హథీరాంజీ మఠం భూముల విషయంలో... సింగిల్‌ జడ్జి తీర్పు రద్దు

తిరుపతిలో స్వామి హథీరాంజీ మఠం సంరక్షణలోని 25.36 ఎకరాలను సాగుచేసుకుంటున్న ‘రక్షిత కౌలుదారులకు’ విక్రయించే నిమిత్తం మఠం సంరక్షకునికి అనుమతిస్తూ 1990 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 751ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి జనవరి 2002 ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది.

Published : 30 May 2023 05:18 IST

తీర్పు వెలువరించిన హైకోర్టు ధర్మాసనం

ఈనాడు, అమరావతి: తిరుపతిలో స్వామి హథీరాంజీ మఠం సంరక్షణలోని 25.36 ఎకరాలను సాగుచేసుకుంటున్న ‘రక్షిత కౌలుదారులకు’ విక్రయించే నిమిత్తం మఠం సంరక్షకునికి అనుమతిస్తూ 1990 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 751ని రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి జనవరి 2002 ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా ఉన్నప్పుడు జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర(ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జి), జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈమేరకు తీర్పు ఇచ్చింది. 1957 నుంచి ఆ భూములు రక్షిత కౌలుదారుల సాగులో ఉన్నాయని గుర్తుచేసింది. వారి నుంచి ఆ భూములను స్వాధీనం చేసుకోవడం కష్టమైన ప్రక్రియగా మఠం సంరక్షకుడు తెలిపారని ధర్మాసనం పేర్కొంది.

స్వామి హథీరాంజీ మఠానికి చెందిన 25.36 ఎకరాలను ఎం.చెంగమ్మ, టి.మునిస్వామి నాయుడు 1957 నుంచి కౌలుదారులుగా సాగుచేసుకుంటున్నారు. ఆ భూమిని విక్రయించేందుకు దేవాదాయ కమిషనర్‌ 1985లో నోటిఫికేషన్‌ ఇచ్చారు. దానిపై స్థానికురాలు వి.నాగమణి, మరికొందరు అభ్యంతరం తెలిపారు. ఆ అభ్యంతరాలను ప్రభుత్వం తోసిపుచ్చింది. చెంగమ్మ, మునిస్వామి నాయుడులకు ఆ భూమిని విక్రయించేందుకు మఠం సంరక్షకుడికి అనుమతిస్తూ 1990లో ప్రభుత్వం 751 జీవో జారీచేసింది. ఆ జీవోను సవాలు చేస్తూ వి.నాగమణి మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జీవో 751ని రద్దు చేశారు. ఆ తీర్పును సవాలు చేస్తూ చెంగమ్మ, మరికొందరు 2002లో అప్పీల్‌ దాఖలు చేశారు. చెంగమ్మ పిల్లలు ఈ అప్పీల్లో చట్టబద్ధ వారసులుగా చేరారు. అప్పీల్లో దేవాదాయ కమిషనర్‌ కౌంటర్‌ దాఖలు చేస్తూ.. కౌలుదారుల చట్ట ప్రకారం చెంగమ్మ, మునిస్వామి నాయుడు, తదితరులు రక్షిత కౌలుదారులని పేర్కొన్నారు. భూమిని వారికే విక్రయించడం సముచితమన్నారు. మరోవైపు చెంగమ్మ వారసుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... జీవో 751 సరైనదేనన్నారు. ఆ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం... సింగిల్‌ జడ్జి తీర్పును తప్పుపట్టింది. మఠానికి పూర్తిస్థాయి సంరక్షకుడు నియమితులయ్యే వరకు ఆ భూములు విక్రయించవద్దని 1983లో హైకోర్టు ఆదేశాలిచ్చిందని తెలిపింది. అదే ఏడాది కమిషనర్‌ పూర్తిస్థాయి సంరక్షకుడిని నియమించారని పేర్కొంది. ఈ నేపథ్యంలో భూములు విక్రయించొద్దన్న హైకోర్టు ఆదేశాలు ఉనికిలో లేవని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని