నేడు లబ్ధిదారుల ఖాతాల్లో రైతు భరోసా జమ

వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద 52.31 లక్షల మంది రైతుల ఖాతాల్లో మొదటి విడతగా రూ.3,923.21 కోట్లను గురువారం జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

Published : 01 Jun 2023 03:40 IST

52.31 లక్షల మందికి ప్రయోజనం

ఈనాడు, అమరావతి: వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద 52.31 లక్షల మంది రైతుల ఖాతాల్లో మొదటి విడతగా రూ.3,923.21 కోట్లను గురువారం జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కర్నూలు జిల్లా పత్తికొండలోని సెయింట్‌ జోసెఫ్‌ ఇంగ్లిషు మీడియం పాఠశాలలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్‌ బటన్‌ నొక్కి ఒక్కొక్కరి ఖాతాలో రూ.5,500 జమ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. పీఎం కిసాన్‌ కింద రావాల్సిన రూ.2 వేలను ఆ నిధులు విడుదలైన తర్వాత రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. వరుసగా అయిదో ఏడాది పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు.. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్‌, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా ప్రయోజనాన్ని అందించనున్నారు. ఈ పథకం కింద గత నాలుగేళ్లలో రూ.30,985 కోట్లు అందించినట్లు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా 30,382 హెక్టార్లలో దెబ్బతిన్న పంటలకు సంబంధించి 47,999 మంది రైతులకు రూ.44.19 కోట్లు, కోతల తర్వాత దెబ్బతిన్న పంటలకు సంబంధించి 3,469 మంది జొన్న, మొక్కజొన్న రైతులకు రూ.9.43 కోట్ల పెట్టుబడి రాయితీని వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది. కార్యక్రమంలో పాల్గొనడానికి గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి బయలుదేరి కర్నూలు చేరుకుంటారు. బహిరంగ సభ అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి వెళ్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని