Nellore: అధికారుల తీరుకు నిరసనగా.. చెప్పుతో కొట్టుకున్న సర్పంచి

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి ఎంపీడీవో కళాధర్‌రావు, ఏపీవో శ్రీనివాసులు తీరును నిరసిస్తూ తెదేపా మద్దతు సర్పంచులు, నాయకులు ఆందోళన నిర్వహించారు.

Updated : 31 May 2023 06:47 IST

కలిగిరి, న్యూస్‌టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి ఎంపీడీవో కళాధర్‌రావు, ఏపీవో శ్రీనివాసులు తీరును నిరసిస్తూ తెదేపా మద్దతు సర్పంచులు, నాయకులు ఆందోళన నిర్వహించారు. మంగళవారం మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన తెదేపా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు కార్యాలయం ద్వారం ఎదుట నాయకులతో కలిసి బైఠాయించారు. వైకాపాకు కొమ్ముకాస్తున్నారంటూ ఎంపీడీవో, ఏపీవోలకు వ్యతిరేకంగా నినదించారు. తాను ఎన్నికై ఏళ్లు గడుస్తున్నా గ్రామస్థులకు ఎలాంటి న్యాయం చేయలేకపోయానంటూ రావులకొల్లు సర్పంచి వెంగపనాయుడు తన చెప్పుతో పదేపదే కొట్టుకున్నారు. ఇలాంటి ఎంపీడీవోను ఎప్పుడూ చూడలేదని వెంగపనాయుడు, ఎంపీటీసీ సభ్యురాలు కమలమ్మ తదితరులు ఆరోపించారు. తెదేపా ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో తెదేపా సర్పంచులతో సంబంధిత అధికారులు సమావేశమయ్యారు. ఉపాధి హామీలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని సర్పంచులు వారిని నిలదీశారు. అధికార పార్టీకి కొంత చేయాల్సి వస్తోందని అధికారులు చెప్పడంతో సర్పంచులు తాము న్యాయపోరాటం చేస్తామంటూ ఆందోళనను విరమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని