Odisha Train Accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో దూర ప్రాంతాలకు వెళ్లే 18 రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. టాటానగర్‌ స్టేషన్‌ మీదుగా మరో ఏడు రైళ్లను మళ్లించినట్లు వెల్లడించారు.

Updated : 03 Jun 2023 07:19 IST

ఈనాడు, విశాఖపట్నం: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో దూర ప్రాంతాలకు వెళ్లే 18 రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. టాటానగర్‌ స్టేషన్‌ మీదుగా మరో ఏడు రైళ్లను మళ్లించినట్లు వెల్లడించారు. రద్దైన రైళ్లలో.. హావ్‌డా-పూరీ సూపర్‌ఫాస్ట్‌ (12837), హావ్‌డా-బెంగళూరు సూపర్‌ఫాస్ట్‌ (12863), హావ్‌డా-చెన్నై మెయిల్‌ (12839), హావ్‌డా-సికింద్రాబాద్‌(12703), హావ్‌డా-హైదరాబాద్‌(18045), హావ్‌డా-తిరుపతి(20889), హావ్‌డా-పూరీ సూపర్‌ఫాస్ట్‌ (12895), హావ్‌డా-సంబల్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ (20831), సంత్రగాచి-పూరీ ఎక్స్‌ప్రెస్‌ (02837) ఉన్నట్లు అధికారులు తెలిపారు.

* బెంగళూరు-గువాహటి(12509) రైలును విజయనగరం, టిట్లాగఢ్‌, జార్సుగుడా, టాటా మీదుగా దారి మళ్లించారు. ఖరగ్‌పుర్‌ డివిజన్‌లో ఉన్న చెన్నై సెంట్రల్‌-హావ్‌డా(12840) రైలును జరోలి మీదుగా, వాస్కోడగామా-షాలిమార్‌(18048), సికింద్రాబాద్‌-షాలిమార్‌(22850) వారాంతపు రైళ్లను కటక్‌, అంగోల్‌ మీదుగా దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

గోవా-ముంబయి వందేభారత్‌ ప్రారంభం వాయిదా

మడ్గావ్‌ స్టేషన్‌ నుంచి ప్రారంభించదలచిన గోవా-ముంబయి వందేభారత్‌ రైలు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కొంకణ్‌ రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమైతే శనివారం ఉదయం వీడియో అనుసంధానం ద్వారా ప్రధాని మోదీ ఈ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించాల్సి ఉంది.

* ఒడిశా  రైలు ప్రమాదంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొని బాధితులకు చేయూతనివ్వాలని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఒడిశా రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తన పదవికి రాజీనామా చేయాలని సీపీఐ ఎంపీ బినయ్‌ విశ్వం డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని