మార్గదర్శి ఎండీపై లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ సస్పెన్షన్‌

మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ సీహెచ్‌.శైలజకు వ్యతిరేకంగా మే 17న జారీ అయిన లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ (ఎల్వోసీ)ని తెలంగాణ హైకోర్టు సస్పెండ్‌ చేసింది.

Updated : 03 Jun 2023 06:48 IST

హైదరాబాద్‌ రావడానికి అడ్డంకులు సృష్టించరాదు
తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ సీహెచ్‌.శైలజకు వ్యతిరేకంగా మే 17న జారీ అయిన లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ (ఎల్వోసీ)ని తెలంగాణ హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ఈ నెల 3న ఎండీ హైదరాబాద్‌ రావడానికి ఎలాంటి ఇబ్బందులు సృష్టించరాదని ప్రతివాదులైన కేంద్ర, ఏపీ ప్రభుత్వాలను ఆదేశించింది. ఏపీలో నమోదైన కేసు ఆధారంగా జారీ చేసిన ఎల్వోసీని సవాలు చేస్తూ మార్గదర్శి ఎండీ సీహెచ్‌.శైలజ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన జస్టిస్‌ కె.శరత్‌ శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. మార్గదర్శి ఎండీ హైదరాబాద్‌లో ఉండటంతోపాటు సంస్థపై ఒక్క ఫిర్యాదూ లేదని, అన్ని రికార్డులు దర్యాప్తు సంస్థ వద్ద ఉన్నందున మార్గదర్శి ఎండీ, ఛైర్మన్‌లపై కఠిన చర్యలు తీసుకోరాదంటూ ఇదే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఈ కోర్టుకు పరిధి ఉంది

పిటిషనర్‌కు వ్యతిరేకంగా దర్యాప్తు అధికారి జారీ చేసిన లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ ఈ కోర్టు పరిధిలోకి వస్తుందని, అందువల్ల ఈ పిటిషన్‌పై విచారించే పరిధి కూడా కోర్టుకు ఉందని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. పరిధికి సంబంధించి మార్గదర్శి గతంలో దాఖలు చేసిన పిటిషన్లపై ఇదే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులనూ ప్రస్తావించారు. మార్చి 23న పిటిషనర్‌కు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రతివాదులు మే 17న ఎల్వోసీ జారీ చేశారన్నారు. ఈ నేపథ్యంలో దాన్ని సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని