పకడ్బందీగా గ్రూప్‌-1 మెయిన్స్‌పకడ్బందీగా గ్రూప్‌-1 మెయిన్స్‌

రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను 6,455 మంది రాయనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. ఈనెల 3 నుంచి 10వ తేదీ వరకు పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతాయని చెప్పారు.

Published : 03 Jun 2023 05:13 IST

హాజరుకానున్న 6,455 మంది అభ్యర్థులు
ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌

చిట్టినగర్‌ (విజయవాడ), న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను 6,455 మంది రాయనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. ఈనెల 3 నుంచి 10వ తేదీ వరకు పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతాయని చెప్పారు. ఆయన శుక్రవారం కమిటీ సభ్యులతో కలిసి పరీక్షా కేంద్రాలుగా కేటాయించిన విజయవాడలోని కొత్తపేటలోని కాకరపర్తి భావానారాయణ (కేబీఎన్‌) కళాశాల, అక్కడే ఉన్న పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజినీరింగ్‌ కళాశాలలను సందర్శించారు. కేబీఎన్‌లో 301, పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్‌ కళాశాలలో 1006 మంది అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి, ఇన్విజిలేటర్లకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘రాష్ట్రవ్యాప్తంగా పది జిల్లాల్లో 11 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. సీసీ కెమెరాలను హెడ్‌క్వార్టర్‌కు అనుసంధానం చేసి కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా పర్యవేక్షిస్తాం. మాల్‌ప్రాక్టీస్‌ జరగడానికి ఆస్కారం ఉండదు. పరీక్షలు పూర్తిగా ఆఫ్‌లైన్‌లో జరుగుతాయి. ప్రశ్నపత్రాలతో పాటు జవాబు పత్రాల బుక్‌లెట్‌ ఇస్తాం. పేపర్‌ లీకేజీకి అవకాశం లేకుండా గట్టి చర్యలు చేపట్టాం. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ఉదయం 8.30 గంటలకే హాజరుకావాలి. ముఖగుర్తింపుతో పరీక్షా కేంద్రాల్లోకి పంపుతాం. 290 మంది దివ్యాంగ అభ్యర్థులున్నారు. వారికి ఒక గంట అదనపు సమయం కేటాయిస్తున్నాం...’ అని కార్యదర్శి జె.ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. ఏపీపీఎస్సీ కమిటీ సభ్యులు, కేబీఎన్‌, పీఎస్‌సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు వి.నారాయణరావు, జె.లక్ష్మీనారాయణ, ప్లేస్‌మెంట్‌ అధికారి మణికంఠ తదితరులున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు