సర్వర్‌ మొరాయించి.. నిలిచిన రిజిస్ట్రేషన్లు రద్దీ పెరగడమే కారణం

జూన్‌ 1 నుంచి రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువలు పెరుగుతాయన్న వార్తల నేపథ్యంలో గత వారం రోజులుగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో రద్దీ పెరిగింది.

Updated : 30 May 2023 06:32 IST

1 నుంచి భూముల మార్కెట్‌ విలువ పెరుగుతుందని హడావుడి
ప్రభుత్వం నుంచి అందని అనుమతి

ఈనాడు, అమరావతి: జూన్‌ 1 నుంచి రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువలు పెరుగుతాయన్న వార్తల నేపథ్యంలో గత వారం రోజులుగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో రద్దీ పెరిగింది. సోమవారం పలు ప్రాంతాల్లో ఇది మరింత పెరిగి సర్వర్‌పై ఒత్తిడి పడటంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఒకటో తేదీ నుంచి భూముల మార్కెట్‌ విలువలు పెంచడంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన ఆమోదం సోమవారం సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్‌ శాఖకు లభించలేదు. అయితే ప్రభుత్వ ఆమోదం లాంఛనమేనని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. భూముల మార్కెట్‌ విలువ పెరిగితే తదనుగుణంగా స్టాంపు డ్యూటీ పెరుగుతుంది. దీనివల్ల కొనుగోలుదారులపై ఆర్థిక భారం పెరుగుతుంది. దీంతో ముందే రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు క్రయవిక్రయదారులు వస్తుండటంతో రద్దీ పెరిగింది. సోమవారం ఉదయం నుంచే విజయవాడ, విశాఖ, తిరుపతి తదితర ప్రాంతాల్లో దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు అధిక సంఖ్యలో రావడంతో సర్వర్‌పై ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా డాక్యుమెంట్‌కు సంబంధించిన ‘రివర్స్‌ ఎండార్స్‌మెంట్‌’ విధానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీనివల్ల చాలా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు తక్కువగా జరిగాయి. 50 జరగాల్సిన చోట పది డాక్యుమెంట్లే పూర్తయ్యాయి. కొన్నిచోట్ల అసలు జరగనే లేదు. చాలాచోట్ల సాయంత్రానికి సాంకేతిక సమస్యలు తగ్గుముఖం పట్టాయి. జాతీయ విజ్ఞాన కేంద్రం (ఎన్‌ఐసీ) సాంకేతిక నిపుణులు సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు.

పెంపుపై వెబ్‌సైట్‌లో కనిపించని ప్రతిపాదనలు!    

రాష్ట్ర రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఈ నెల 17న జిల్లాలకు పంపిన ఆదేశాల్లో జూన్‌ 1 నుంచి పెంచిన భూముల మార్కెట్‌ విలువలను అమల్లోకి తెచ్చేలా షెడ్యూలు ఇచ్చారు. ప్రతి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలోని 20% ప్రాంతాలు/ గ్రామాల్లో మార్కెట్‌ విలువలు పెంచాలని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు తెలిపారు. స్పెషల్‌ రివిజన్‌ కింద సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో మార్కెట్‌ విలువలు పెంపుపై తయారు చేసిన ప్రతిపాదనలకు జాయింట్‌ కలెక్టర్లు ఆమోదం తెలిపారు. వీటిని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే కాకుండా అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టి, ప్రజల నుంచి అభ్యంతరాలు/ అభిప్రాయాలు సేకరించాలని రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదేశించింది.  వీటిని పరిశీలించిన తర్వాత ఖరారు చేసిన విలువల పెంపు జూన్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. కానీ అధికారిక వెబ్‌సైట్‌లో భూముల విలువల పెంపు వివరాలు ఇంకా పెట్టలేదు. అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు ప్రదర్శించకుండా వాటిపై అభిప్రాయాలు/ అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన, ఖరారు ఎలా చేస్తారో అర్థం కావడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని