలేశారు.
అధిక ధరలే అయితే.. పాలు పోయాలంటూ ఒత్తిడి ఎందుకు?
రాష్ట్రంలో గుజరాత్ పాల ఉత్పత్తి సంఘాల ద్వారా పాల సేకరణకు జగన్ పచ్చజెండా ఊపి.. 30 నెలలు అవుతోంది. అయినా ఇప్పటివరకు రోజువారీ పాలసేకరణ 2 లక్షల లీటర్లు కూడా చేరలేదు. ధరలు ఎక్కువగా ఉంటే రైతులు పాల పోయరా? ఎవరైనా ఆపగలరా? అనే విచక్షణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు. వాస్తవానికి ఇతర డెయిరీలు ఇచ్చే ధరలతో పోలిస్తే రైతులకు అమూల్ చెల్లించేది తక్కువే. ఎస్ఎన్ఎఫ్ పేరుతో రైతులకు ఇచ్చే ధరలో కోత పెడుతోంది. అమూల్ కంటే కృష్ణా మిల్క్ యూనియన్, సంగం డెయిరీ, విశాఖ డెయిరీలు లీటరుకు రూ.7-15 వరకు అధికంగా చెల్లిస్తున్నాయి. ఏటా బోనస్లు ఇస్తున్నాయి. వీర్యాన్ని పంపిణీ చేయడంతోపాటు దాణా, వైద్యసేవలు అందిస్తున్నాయి. అయినా ప్రభుత్వం అమూల్కు పెద్దపీట వేస్తూ పాడి రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Kadapa: సచివాలయంలో సర్వేయర్పై వైకాపా కార్యకర్త దాడి
-
Jagan-adani: సీఎం జగన్తో గౌతమ్ అదానీ భేటీ
-
రోజుకు నాలుగు గంటలు ఫోన్లోనే.. పిల్లల్లో పెరుగుతున్న మొబైల్ వాడకం
-
Hyderabad: వర్షంలోనూ కొనసాగుతోన్న గణేశ్ నిమజ్జనాలు
-
ISRO Chief: సోమనాథ్ ఆలయంలో ఇస్రో ఛైర్మన్ పూజలు
-
Chandramukhi 2 Review: రివ్యూ: చంద్రముఖి-2