సీఎంవోకి చేరిన ఆర్‌అండ్‌బీ బదిలీల పంచాయితీ

రహదారులు, భవనాల శాఖలో ఇంజినీర్ల బదిలీల వ్యవహారం బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)కి చేరింది.

Published : 01 Jun 2023 05:16 IST

మంత్రి పేషీ చేసిన అడ్డగోలు సిఫార్సులకు చెక్‌
నిబంధనల ప్రకారం బదిలీలకు ఆదేశాలు

ఈనాడు, అమరావతి: రహదారులు, భవనాల శాఖలో ఇంజినీర్ల బదిలీల వ్యవహారం బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)కి చేరింది. ఆ శాఖకు చెందిన అమాత్యుని పేషీ ద్వారా అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘించి బదిలీలు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్న వైనం, ఇంజినీర్ల నుంచి రేట్లు నిర్ణయించి వసూళ్లు చేస్తున్న తీరుపై ‘ఈనాడు’లో వరుస కథనాలు వచ్చాయి. ఆ శాఖ కార్యదర్శి కూడా బదిలీల వ్యవహారంలో కఠినంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో ఈ పంచాయితీ సీఎంవోకి చేరింది. బదిలీలపై కసరత్తు పూర్తి చేసిన అధికారులు ఆ జాబితాను సీఎం కార్యాలయానికి తీసుకెళ్లి, అక్కడి కీలక అధికారితో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఆ శాఖ మంత్రి పేషీపై వచ్చిన వసూళ్ల ఆరోపణలు, అమాత్యుని బంధువుతోపాటు పేషీలో ఓ అధికారి ద్వారా చేస్తున్న దందాపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. చివరకు నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే బదిలీలు చేయాలని సీఎంవో అధికారి సూచించినట్లు తెలిసింది. అమాత్యుని పేషీ చేసిన అడ్డగోలు సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవద్దని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో అధికారులు వాటికి అనుగుణంగా నిబంధనల ప్రకారం అర్హులైన ఇంజినీర్లు, అసలైన కారణాలతో బదిలీ కావాలని కోరిన వారిని మాత్రమే.. బదిలీల జాబితాలో చేర్చి, ఆదేశాలిచ్చినట్లు సమాచారం. పనిచేసే స్థానంలో రెండేళ్లలోపున్న 20 మంది ఏఈ, డీఈలను బదిలీ చేయాల్సిందేనని అమాత్యుని పేషీ చేసిన ప్రతిపాదన పూర్తిగా పక్కనపెట్టినట్లు తెలిసింది. కొందరు ఎస్‌ఈల బదిలీల ప్రయత్నాలు కూడా ఫలించలేదని తెలుస్తోంది.

పేషీలోని అధికారిపై బదిలీ వేటు?

ఆర్‌అండ్‌బీ అమాత్యుని పేషీలో బదిలీల కోసం వసూళ్ల వ్యవహారం రెండేళ్లుగా తీవ్ర చర్చనీయాంశమవుతున్న సంగతి తెలిసిందే.  అమాత్యుని కుటుంబీకుడొకరు నిత్యం పేషీలోనే ఉంటూ అన్ని వ్యవహారాలు చూస్తుంటారని, ఓ రకంగా ఆయనే మంత్రిలా వ్యవహరిస్తారని ఆ శాఖలో అంతా చెబుతారు. ఆయన అండతో అక్కడ ఆన్‌డ్యూటీ కింద పనిచేస్తున్న ఓ అధికారి పెద్దఎత్తున దందా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై సీఎంవో అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రి పేషీలో చక్రం తిప్పుతున్న అధికారిని వెంటనే బదిలీ చేసి, ఆయన పనిచేసే జిల్లాలోని మారుమూల ప్రాంతానికి పంపాలని గట్టిగా చెప్పినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని