AP Fibernet: రూ.99కే కొత్త సినిమా.. విడుదలైన రోజే ఇంట్లో చూసే అవకాశం

కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలైన రోజే.. రాష్ట్రంలోని ప్రేక్షకులు తమ ఇంట్లో కూర్చుని చూడొచ్చని ఏపీ ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ పి.గౌతంరెడ్డి తెలిపారు.

Updated : 31 May 2023 08:09 IST

ఏపీ ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ గౌతంరెడ్డి

విజయవాడ బస్‌స్టేషన్‌, న్యూస్‌టుడే: కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలైన రోజే.. రాష్ట్రంలోని ప్రేక్షకులు తమ ఇంట్లో కూర్చుని చూడొచ్చని ఏపీ ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ పి.గౌతంరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ ద్వారా ఇది సాధ్యమవుతోందని ఆయన చెప్పారు. విజయవాడలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘సినిమా తీసే నిర్మాతకు, చూసే ప్రేక్షకుడికి ఇద్దరికీ లాభం కలిగేలా కొత్త సినిమా అవకాశం కల్పిస్తున్నాం. ఫస్ట్‌డే.. ఫస్ట్‌షో అనే పద్ధతిలో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాం. జూన్‌ 2న విశాఖపట్నంలో లాంఛనంగా ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్‌ దీన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి కథానాయకుడు సాయి రోనక్‌, నిర్మాతల మండలి సభ్యులు సి.కళ్యాణ్‌, రమా సత్యనారాయణ హాజరవుతారు. ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌లో తొలుత నిరీక్షణ సినిమా ప్రదర్శిస్తాం. రూ.99తో సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే కొత్త సినిమా చూడొచ్చు. సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నప్పటి నుంచి 24 గంటల వరకు ఆ సినిమాను చూసే అవకాశం ఉంటుంది. ఇది ఓటీటీ తరహాలో కాకుండా నేరుగా లైవ్‌లో చూసేలా ఉంటుంది. ఇప్పటికే గ్రామీణప్రాంతాల్లో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ కనెక్టివిటీ ఎక్కువగా ఉండడంతో పట్టణాలకు వచ్చి థియేటర్లలో సినిమా చూడలేనివారికి ఇది బాగా ఉపయోగపడుతుంది’’ అని గౌతంరెడ్డి వివరించారు.

55 వేల కి.మీ. ఓఎఫ్‌సీ లక్ష్యం

ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేసేందుకు 55వేల కి.మీ ఓఎఫ్‌సీని తీసుకెళ్లాలన్న లక్ష్యం పెట్టుకున్నట్లు గౌతంరెడ్డి చెప్పారు. ఇప్పటివరకు 37వేల కి.మీ. వరకు వేశామన్నారు. 11,254 గ్రామ పంచాయతీల్లో 7600 పైచిలుకు గ్రామాలకు ఫైబర్‌నెట్‌ కనెక్టివిటీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రజలందరికీ తమ సేవలను చేరువ చేసేందుకు రెండు మూడు నెలల్లో కొత్త బాక్సులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే 5 కంపెనీలతో చర్చించామని, వచ్చే నాలుగేళ్లలో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ను మరింత బలోపేతం చేయడానికి ప్రణాళికలు తయారు చేశామని ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని