రూ.23.62 కోట్లతో అంగన్‌వాడీ కేంద్రాలకు వంట సామగ్రి

అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.23.62 కోట్లతో వంట పాత్రలు, కుక్కర్‌, గ్యాస్‌ స్టవ్‌ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.

Updated : 03 Jun 2023 05:55 IST

వచ్చే నెల నుంచి గర్భిణులు, బాలింతలకు ఇంటికే సరకులు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.23.62 కోట్లతో వంట పాత్రలు, కుక్కర్‌, గ్యాస్‌ స్టవ్‌ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వచ్చే నెల నుంచి గర్భిణీలు, బాలింతలకు కేంద్రాల్లో వంట చేసి వడ్డించడం నిలిపేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. నిర్దేశిత పరిమాణంలో ఇంటి సరకులు అందిస్తామని తెలిపింది. 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే కేంద్రాల్లో వంట చేసి వడ్డిస్తారు. ప్రస్తుతం ఉన్న వంట పాత్రలే చాలా చోట్ల సరిపోతాయని సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వంట సామగ్రి కొనుగోలుకు ఆదేశాలివ్వడం మహిళా శిశు సంక్షేమశాఖలో చర్చనీయాంశంగా మారింది. నెల రోజుల కిందట ఇదే ప్రతిపాదన రాగా అధికారులు సంబంధిత దస్త్రాన్ని వెనక్కి పంపినట్లు సమాచారం. ఇప్పుడు మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సెలవులో ఉండగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు కొనుగోలుకు అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు యూనిఫాం చీరల కొనుగోలుకు కేటాయించిన మొత్తంలో మిగిలిన సొమ్మును కొనుగోలుకు వినియోగించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని