విద్యుత్‌ రంగంలో రూ.33 లక్షల కోట్ల పెట్టుబడి కావాలి

దేశంలో విద్యుత్తు డిమాండ్‌ 2026-27 నాటికి 277.2 గిగావాట్లకు, 2031-32 నాటికి 366.4 గిగావాట్స్‌కు చేరుతుందని జాతీయ విద్యుత్తు ప్రణాళిక కమిటీ పేర్కొంది.

Published : 01 Jun 2023 05:16 IST

2031-32 నాటికి 366.4  గిగావాట్స్‌ కరెంట్‌కు డిమాండ్‌
ఆంధ్రప్రదేశ్‌కు 24,387 మెగావాట్లు కావాలి
తెలంగాణకు 27,059 మెగావాట్లు అవసరం
పదేళ్ల అంచనాలపై జాతీయ  విద్యుత్తు ప్రణాళిక కమిటీ నివేదిక

ఈనాడు, దిల్లీ : దేశంలో విద్యుత్తు డిమాండ్‌ 2026-27 నాటికి 277.2 గిగావాట్లకు, 2031-32 నాటికి 366.4 గిగావాట్స్‌కు చేరుతుందని జాతీయ విద్యుత్తు ప్రణాళిక కమిటీ పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,98,986 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉందని, భవిష్యత్తు డిమాండ్‌ను అందుకోవాలంటే 2022-27 మధ్యకాలంలో 2,11,819 మెగావాట్లు, 2027-32 మధ్యకాలంలో 2,91,802 మెగావాట్ల అదనపు విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. ఈ సామర్థ్యాన్ని విస్తరించాలంటే 2022-27 మధ్యకాలంలో రూ.14,54,188 కోట్లు, 2027-32 మధ్యకాలంలో రూ.19,06,406 కోట్లు కలిపి పదేళ్లలో రూ.33,60,594 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని ఈ కమిటీ అంచనా వేసింది. ఇందులో డెవలపర్స్‌ ఈక్విటీ కింద రూ.8,40,149 కోట్లు, రుణం కింద రూ.25,20,446 కోట్లు సమీకరించాల్సి వస్తుందని వెల్లడించింది. 2021-22లో 2,03,115 మెగావాట్ల మేర ఉన్న రాష్ట్రాల విద్యుత్తు డిమాండ్‌ 2026-27 నాటికి 2,77,201 మెగవాట్లకు, 2031-32 నాటికి 3,66,393 మెగావాట్లకు చేరుతుందని తెలిపింది. పదేళ్లలో విద్యుత్తు డిమాండ్‌ 80% మేర పెరగనున్నట్లు వెల్లడించింది.

మెగావాట్‌ ఖర్చు రూ.8.56 కోట్ల నుంచి రూ.10.83 కోట్లకు

2022-23లో థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తికి మెగావాట్‌కు రూ.8.56 కోట్లు ఖర్చవుతుండగా, 2031-32 నాటికి ఈ ధర రూ.10.83 కోట్లకు (26%పెరుగుదల) చేరనున్నట్లు అంచనా వేసింది. మిగతా వనరుల ద్వారా చేసే విద్యుత్తు ఉత్పత్తి ఖర్చు కూడా పెరగనున్నట్లు వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 13,510 మెగావాట్లు

2031-32 నాటికి ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ డిమాండ్‌ 94%మేర, తెలంగాణ డిమాండ్‌ 91%మేర పెరగనున్నట్లు పేర్కొంది. ఇదే సమయంలో ఏపీలోని శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్‌పవర్‌ స్టేషన్‌ స్టేజ్‌-2 కింద 800 మె.వా, నార్ల తాతారావు టీపీఎస్‌ స్టేజ్‌-4లో 800 మెగావాట్లు, పోలవరం ప్రాజెక్టు కింద 960 మెగావాట్ల జలవిద్యుత్తు, పిన్నాపురం, సోమశిల, అవుకు, ఎర్రవరం, పైడిపాలెం ఈస్ట్‌, పైడిపాలెం నార్త్‌, శింగనమల, అప్పర్‌సీలేరు, గండికోట, చిత్రావతి, కురుకుట్టి, కర్రివలస వద్ద నిర్మించిన పంప్డ్‌స్టోరేజ్‌ ప్లాంట్ల నుంచి 10,950 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది.

తెలంగాణలో నూతనంగా 6,400 మెగావాట్లు

2022-32 మధ్యకాలంలో తెలంగాణలోని యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో (5×800) 4వేల మెగావాట్లు, ఎన్‌టీపీసీ యూనిట్లు 1, 2 నుంచి 1,600 మెగావాట్లు, సింగరేణి యూనిట్‌ 3 నుంచి 800 మెగావాట్లు కొత్తగా అందుబాటులోకి రానున్నట్లు ఈ కమిటీ అంచనా వేసింది. 2022-32 మధ్యకాలంలో తెలంగాణలోని రామగుండం బీటీపీఎస్‌-యూ2 (62.5మె.వా) రిటైర్‌ కానున్నట్లు తెలిపింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు