ఆర్టీసీలో సీనియర్‌ ఈడీకి స్థానచలనం

ఆర్టీసీలో అత్యంత సీనియర్‌గా ఉంటూ, కీలకమైన పరిపాలన విభాగం చూస్తున్న ఈడీ కోటేశ్వరరావుని ఆ బాధ్యత నుంచి తప్పించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Published : 01 Jun 2023 05:16 IST

అందరి కంటే జూనియర్‌కు కీలక బాధ్యతలు

ఈనాడు, అమరావతి: ఆర్టీసీలో అత్యంత సీనియర్‌గా ఉంటూ, కీలకమైన పరిపాలన విభాగం చూస్తున్న ఈడీ కోటేశ్వరరావుని ఆ బాధ్యత నుంచి తప్పించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ క్యాడర్‌లో అందరి కంటే జూనియర్‌ అయిన బ్రహ్మానందరెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించడంపై ఆర్టీసీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. సంస్థలో నలుగురు ఈడీలు, 13 మంది అధికారులను బదిలీలు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో పరిపాలన విభాగం ఈడీగా ఉన్న ఎ.కోటేశ్వరరావుని ఆపరేషన్స్‌ విభాగానికి, ఆపరేషన్స్‌ విభాగం చూస్తున్న కేఎస్‌ బ్రహ్మానందరెడ్డిని పరిపాలన విభాగానికి బదిలీ చేశారు. జోన్‌-2 (విజయవాడ) ఈడీ గిడుగు వెంకటేశ్వరరావుని జోన్‌-4 (కడప)కి, అక్కడ ఈడీగా ఉన్న కె.గోపీనాథ్‌రెడ్డిని జోన్‌-2కి బదిలీ చేశారు. ఇంకా గుంటూరు, విజయనగరం జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారులు, తదితరులను బదిలీలు చేశారు.

జూనియర్‌కు కీలక పోస్టు

ఆర్టీసీలో పరిపాలన, ఇంజినీరింగ్‌, ఆపరేషన్స్‌ విభాగాలతో పాటు, విజయనగరం, విజయవాడ, నెల్లూరు, కడప జోన్లకు కలిపి మొత్తం ఏడుగురు ఈడీలు ఉన్నారు. వీరిలో పరిపాలన విభాగం ఈడీగా ఉన్న కోటేశ్వరరావు సీనియర్‌. ఆయన మరో 9 నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. అలాగే ఆయన ఈ పోస్టులో చేరి అయిదేళ్లు పూర్తికాలేదు. అయినప్పటికీ ఆయన్ను మార్చారు. పైగా ఈడీలు అందరి కంటే జూనియర్‌ అయిన బ్రహ్మానందరెడ్డిని.. సంస్థలో ఎండీ తర్వాత అత్యంత కీలక పదవిగా భావించే పరిపాలన ఈడీగా బదిలీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని